23, ఏప్రిల్ 2020, గురువారం

బామ్మ - నమ్మకాలు

బామ్మ - నమ్మకాలు 

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                                 బామ్మకి భలే భలే తమాషా నమ్మకాలు చాలా ఉండేవి. మేమంతా చాదస్తం అని తిట్టుకునే వాళ్ళం. ఈవిడ పెద్దదవుతున్న కొద్దీ పిచ్చి పిచ్చి చాదస్తాలు పెరిగాయ్ అనుకునే వాళ్ళం. కానీ మా అమ్మ కూడా ఎప్పుడూ ఈ నమ్మకాలకి ఎదురు చెప్పేదీ కాదు, సణుక్కునేదీ కాదు. ఇక్కడో చిన్న పిట్టకథ. చాదస్తం, ఛాందసము అనే మాటలకి అసలు అర్ధం ఉత్పత్తీ ఏమిటో చెప్తా. పద్యాలు రాయటానికి ఛందస్సు అవసరం. మనం అందరం ఈ ఛందస్సుని వ్యాకరణంలో చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ఒక్కోసారి పదాలు ఆ ఛందస్సులో ఇమడకపోతే పదాన్ని ఏదో ఒక లాగా ట్విస్ట్ చేసి, తు, చ లాంటి అక్షరాలని కలిపి మొత్తం మీద ఆ పదం ఆ ఛందస్సులో సరిపోయేలాగా చేసేవాళ్ళు. ఎవరైనా పద్యాల్లో తప్పులు వెతికితే, లేదా ఛందస్సు కోసం తప్పు పదం వేశావు అని లోపం కనుక చూపిస్తే, "వాడికి చాదస్తం, ఛాందసము" అనటం, అటువంటివాడిని చాదస్తుడు, ఛాందసుడు అంటం అందరికీ అలవాటైపోయింది. ఇప్పటికీ ఇలా ఇంకా పాత పద్ధతులను పట్టుకు వేళ్ళాడే వాళ్ళను చూస్తే, చాదస్తం అంటం పరిపాటై పోయింది. 

                                                                సరే, బామ్మ నమ్మకాల దగ్గరికి వద్దాం. మొదటిది తుమ్ము. ఈ తుమ్ముకి రకారకాల చోట్ల తుమ్మితే రకరకాల పరిహారాలుండేవి. ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు, మరొకరు గానీ, లేదా వాళ్ళే గానీ తుమ్మారనుకోండి. వెంటనే చెప్పులు విడిచి కూర్చోవాలి. కాసేపయ్యాక వెళ్లి కాళ్ళు కడుక్కు రావాలి. ఆ తరువాత కూర్చుని కాసిని అయినా సరే మంచినీళ్లు తాగాలి. అప్పుడు గానీ మళ్ళీ లేచి బయటకు వెళ్లే అవకాశం లేదు. ఇక రెండో రకం తుమ్ము.  గుమ్మం దాటుతూ తుమ్మామనుకోండి. బామ్మ వెంటనే "కదలకు(స్టాట్యూ), అలాగే నుంచో", అంటుందన్నమాట. అప్పుడు ఎవరో వచ్చి మన తలపై వున్న గుమ్మం మీద ఓ గుప్పెడు నీళ్లు తెచ్చి చల్లేవాళ్లన్న మాట. అప్పుడు కానీ కదలటానికి వీల్లేదు. మళ్ళీ చచ్చినట్టు ఆ కింద పడ్డ నీళ్లు మనమే తుడవాలి. ఎవరైనా సరే తుమ్మంగానే, పక్కనే వున్న పెద్దవాళ్ళు, 'చిరంజీవ' అని దీవించాలి. ఇంగ్లీష్ వాళ్ళు కూడా 'బ్లెస్ యు' అంటారు. నిజానికి మనం తుమ్మేటప్పుడు ఊపిరి బిగపట్టటం వల్ల మనం ఒక శ్వాస మిస్ అవుతాం. అందుకని ఈ దీవెన. సరే, ఈ గుమ్మం తుమ్ము అయిపోయిందా, మరో రకం తుమ్ము భోజనం చేసేటప్పుడు వస్తే, దానికి వేరే పరిహారం వుంది. అదేమిటంటే, వెంటనే తినటం ఆపేసి, పైకి చూసి, చేత్తో ఎవరికి వాళ్ళే, కాసిని నీళ్లు, పక్కనే గ్లాసులో వుంటాయిగా, పైకి రూఫ్ వైపుకు చల్లుకోవాలి. ఆ తరువాత, మనం పుట్టిన వూరు, ఆ ఊరి దేవుడు పేరు చెప్పాలి. బహుశా జ్ఞాపకశక్తికి పరీక్షో, లేదా ఆ దేవుడిని రక్షించమని వేడుకోవటమో అయ్యుండాలి. అదే అన్నం తినేటప్పుడు పొలమారితే, (ఇప్పుడు మనం విండ్ పైప్ లోకి ఫుడ్ పోయింది అంటామే, అదన్నమాట" అన్నం తినటం ఆపేసి కాసేపు మెడ బాగా పైకెత్తి పైకి చూసి మళ్ళీ తినమనేది. పైగా ఎవరో నిన్ను తలుచు కుంటున్నారు అనేది. మా అత్తగారు కూడా ఎవరైనా తుమ్మితే, వెంటనే, "దీర్ఘాయుష్మంతు, మార్కండేయ ఆయుష్మంతు" అనేది. మా ఆయన మాత్రం, ఎప్పుడైనా తుమ్మితే, హైదరాబాద్ భాషలో 'తుమ్ము భాన్చద్'  అనేవారు. నేనే "మీ అమ్మగారలా అంటే, మీరు ఇలా అంటారా" అని దెబ్బలాడి, ఆ అలవాటు మాన్పించా. ఇప్పుడు ఆయన కూడా నాలాగే  సింపుల్ గా చిరంజీవ అంటున్నార్లెండి. 

                                                               అలాగే బామ్మ శకున శాస్త్రం, బల్లి శాస్త్రం చూసేది. బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురు రాకూడని వాళ్ళు ఎదురొస్తే మాత్రం, ఆపేసేది. వెళ్లనిచ్చేది కాదు. బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొచ్చినా, ఒంటి బ్రాహ్మడు ఎదురొచ్చినా ఆగి కూర్చుని, కాళ్ళు కడుక్కొని, మంచినీళ్లు తాగి అప్పుడు వెళ్లాల్సిందే. అల్లాగే ఇంటికి వచ్చిన వాళ్లెవరైనా సరే,  వచ్చిన తొమ్మిదోరోజు తిరుగు ప్రయాణం చేయకూడదు. కనుక ఎనిమిదో రోజుకో, పదో రోజుకో వాళ్ళు ప్రయాణం మార్చుకోవాల్సిందే. ఇంకోటి అమావాస్య, అమావాస్య తరువాత పాడ్యమి, అష్టమి, నవమి ఇలా యేవో బోల్డు తిధులు చెప్పేది. అవి వున్న రోజుల్లో ప్రయాణం చెయ్యకూడదు. ఒకవేళ తప్పనిసరి అయి, అలాంటి రోజుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే, ముందు రోజే, ఏ పక్కింటి వాళ్లింట్లోనో, నిర్ఘ్యం పెట్టించేది. నిర్ఘ్యం అంటే ఏమిటంటే, మనం తీసుకు వెళ్లాల్సిన సామాన్లలో ఏదో ఒకటి ముందే సద్దేసి పక్కింట్లో పెట్టాలి. దాన్ని మర్నాడు వెళ్లేటప్పుడు, తప్పనిసరిగా వాళ్ళింటి నుండి తీసుకుని, ఆ ఇంటి నుండి బయలుదేరుతున్నట్లుగా వెళ్లాలి. దీని వల్ల, మనింటి నుంచి ఈ రోజే వెళ్లినట్లు, పక్కింటినుండి మర్నాడు వెళ్లినట్లు అయ్యేది.  నాకు ఈ సూత్రమేమిటో అర్ధం అయ్యేది కాదు. అయినా అందరూ పాటించే వాళ్ళు. ఇక బల్లి శాస్త్రం. పొరపాటున బల్లి మన మీద పడితే, ఒక్కోచోట పడితే ఒక్కో ఫలితమని పంచాంగంలో రాసి ఉండేది. బామ్మ వెంటనే, పంచాంగం తీసి, ఆ ఫలితమేమిటో చెప్పేది. బల్లి పడ్డ వెంటనే స్నానం చేసి రమ్మనేది. కంచి వెళ్లి అక్కడ బంగారు బల్లి, వెండి బల్లిని ముట్టుకుని వచ్చిన వాళ్ళను తాకమనేది. అప్పుడు అది పడ్డ దోషం పోతుందట. ఇదీ బల్లి కథ. నాకసలే బల్లి అంటే చచ్చే భయం. అది గదిలో ఉందంటే, నేనక్కడ ఉండేదాన్ని కాదు. దానికీ నాకూ షష్టాష్టకం. అది కానీ కింద పడితే, నేను వెంటనే ఘట్టి ఘట్టిగా అరిచేసి, ఏడ్చేసి, దగ్గర్లో వున్న మంచాలో, కుర్చీలో ఎక్కేసేదాన్ని. ఎవరైనా వచ్చి దాన్ని తరిమితే గానీ దిగేదాన్ని కాదు. ఆ ఎక్కడం అనే కార్యకమంలో మధ్యలో ఎవరు అడ్డం వచ్చినా సరే, వాళ్ళను బలంగా తోసేసి మంచమో, కుర్చీనో ఎక్కేసేదాన్ని. అది మా ఇల్లా, మరొకరి ఇల్లా అన్న మొహమాటం కొంచం కూడా బల్లి విషయంలో నాకు ఉండేది కాదు. పెద్దదాన్నవుతున్న కొద్దీ కొంచం కొంచం భయం తగ్గినా (అంటే చూస్తేనే కలిగే భయం పోయింది) మొత్తం పోయిందని మాత్రం గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పలేను. ఇప్పటికీ మా ఇల్లు బల్లి ప్రూఫ్ చేసే వుంచుతాను.  

                                                      బామ్మది ఇంకో నమ్మకం. ఎవరైనా పొరపాటున కానీ, ప్రమాదవశాత్తూ కానీ, కాలుజారో, లేదా ఏదో దూకుతూనో, గెంతుతూనో  కింద పడితే, వాళ్ళను లేపి వెంటనే అక్కడ ఓ చెంబు నీళ్లు పోసేది, లేదా పోయించేది. పడ్డ దోషం ఆ నీళ్లు పోయంగానే పోతుందనేది. ఆ అలవాటు నేనూ మా పిల్లల చిన్నప్పుడు చేసేదాన్ని. వాళ్ళు పెద్దవుతున్న కొద్దీ పడటమూ ఆగిపోయింది, ఆ అలవాటూ మర్చిపోయాను. ఇంకో తమాషా విషయం. అమ్మ కానీ, బామ్మ కానీ, లేదా ఎవరైనా సరే, కాలు జాపుకుని కూర్చుంటే, మేమెవరైనా  ఇటు నుంచి అటు ఆ కాలు దాటి వెళ్లామా, మా పనైపోయిందే. పిర్ర మీద నాలుగిచ్చుకుని, మళ్ళీ అటు నుంచి, ఇటు దాటమనేది. కాలు దాటకూడదనేది. 'ఒకసారి దాటితే తప్పయితే, రెండోసారి దాటితే ఇంకా డబుల్ తప్పుకాదా బామ్మా' అని అడిగితే, 'నోరు ముయ్యి, ఎదురు మాట్లాడుతున్నావ్' అనేది. ఏ ఒక్కదానికీ అది ఎందుకు చేస్తోందో చెప్పేది కాదు. ఆవిడ చెప్పేది, మేం చెయ్యాలి, అంతే. 

                                                             ఇంకో ముచ్చట, ఇంట్లో కాటుక తయారు చెయ్యటం. మా పిల్లలందరికీ సానలు, గంధం చెక్కలూ ఇచ్చి గంధం తియ్యమనేది. ఒక బుల్లి గిన్నె నిండా చిక్కగా గంధం తీసాక, అటక మీంచి పెద్ద ఆవకాయ కలిపే ఇత్తడి పళ్లెం తీయించి, దాన్ని బంగారం రంగు వచ్చేదాకా తోమించి పెట్టేది. ఆ పళ్ళానికి వెనక ఈ గంధం చిక్కగా పట్టించేది. ఈ గంధం అంతా చక్కగా దానికి ఎండిపోవాలి. రాత్రి పనంతా అయిపోయాక, మూడు ఇటుకరాళ్ళు పెట్టించి, ఆ రాళ్ళ మధ్యలో మూడు, నాలుగు ప్రమిదల్లో ఆముదం పోసి, దాంట్లో మూడు మూడు వత్తులేసి వెలిగించి ఈ పళ్లాన్ని గంధం మీదకు దీపం పొగ వచ్చేలా ఆ రాళ్లమీద పెట్టేది. ఈ మొత్తం సెట్టింగ్ కి, ఎక్కడ్నుంచి తెప్పించేదో  తెలియదు కానీ, ఓ పెద్ద వెదురుబుట్ట, పెళ్ళిళ్ళల్లో పెళ్లికూతురుని తెస్తారే, అలాంటి బుట్ట ఒకటి తెప్పించి బోర్లించేది. ఈ మొత్తం కార్యక్రమం పిన్ డ్రాప్ సైలెన్స్ లో జరగాలి. శబ్దం చెయ్యనిచ్చేది కాదు. లైబ్రరీల్లో లాగా అంతా నిశ్శబ్దం, ఏదో రహస్య కార్యక్రమం జరుగుతున్నట్టు. నేను అన్నీ కుతూహలంగా పక్కనే వుండి చూస్తూ ఉండేదాన్ని. ఇదంతా బామ్మ పర్యవేక్షణలో అమ్మ చేసేది. నేనేమో అమ్మకి అసిస్టెంటుని. ఆ తరువాత జాగ్రత్తగా శబ్దం కాకుండా తలుపులు వేసి వచ్చి పడుకునే వాళ్ళం. అమ్మ మాత్రం కాటుక చేసే రోజు రాత్రి మధ్య మధ్యలో వెళ్లి అవసరమైతే ఆముదం మళ్ళీ పొయ్యటం, దీపం ఆరిపోతే మళ్ళీ వెలిగించటం, అంతా సక్రమంగా ఉందా అని చూస్తూ ఉండేది. మర్నాడు లేచాక వుండేది సరదా అంతా. ఆ బుట్ట తీసేసి, ఆ పళ్ళాన్ని తిరగేసి యెంత మసి పట్టిందా అని చూసేవాళ్ళం. యెంత మసి పడితే అంత కాటుక వచ్చినట్టు. ఒక్కోసారి ఆ మసిలో ఎత్తుగా బుడగల లాగా కూడా వచ్చేవి. అప్పుడు ఇంకా ఎక్కువ మసి వచ్చిందని, ఎన్ని బుడగలొస్తే, అంత మంచిదని, అమ్మా, బామ్మా అనుకునే వాళ్ళు. బామ్మ ఆ మసి అంత తానే కూర్చుని, జాగ్రత్తగా ఒక న్యూస్ పేపర్ లోకి తాటాకుతో గీకేది. ఈ లోపల ఆ ఇత్తడి పళ్ళాన్ని మళ్ళీ ఎంచక్కా తోమి ఇచ్చేది పనిమనిషి. దానికీ చూడ్డానికి ఇదంతా సరదాగానే ఉండేది. మసి అంతా తీసేసాక, ఆ మసిలో కావాల్సినంత మాత్రమే తీసుకుని, మిగిలింది పొట్లం కట్టి దాచేది బామ్మ. ఎందుకంటే మళ్ళీ ఆ మసితో ఇంకోసారి కాటుక చేసుకోవచ్చట. తీసుకున్న మసి పొడిలో, తాజా వెన్న కానీ, ఆముదం కానీ, నెయ్యి కానీ వేసి కలిపేది. అంతా ఆ తాటాకు ముక్కతోనే.  కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఆ పేస్ట్ లో వేసి అంత చక్కగా కలిసేట్టు కలిపేది బామ్మ. అప్పుడు ఆ పేస్ట్ ని పళ్లెం మీద చక్కగా మధ్యలో ఓ ముద్దలాగా పెట్టి, ఓ చెంచాతోనో, గరిటతోనో గట్టిగా రుద్దేది. ఈ రుద్దుతున్నప్పుడు పై నుంచి నాలాంటి బుల్లి అసిస్టెంట్ ధారగా నీళ్లు పోస్తూ ఉండాలి. ఒక్కోసారి బామ్మే బోరింగ్ పంపు దగ్గరకి వచ్చి ఓ పీట వేసుకుని కూర్చునేది. నేను పంపు కొట్టటం, ఆ ధార కింద బామ్మ కాటుకని గట్టిగా నూరటం. మొత్తం సమానంగా అంతా కలిసేవరకూ నూరేది. కడుగుతున్నప్పుడు ఏవయినా గట్టి పలుకులు ఉంటే కొట్టుకుపోయేవి, లేదా అవీ మెత్తగా అయి కలిసిపోయేవి.  అలా ఓ పావుగంట కడిగాక అప్పుడు తీసి దాన్ని కాటుక భరణిలో పెట్టేది. ఇంకా చాలా బోల్డు కాటుక ఆ పళ్ళానికి అతుక్కుని ఉండిపోయేది. కొన్నాళ్ళు మేమంతా ఆ పళ్లెం కాటుకే పెట్టుకునేవాళ్ళం, ఇంత కష్టపడి చేసింది వేస్ట్ ఎందుకు కావాలని. నిజంగానే ఆ కాటుక కళ్ళకు చల్లగా హాయిగా ఉండేది. ఇదీ కాటుక కథ. ఆ కాటుక తయారు చేసేటప్పుడు అంత నిశ్శబ్దంగా ఎందుకుండాలి, అది రాత్రి పూటే ఎందుకు చెయ్యాలో అర్ధం అయేది కాదు. అడిగితే గయ్యిమనేది బామ్మ. నేను ఇప్పటికీ సరదా పుట్టినా, ఎవరింట్లో అయినా పసిపాపలు వున్నా కాటుక ఇంట్లోనే తయారు చేస్తూంటా. చిన్న పిల్లలకు బజారు కాటుక ఎందుకూ అని. నిజంగానే ఈ కాటుక కళ్లకు హాయిగా ఉంటుంది. కానీ నేను బామ్మ నియమాలు, అంటే నిశ్శబ్దంగా ఉండటం, బుట్ట బోర్లించటం, రాత్రిపూటే చెయ్యటం పాటించలా. అయినా మంచి కాటుకే వచ్చేది, కానీ చాలా కొంచం వచ్చేది.            

                                                       ఇంకో సరదా నమ్మకం దిష్టి. దిష్టి తీయటం అంటే, కాసింత  ఉప్పు తల చుట్టూ దిగదుడిచి నీళ్ళల్లో పడేయటం. ఉప్పు కరిగే లోపల దిష్టి పోతుందని ఒక నమ్మకం. బాగా పెద్ద దిష్టి కొట్టిందంటే, ఉప్పుతో  పాటు ఎండు మిరపకాయలు కూడా జత చేసి పిల్లలకు దిగదుడిచి దాన్ని పొయ్యిలో నిప్పుల్లో వేసేది. ఆ ఉప్పు చిటపట మన్నా, ఆ మిరపకాయలు ఖోరు రాకపోయినా, ' చూసావా, ఎంత దిష్టి ఉందో' అనేది బామ్మ. మా అమ్మ కి మాత్రం ఈ దిష్టి గోల సొక్కలా. బామ్మ ఉంటేనే, ఆవిడ చెప్తేనే తీసేది, లేకపోతే లేదు. మాకేమో దిష్టి తీయించుకోవడమంటే మహా సరదా. ఈ విషయంలో మా రాజ్యం ఆమ్మ మాత్రం బంగారుతల్లి. పిల్లలొచ్చి ఎప్పుడు దిష్టి తీయమన్నా తీసేది. కాకపోతే ఆమ్మ తీసే దిష్టి వేరే. నూనెగుడ్డ దిష్టి. మునిమాపు వేళ, కొంచెం చీకటి పడంగానే, పిల్లలందరం ఆమె చుట్టూ చేరి,  'అమ్మా, దిష్టి తియ్యి,  ఆమ్మా దిష్టి తియ్యి' అని కూర్చునేవాళ్ళం. ఆమ్మ శ్రద్ధగా ఒక్కోరికీ దిష్టి తీసేది. ఒక సన్నని పొడుగాటి గుడ్డముక్కని, నూనెలో ముంచి, పిల్లలకు తలచుట్టూ దిగతుడిచిన తరువాత, ఒక అట్లకాడకి ఆ బట్టముక్కని పొడవుగా వేళ్ళాడేసి,  చివర నిప్పు ముట్టించేది. ఆ బట్ట కాలుతున్నప్పుడు నూనె బిందువులు పడితే దిష్టి లేనట్టు, నిప్పు బిందువులు పడితే దిష్టి ఉన్నట్టు. ఎన్ని ఎక్కువ నిప్పు బిందువులు పడితే అంత దిష్టి ఉన్నట్టు. పాపం ఆమ్మ దగ్గర ఎన్ని పాత బట్టలున్నా, అన్నీ మా దిష్టికే అయిపోయేవి. అంతేనా, నూనె కూడా. ఓ కటోరాలో నిండుగా నూనె పెట్టుకుని కూర్చునేది. 'ఎవరెవరికి దిష్టి తియ్యాలో రండే', అంటూ. ఈ దిష్టి ప్రహసనం భలే సరదాగా ఉండేది. ఎవరికి ఎక్కువ దిష్టి ఉందో లెక్కలేసుకునేవాళ్ళం. ఆమ్మ దగ్గర చూసాగా, ఈ దిష్టి నేను ఇప్పటికీ తీస్తాను. మా మనవడు కూడా "ఫైర్ దిష్టి తియ్యి బామ్మా" అంటూ వచ్చేవాడు. ఇంకో నియమం ఏమిటంటే, ఈ దిష్టి కార్యక్రమం అయిపోయాక, ఏ రకమైన దిష్టి అయినా సరే, తప్పనిసరిగా కళ్ళు, కాళ్ళు, చేతులు కడుక్కోమనేవారు. 

                                                                ఇవీ మా బామ్మ నమ్మకాలు, ఆవిడ కోడళ్ళకీ, కూతుళ్ళకీ, మనవరాళ్ళకీ, అందరికీ ఎన్నో కొన్ని, ఎంత కొంత అంటించేసింది. అందువల్లనే ఈ ఆచారాలు, నమ్మకాలు మా ఇంట్లో తరతరాలుగా వస్తున్నాయి. ఈ అన్నింటిలో లాజిక్, రీజనింగ్ అడక్కూడదు. అడిగితే గయ్యి మనేది. 'మాటకెదురు చెప్తున్నావా' అని కోప్పడేది. బాహుబలిలో రమ్యకృష్ణ లాగా, మా ఇంట్లో బామ్మ మాటే శాసనం, ఫైనల్ , యిక అంతే. 







1 కామెంట్‌: