31, జులై 2015, శుక్రవారం

అమ్మమ్మా, తాతయ్యా

అమ్మమ్మా, తాతయ్యా

భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                      మా అమ్మమ్మ, లక్ష్మీనరసమ్మ, చాలా అందంగా వుండేది. తెల్లగా, పొట్టిగా, నాజుగ్గా వుండేది. గొంతు బావుండేది. పాట అయితే నేనెప్పుడూ వినలేదు. చాలా నిదానంగా నెమ్మదిగా కనిపించేది. గట్టిగా మాట వినిపించేది కాదు. కానీ చురుక్కుమనిపించేది. మనిషి చాలా శుభ్రంగా వుండేది. పది మంది పిల్లల తల్లిలాగా కనిపించేది కాదు. ఇంతమంది కానీ, పెంచి, గొప్ప వాళ్ళను చేసింది ఈవిడేనా అనిపించేది. మా తాతయ్యా వాళ్ళ అన్నగారు డాక్టరు, ఆయన చాలా చిన్నతనంలోనే పోయారట. ఆయన మధ్యలో అడ్డం వుండి ఇప్పించిన అప్పులు తీర్చటానికి ఆస్తిలో పెద్దభాగం వదిలేసుకోవాల్సి వచ్చిందట. అందుకని మా అమ్మమ్మకి మా తాతయ్య మీదా, వాళ్ళ మామగారి మీదా కోపంగా ఉండేదిట. ఇంతమంది పిల్లలని ఎలా పెంచాలా అని బాధపడేదిట. అందరి చదువులు, పెళ్ళిళ్ళు ఎలా అని ఆలోచించేదిట. అయినా మా మామయ్యలందరూ, మల్లు మామయ్య తప్ప, రోహిణీ పిన్నీ గ్రాడ్యుయేట్స్ అయ్యారు. ఆమ్మమ్మ పొదుపుగా ఉంటూ అన్నీ అందరికీ అందేలా చూసుకునేది అని అమ్మ అనేది. అమ్మమ్మ చాలా ధైర్యం వున్న మనిషని మాత్రం నేనూ చూశా. తాతయ్య పోయాక అమ్మమ్మ వొక్కత్తే వొంటరిగా ఆరుగొలనులోనే వుండేది. తన పనులన్నీ తనే చూసుకునేది. బహుశా మా అమ్మకీ వాళ్ళ అమ్మ ధైర్యమే వచ్చివుంటుంది. మా అమ్మా నాన్న పోయాక వొంటరిగానే వుంది చాలాకాలం. ఒకసారి అమ్మమ్మని ఆరుగొలనులో ఆవో, ఎద్దో పొడిచింది. ఆరోజుల్లో నేను విజయవాడలో చదువుకునేదాన్ని. అమ్మమ్మని చూసుకోవటానికి సీతామ్మ వెళితే, నేనూ, సత్యవతీ సీతామ్మా వాళ్ళింట్లో వున్నాం. ఆ తరువాత అమ్మమ్మని వాళ్ళ పిల్లలెవరూ వా వూళ్ళో ఉండనివ్వలేదు. పిల్లలందరి దగ్గరికీ, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. నాతో సంబల్ పూర్ వచ్చింది. నాన్న అప్పుడే మా అందరినీ భువనేశ్వర్, కోణార్క్, పూరీ తీసుకెళ్ళారు. అవి చూసి అంతా చాలా సంతోషించాం. మేము వెళ్ళిన రోజుల్లో మూల విరాట్టులన్నీ ఆ గుడి ఆచారం ప్రకారం గుండిచా మందిరంలో వున్నాయని గుర్తు. ఎందుకంటే విగ్రహాలని చాలా దగ్గరగా చూశాం. మళ్ళీ అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేకపోయాం. పూరీలో శంకరాచార్య పీఠానికి వెళ్లాం. దానికి దగ్గరలోనే సముద్రం వుంది. అందరం సరదాగా దాంట్లోకి దిగాం. మా కుటుంబం, నాన్న ఎం. ఈడీ.  క్లాస్ మేట్ గోవిందరాజులు గారి కుటుంబం కుడా మాతోనే వుంది. అందరం సరదాగా మిట్ట మధ్యాన్నం పన్నెండు, పన్నెండున్నర మధ్యలో సముద్రం లోకి దిగాం. అమ్మమ్మ మాత్రం మా సామాన్లన్నీ పెట్టుకుని వొద్దు మీద ఎత్తైన చోట కూర్చుంది. ఒక్కసారిగా పే......ద్ద అల ఒకటి వచ్చి మమ్మలనందరినీ ముంచేసి లోపలకి లాగేసింది. మాకు ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. నీళ్ళల్లో ఇసుక మీద గట్టిగా నించుంటే అలలకి కొట్టుకుపోమని నాన్న ముందే చెప్పాడు. నేను అలానే నించున్నా. కానీ నెత్తిమీంచి నీళ్ళు వేగంగా తన్నేస్తుంటే చాలా కష్టం మీద బలంగా నించున్నా. కొట్టుకుపోతూ, నాకేవో ఇద్దరి చేతులు దొరికాయ్. గట్టిగా పట్టుకుని ఆపా. తరవాత అల వెళ్ళిపోయాక తెలిసింది ఆ చేతులు మా భారతివి, గోవిందరాజులు అంకుల్ వాళ్ళ అమ్మాయివి అని. అసలు ఆ అలలోనుంచి బతికి బయటికి వస్తామనుకోలేదు. ఆ అల వెళ్లిపోంగానే అందరం గబగబా బైటకు వచ్చేశాం. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కేకలేశారు, ఎవరైనా పున్నమి రోజున మిట్ట మధ్యాన్నం వేళలో సముద్రంలోకి దిగుతారా అని. ఆ టైం లో హై టైడ్ వస్తుందిట. బతికాంరా బాబోయ్ అనుకుని పైకి వచ్చేశాం. పాపం అమ్మమ్మ గట్టు మీద కూర్చుని మేమంతా నీళ్ళల్లో మునిగిపోతుంటే భయపడుతూ, కంగారుగా ఉండిపోయింది. అందరూ మునిగిపోయారు, నాకు ఈ భాష రాదు, ఇప్పుడేం  చేయాలి అని దుఃఖంలో పడిపోయింది.  మేమంతా క్షేమంగా తిరిగి రాంగానే ఒక్కసారి బెంగగా మా దగ్గరికి గబగబా వచ్చింది. ఇక మేం అక్కడ ఉండలేదు. వెనక్కి వచ్చేశాం. 

                                         సంబల్ పూర్లో మాతో రెండు నెలలు వుంది. కొత్త వూరు, కొత్త భాష, కొత్త పద్ధతులు ఆవిడకి కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు. ముఖ్యంగా అమ్మ, నాన్న స్కూటర్ మీద వెళ్తే అమ్మమ్మకి తప్పుగా తోచింది. అవి అన్నీ తలచుకుంటే ఆశ్చర్యం వేస్తోంది, అప్పటికీ ఇప్పటికీ రోజులు ఎలా మారిపోయాయా అని. భార్యాభార్తా కలిసి వెళ్తేనే తప్పు అనుకునే కాలం నుంచి ఎటువంటి కాలం లోకి వచ్చేశామా అని. నేను రకరకాలైన టిఫిన్లు చేస్తానని ముచ్చట పడేది. నాన్నా వాళ్ళు హైదరాబాదు వచ్చేశాక కూడా కొన్నాళ్ళు మా అమ్మ దగ్గర వుంది. హైదరాబాదులో మాఅమ్మ దగ్గరా, మురళీమామయ్య దగ్గరా ఎక్కువగా వుండేది, చివరలో చనిపోయేముందర పార్థు మామయ్యా వాళ్ళింట్లో వుంది, అక్కడే పోయింది. విస్సన్నపేట నుంచి హైదరాబాదు వరకూ ఆ యాత్ర అలా సాగింది. 


                                                 మా తాతయ్య, నండూరి సత్యనారాయణ గారు ఆరుగొలనుకి కరణం. ఆ రోజుల్లో పల్లెటూళ్ళలో పోస్టాఫీసులు మొదటిసారి పెట్టినప్పుడు కరణాలకే ఆ బాధ్యత అప్పచెప్పారుట. దాంతో తాతయ్య ఆవూరికి కరణం, పోస్టుమాస్టరు రెండూను. సన్నగా, నల్లగా, పొడుగ్గా, మా అమ్మకి పూర్తిగా భిన్నంగా వుండేవాడు. చాలా సరదా అయిన మనిషి. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ వుండేవాడు. నిజాయితీ గల మనిషిగా ఊరూ వాడా పేరు. డబ్బులు సంపాదించుకున్న కరణాలు చాలా మంది, నీతీ నిజాయితీ తో వుండే కరణాలు కొద్దిమంది.  వాళ్ళల్లో మా తాతయ్యా ఒకడు. ఆ నీతీ, ఆ పుణ్యమే పిల్లలు మంచిగా ఎదిగేందుకు దోహదపడిందేమో. ఒక్కళ్ళ చేత కూడా వేలెత్తి చూపించుకోలేదు. మా అమ్మకి వాళ్ళ నాన్నంటే ఇష్టంతో పాటు ఎంత మర్యాదా, గౌరవమో. చిన్నప్పుడు వెన్నెల్లో ఆరుబయట మంచం మీద పడుకుని ఆకాశాన్నంతటినీ పరిచయం చేసేవాట్ట, ఈ నక్షత్రం ఇదీ, ఆ రాశి అదీ అంటూ. తాతయ్య రోహిణీ పిన్నికి పద్యాలు చదవటం, అర్ధం చేసుకోవటం బాగా రాదని కేవలం రోహిణీ పిన్ని కోసమే పింగళి సూరన గారి కళాపూర్ణోదయం కావ్యాన్ని తెలుగులో, అదీ తేట తెలుగులో, అందరికీ తేలికగా అర్ధం అయ్యేలా రాశారు. అది అముద్రిత రచన. బహుశా దాన్ని ఏ పత్రికకీ ముద్రణ కోసం పంపించలేదు. మా చిన్నప్పుడు తాతయ్య దస్తూరీతో వున్న ఆ పుస్తకం మా ఇంట్లోనే వుండేది. మేమందరం దాన్ని చాలా సార్లు చదివాం. రచన అనేది మా జీన్స్ లోనే వున్నాయనటానికి ఇది మరో తార్కాణం. ఉత్తరాల్లో తన పేరు నండూరు సత్యనారాయణ అని రాసేవారు. నండూరు ఎప్పుడు, ఎలా నండూరిగా మారిందో తెలియదు. మోహనం మామయ్యా, పార్థు మామయ్యా నండూరి అనే రాసేవాళ్ళు. తాతయ్యకి ఎలా వచ్చిందో గానీ బీడీలు తాగటం అలవాటు. చివరిలో అదే త్రోట్ కాన్సర్ లోకి దింపింది. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి సర్జరీ కూడా చేశారు. గొంతులో మాట్లాడే ట్యూబ్ / అన్నవాహిక  తీసేసి పొట్ట దగ్గర ఒక ట్యూబ్ పెట్టారు. దాంట్లో నుంచే కొద్దిరోజులు ఆహారం లోపలి పంపించారు. కానీ ఆ తరువాత ఆయన ఎక్కువ రోజులు బతకలేదు. ఆయన 1900 సంవత్సరం లో పుట్టారు. 1971లో పోయారు. ఆ టైంకి మాబామ్మ మాదగ్గరే వుంది. మా బామ్మ మా తాతయ్యని 'సత్యం' అనేది, ఆవిడకి ఈ తాతయ్య తమ్ముడు వరస. మా బామ్మ కూడా నండూరి వారి ఆడపడుచే. 'నాకన్నా సత్యం చాలా చిన్నవాడు, అప్పుడే పోయాడా' అని చాలా బాధపడింది. నేను టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన సంవత్సరం అది. రోహిణీ పిన్ని పెళ్లి కూడా ఆ తరువాతే అయింది. తాతయ్య ఎన్ని ఇబ్బందులు వున్నా శాంతంగా ఎలా వుండచ్చో జీవించి చూపించారనిపిస్తుంది. ఆస్తి పోగొట్టారని వాళ్ళ అన్నయ్యని కానీ, వాళ్ళ నాన్నని కానీ ఏనాడూ తప్పు పట్టినట్లు నేను వినలేదు. కరణీకం కానీ, పోస్టాఫీసు పని కానీ తీసుకోమని అంతా మల్లు మామయ్యకి ఎంతో చెప్పారు, ఆయన వినలేదు. 'మీరంతా పట్టణాల్లో వుంటే నేను పల్లెలో ఉండాలా' అని. కానీ తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసి బాధపడ్డాడు. ఆరుగొలనులొ వుండి తాతయ్య వుద్యోగం తీసుకుంటే బాగుండేదని అందరూ అనుకునేవారు. తాతయ్య మాత్రం ఎవరితో మాట పడకుండా, ఎవరినీ మాట అనకుండా బతుకు బండి లాగగలిగాడు. దటీజ్ తాతయ్య. 












29, జులై 2015, బుధవారం

నండూరి కుటుంబం

నండూరి కుటుంబం


భట్టిప్రోలు విజయలక్ష్మి


                                              ఐదుగురి తరవాత మా అమ్మ, లీల. అమ్మ తరవాత పార్ధు మామయ్య. పార్ధు మామయ్య, సువర్చల అత్తయ్య (ఈ అత్తయ్య పేరు కూడా సువర్చలే) వాళ్ళు మాకందరికీ యెంత అలవాటంటే, మా ఇల్లు తరవాత అది మాకింకో ఇల్లన్నమాట. ఒక్కడే కొడుకు మధు సారధి. మధు పేరుకి మామయ్య కొడుకే గానీ మాకందరికీ ఇంకో తమ్ముడే వాడు. మమ్మల్నందరినీ అక్కా అనే పిలుస్తాడు. నన్ను పెద్దక్కా అంటాడు. వీళ్లిల్లు కూడా షరా మామూలే, సంగీత నిలయం, సాహిత్య నిలయం. ఈ మామయ్యక్కూడా పరిచయం ఏమీ అక్కర్లేదు. నండూరి పార్థసారథి, పేరు చాలు. గొప్ప రచయిత. ఈమామయ్య రాసిన పుస్తకాలు, వ్యాసాలూ చూస్తే ఈయనకి ఎన్ని విషయాల్లో, ఎన్ని రంగాల్లో ప్రవేశం, పట్టూ వున్నాయో అని ఆశ్చర్యం కలుగుతుంది. నంపాసాగా కూడా ప్రసిద్ధుడు. వాళ్ళ ఇంటి పేరు శ్రుతి. మామయ్య ఎన్ని పుస్తకాలు, ఎన్ని విభిన్నమైన కాన్సెప్ట్స్ తో, ఎంత విస్పష్టంగా రాసాడో అవి చదివితే తెలుస్తుంది. ఒక అల్ ఇన్ వన్ ఈ మామయ్య. రచనలు, (నవలలు, వ్యాసాలూ, విశ్లేషణలు, పరిశోధనలు, అనుభవాలు, సంగీతం, సాహిత్యం,  ఎట్సెట్రా, ఎట్సెట్రా ఇలా ఎన్నో) చేస్తాడు, పాటలు పాడతాడు,(యధావిధిగా ఎంతో బతిమాలించుకుని కొద్దిగా), సితార్ వాయిస్తాడు. పాటల కలెక్షన్ చేస్తాడు, వింటాడు. పుస్తకాలు కలెక్షన్  చేస్తాడు, చదువుతాడు. పాత రేర్ సినిమాలు కలెక్షన్ చేస్తాడు, చూస్తాడు. తన గదిలోకి వెళ్తే అదో లోకం, మళ్ళీ గదిని శుభ్రంగా ఉంచుకుంటాడు. సిస్టమాటిగ్గా అన్నీ ఎక్కడ ఏది ఉండాలో అక్కడ అది పెట్టి అన్నీ అందుబాటులో ఉంచుకుంటాడు. సంగీతం మీద చాలా పరిశోధన చేసి వ్యాసాలు రాస్తాడు. ఇక చెప్పలేను బాబూ, ఆయన వర్క్స్ చూడాల్సిందే, చదవాల్సిందే, వినాల్సిందే. అప్పుడు కానీ ఆయన అసలైన ప్రతిభ కొంతైనా తెలియదు. మరుగున పడ్డ మాణిక్యాల్లో ఒకడు మా పార్ధు మామయ్య. ఇంక అత్తయ్య, మంచి మనిషి, నాకు ఈ సాయం కావాలీ అంటే తప్పక చేసే స్వభావం. మంచి తత్వవేత్త, నిరంతర ధ్యానం చేస్తూ, తన దగ్గరికి వచ్చిన అందరితో ధ్యానం చేయిస్తూ వుంటుంది. వాళ్ళ కుటుంబంలో అందరూ మాస్టర్ సీవీవీ ధ్యానమార్గంలో వున్నారు. నన్ను కూడా ధ్యాన మార్గంలో ప్రవేశపెట్టింది. ధ్యానంలో నాకు ఈ అత్తయ్యే గురువు. ఆధ్యాత్మికంగా పైస్థాయిలో వున్న వ్యక్తి. గత యాభై ఏళ్ళుగా ఒకేలా వున్న మనిషి. మా అమ్మ క్కూడా చాలా మంచి స్నేహితురాలు. అన్ని తరాల వారితో కలిసిపోయే మనస్తత్వం. ఎప్పుడూ నవ్వు మొహంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. మధు చిన్నప్పట్నించీ సితార్ నేర్చుకునేవాడు. సితార్ ఒక్కటే కాదు, చదువులోనూ ముందుండేవాడు, ఇంజనీరింగ్ లో డాక్టరేట్. మధు భార్య అపర్ణ మంచి ఫ్రెండ్లీ గర్ల్. మధు సితార్ విలాయత్ ఖాన్ గారి దగ్గర నేర్చుకుని, ఆయన చేతే మధు నా అంత గొప్ప పండితుడు, అనిపించుకున్నవాడు. మేమందరం మధు కచేరీలు చాలా ఇష్టంగా వింటాం. మోదుమూడి సుధాకర్, నండూరి మధుసారథి ఒకసారి విజయవాడలో, ఒకసారి హైదరాబాదులో జుగల్ బందీ కూడా ఇచ్చారు. వినే అదృష్టం నాకు కలగలేదు. అప్పుడు వేరే వూళ్ళో వున్నా. ఈ నండూరి మనవళ్లిద్దరూ మా కుటుంబానికి దేవుడిచ్చిన వరం. తరవాత తరంలో లల్లి, పనంగిపల్లి లలిత. వీళ్ళ చేత అక్క, అత్తా అనిపించుకోవటం నా/మా యోగం. 

                                                 పార్ధు మామయ్య తరవాత శంకరం మామయ్య, నండూరి శివశంకర శర్మ. ఈ మామయ్య మాట్లాడితే జలతరంగిణిలా వినిపిస్తుంది. కొంత మంది గొంతు ప్రత్యేకంగా వుంటుంది, వాటిల్లో శంకరం మామయ్యది కూడా ఒకటి. సంగీతమంటే యెంత ఇష్టమో.  చాలా సంగీత పుస్తకాలని పరిష్కరించి పబ్లిష్ చేయటంలో తన వంతు పాత్ర పోషించాడు. గీతా ప్రెస్ వాళ్లకి ఆధ్యాత్మిక పుస్తకాల ప్రచురణలో సాయం చేసేవాడు. నివురు కప్పిన నిప్పు. సైలెంట్ గా వుంటూనే అందరికీ తలలో నాలుక లాగా వుండే వాడు. అన్నయ్యలు, అక్కయ్యలు అంటే ప్రాణం. మా నాన్న అంటే కూడా అంత ప్రేమగా, ఇష్టంగా ఉండేవాడు. యెంత నిరాడంబరంగా ఉంటాడో చెప్పలేను. పుట్టపర్తిలోని సత్యసాయి ఆశ్రమానికి రెగ్యులర్ గా వెళ్తూ అక్కడ సేవ చేసేవాడు. ఎప్పుడూ తెల్లబట్టల్లో ప్రశాంతంగా ఉంటాడు. మిగిలిన అందరిలా సాహిత్యం, సంగీతమే కాకుండా ఈయనకి సమాజ సేవ కూడా ఒక అదనపు లక్షణం. ఇవ్వన్నీ కలిస్తే మా శంకరం మామయ్య. అన్నట్టు మర్చ్మోయాను, మా శంకరం మామయ్యకి మైళ్ళకి మైళ్ళు నడవటం అలవాటు. మా జోగులాంబ అత్తయ్య గొప్ప వీణా విద్వాంసుడు, శ్రీ మంచాళ జగన్నాధరావు గారి తమ్ముడి కూతురు, సంగీతంలో ఆయన శిష్యురాలు. ఈవిడ గొంతులో దేవుడు పంచదార పోసి కుట్టేశాడా అనిపిస్తుంది ఆవిడ పాట వింటే. అంత మధురంగా వుంటుంది ఆవిడ గొంతు. శాస్త్రీయసంగీతం, లలితసంగీతం ఏదైనా సరే అంతే మధురంగా, అంతే మర్యాదతో, గౌరవంతో పాడుతుంది. వాళ్ళ అమ్మాయి విజ్జి, దీనిది నా పేరే. కూడా బాగా పాడుతుంది. ఇప్పుడు మూడోతరం, విజ్జి వాళ్ళమ్మాయి, లాస్య కూడా పాడుతోంది. ఈ మధ్యనే విన్నా, అది కూడా చక్కగా పాడుతోంది. తరతరాలుగా ఈ గానవాహిని మా కుటుంబంలో ఒక్కోసారి  అంతర్వాహినిలా, ఒక్కోసారి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూనే వుంది. 


                                                       ఆ తరువాత శ్రీదేవి పిన్ని. పిన్ని గొంతు కూడా చాలా బాగుంటుంది. కొంచం జలతరంగిణి లాగా వినిపిస్తుంది. పాట పాడుతుందో లేదో తెలియదు. నేనెప్పుడూ తను పాడుతుండగా వినలేదు. నిదానంలో సీతామ్మకి సంపూర్ణంగా చెల్లెలు. హడావుడికి మా అమ్మ, రోహిణీ పిన్ని, నిదానానికి సీతామ్మా, శ్రీదేవి పిన్నీ. అసలు సిసలు 'ఛుపారుస్తుం' (నిజ్జంగా ఈ పదానికి సరిపోయే తెలుగు పదం దొరకలా) ఈవిడే. అరవై అయిదు ఏళ్ళు వచ్చేదాకా మా బాబాయిగారికి వ్రాయసకత్తెగా వుండి, ఒక్కసారిగా స్వీయ అనుభవాలతో ఓ పుస్తకం ఏకధాటిగా రాసేసి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ పుస్తకం, నెమరేసిన మెమోరీస్, కూడా అందర్నీ స్వీట్ మెమోరీస్ లోకి తీసుకెళ్ళింది. నేనీ బ్లాగ్ రాయటానికి ఈ పిన్ని కూడా ఒక ప్రధాన కారణం. మా బాబాయిగారు, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు.  పేరు చెప్తే చాలు,  పరిచయం అక్కర్లేని వాళ్ళల్లో ఈయన ప్రధముడు. ఈయన రాసిన కథలు, నవలలు, వ్యాసాలూ, డైలాగులు, స్క్రీన్ ప్లేలు, సినిమా నవలలు, కవితలు, చాలా కొన్ని పాటలు, అన్నీ కలిపితే లెక్కలేనన్ని. సహృదయమున్న మనిషి, చాలా బిడియంగా వుండేవారెందుకో. కానీ చాలా స్నేహశీలి. ఆయన, బాపు గారు స్నేహానికే ఐకాన్ లు. ఎంత కష్టాన్నైనా ఎవరికీ తెలియకుండా దాటేసి, దాన్ని 'ఈదేసిన గోదారి' అనగలగటం ఆయనకే చెల్లింది. పిన్ని అన్నింటా ఆయనకి సహధర్మచారిణి. వాళ్ళింట్లో లైబ్రరీ ఎంత కలెక్షనో. వాళ్ళ అబ్బాయి, బుజ్జి, వరా ముళ్ళపూడి, డైరెక్టర్ గా సినిమాలు తీస్తున్నాడు. దూరదర్శన్ వాళ్ళ కోసం చాలా షార్ట్ మూవీస్, లఘుచిత్రాలు, తీశాడు. చాలా బావుంటాయవి. నేనూ బుజ్జి ఫాన్ నే. మా పిన్ని కూతురు, అమ్మలు, అనురాధ, కూడా మా కలం సైన్యానికి చెందినదే. కాకపోతే దాని భాష ఇంగ్లీషు. తెలుగు కూడా ఇంగ్లీషులో రాస్తుందని విన్నా. మళ్ళీ అమ్మలు వాళ్ళ అమ్మాయి పాటలు పాడుతుంది. ఓసారి నేనూ టీవీలో విన్నా. బుజ్జి కూతురేమో పుస్తకాల పురుగు. బుజ్జి భార్య అరుణ, బాపు గారి తమ్ముడు శంకర్ గారి కూతురు. ఎంత హాయిగా నవ్వుతుందో. నాకు తన మందహాసం చాలా ఇష్టం.   


                                                ఇక చివరిగా మా చిన్న పిన్ని, రోహిణి. వాళ్ళ పది మందిలో చిన్నది. అందంగా వుంటుంది. బి. యే. తెలుగు లిటరేచర్ రెడ్డి కాలేజీలో చదివింది. పాటలు బాగా పాడుతుంది, బతిమాలించుకోవటంలో మిగిలిన వారికన్నా ఎంతో నయం. పైంటింగులు వేస్తుంది. కార్డ్ బోర్డ్ తో రకరకాల ఆకారాలు, ఇళ్లు, మందిరాలు తయారుచేస్తుంది. తగరం పేపర్లతో బొమ్మలకి అలంకరణ చేసి, వాటికి నగలూ, ఆభరణాలూ, చేసేది. గ్లాస్ మీద పైంటింగులు వేస్తుంది. తన చేతిలో చెత్త కాయితం పెట్టినా కళాత్మకంగా దాంతో ఏదో ఒకటి చేసి ఇవ్వగలదు. హిందీ నేర్చుకుని కొన్నాళ్ళు హిందీ టీచర్ గా కూడా పనిచేసింది. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే వుంటుంది. మా సాయి బాబాయిగారు ఎంత ఆపేక్షగా ఉంటారో. నన్నైతే సొంత కూతురు లాగానే చూస్తారు. కొత్త కొత్త గాడ్జెట్లు కొనటం, వాడటం ఆయనకిష్టం. నాటకాలు వేసేవారు. ఇప్పటికీ నాటకాలు చూడటం, కచ్చేరీలకు వెళ్ళటం ఆయనకిష్టం. కానీ ఆయాసం, ఉబ్బసం ఈ బాబాయిగారినీ, మా సోమశేఖరరావు పెద్దనాన్నగారినీ చాలా బాధించేవి. వాళ్ళ వుత్సాహమంతా ఆ జబ్బు పాడుచేసేసేది.  వాళ్ళ పిల్లలు రాధిక, హరి. రాధిక కూడా చాలా క్రియేటివ్. పాటలు పాడుతుంది. టీవీలో యాంకర్ గా చేసింది. విలేజ్ లో వినాయకుడు సినిమాలో ఓ వేషం కూడా వేసింది. 
పైంటింగులు వేస్తుంది. రకరకాలైన కొలాజ్ లు చేస్తుంది. వాళ్ళిల్లు ఓ మంచి ఆహ్లాదకరమైన మ్యుజియంలా వుంటుంది. ఎవరికైనా సాయం కావాలంటే ముందుండేది రాధికే. చాలా సమర్ధురాలు. అత్తవారింట్లో మంచి పేరు తెచ్చుకుంది. రాధిక భర్త సతీష్ కూడా మా కజినే. మా చిన్నమ్మమ్మ మనవడు. ఇక హరి, చిన్నప్పట్నుంచీ హరి అల్లరికి పెట్టింది పేరు. దేవుడు సరిగ్గా వాడికి అలాంటి పిల్లవాణ్నే, సిద్ధార్ధ ని ఇచ్చాడు, బహుశా వాడు తన చిన్నప్పటి అల్లరిని చూడలేకపోయాడని దేవుడు ఈ అరెంజ్ మెంట్ చేసి ఉంటాడు. మళ్ళీ వాడి భార్య లలిత చాలా నిదానం, మంచి పిల్ల. మా పిన్నికి మంచి కోడలు లలిత. హరి కూడా పాటలు బాగా పాడతాడు. కానీ నాలానే చాలా బద్ధకస్తుడు. సాధన చేయడు. అందుకే ఆ రంగంలో పేరు తెచ్చుకోలేక పోయాడు. కానీ తన బిజినెస్ తను బాగానే చేస్తున్నాడు. కంప్యూటర్ రంగంలో మంచి నాలెడ్జ్ వుంది. ప్రస్తుతం నండూరి పుస్తకం తయారు చెయ్యటంలో మా పార్ధు మామయ్యకి రైట్ హాండ్. 

28, జులై 2015, మంగళవారం

నండూరి కుటుంబం

నండూరి కుటుంబం

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                           అమ్మా వాళ్ళు మొత్తం పది మంది సంతానం అమ్మమ్మా, తాతయ్యలకి. అందరికంటే పెద్ద నరసింహారావు మామయ్య, మేము పెద్ద మామయ్యా అనే వాళ్ళం. ఆ అత్తయ్య గురించైతే అస్సలు గుర్తే లెదు. ఆ మామయ్యకి అందరూ ఆడపిల్లలే, అందరూ చాలా ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నవాళ్ళే. వాళ్ళ పేర్లు కూడా ఐదుగురికి నిర్మల అని పెట్టారు. గిరిజా నిర్మల, సరోజా నిర్మల, పద్మజా నిర్మల, మధు నిర్మల, నిర్మలా దేవి, విజయ సుమిత్ర, అలమేలు మంగ, ఇవీ నాకు తెలిసిన వాళ్ళ పేర్లు. ఎందుకో ఈ కుటుంబం వాళ్ళు అందరితో కలవటం తక్కువ. వాళ్ళల్లో మంచి రచయిత్రులు, డాన్సర్లు, గాయకులూ, నటులు వున్నారు. 

                              రెండో మామయ్యే, నండూరి రామమోహనరావు గారు, పరిచయం అక్కర్లేని మనిషి. ఆయన ఎన్నో భావకవితలు, విశ్లేషణాత్మక వ్యాసాలూ, వివరణాత్మక రచనలు, అద్భుతమైన సంపాదకీయాలు, మరెన్నో అనువాదాలు రచించాడు, ఇవ్వన్నీ ఒక ఎత్తు, ఆయన తెలుగులో మొట్టమొదటి సారి రాసిన సైన్స్ రచనలు ఒక ఎత్తు. "దశావతారాల గురించి ఎందరో రాసారు, నరావతారం గురించి నేను రాస్తాను" అని 'నరావతారం' పుస్తకం రాసిన మనిషి. విశ్వరూపం, విశ్వదర్శనం ఆయనవే. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. వాళ్ళ పెద్దనాన్న నండూరి శివరావు గారి తరువాత కుటుంబం లో మొదటి రచయిత. చాలా బావుండేవాడు, మా అమ్మమ్మ లాగే నాజూగ్గా ఉండేవాడు. సన్నని గొంతుతో చక్కగా పాటలు పాడేవాడు. కాకపోతే, బతిమాలించుకుని, బతిమాలించుకుని పాడే నండూరి వంశసంప్రదాయాన్ని ఆయన కూడా బాగా నిలబెట్టేవాడు. ఎక్కడో ఆకాశంలో గాలిపటంలా కుటుంబానికి కీర్తిపతాకలా  ఉండే వ్యక్తి, మా అందరిమీదా ఆపేక్షతో, ఆ గాలిపటం దారం గుండా కిందికి దిగి వచ్చి మమ్మల్నందరినీ ఎంతో ఆత్మీయంగా, ప్రేమగా పలకరించి మళ్ళీ తన రచనా సామ్రాజ్యానికి వెళ్లిపోయేవాడు. ఎప్పుడూ మా మోహనం మామయ్యని మోహనమైన నవ్వుతోనే గాని, కోపంగా ఏనాడూ చూడలేదు. వాళ్ళ పిల్లలు కృష్ణ ప్రసాదు, సత్యవతి కొన్నాళ్ళు మా ఇంట్లో వుండి చదువుకున్నారు కూడా. సత్యవతి నాకన్నా ఓ ఏడాది పెద్దది, మేమిద్దరం చాలా స్నేహంగా వుండేవాళ్ళం. శేషశయనగారు దాన్ని చూసి ఇష్టపడి, ప్రేమించి, పెద్దలని అడిగి పెళ్లి చేసుకున్నారు. ఆయన ఈరోజుకీ దాన్నెంత బాగా చూసుకుంటారో. మంచి స్నేహశీలి. చాలా ఆప్యాయంగా వుంటారు, ఆనాటి స్నేహం ఇప్పటికీ మా మధ్య అలాగే వుంది. వాళ్ళ పిల్లలు శ్రీదేవి, శ్రీలతకూడా వాళ్ళ అమ్మ లాగానే చాలా ప్రేమగా వుంటారు. ఎలా వచ్చిందో అలవాటు తెలియదు కానీ, నన్ను 'అక్కా' అంటారు, నేనేమో వరసకి అత్తని. ఇద్దరూ మంచి పిల్లలు. తరువాత నిర్మల, శకుంతల, ఫణి. నేను  కథలు రాస్తే, నిర్మల కవితలు రాసేది. నేను ఉద్యోగ జంజాటంలో పడి కథలు రాయటం ఆపేస్తే, నిర్మల సంసార జంజాటంలో పడి కవితలు రాయటం మానేసింది. నేను మళ్ళీ ప్రారంభించినట్లే, అదీ మళ్ళీ రాయటం మొదలుపెడితే బాగుండు. మోహనంమామయ్యా, రాజేశ్వరత్తయ్యల పిల్లలందరూ చాలా అందంగా వుండేవారు. మా అత్తయ్యా, మామయ్యలిద్దరూ కూడా చాలా అందంగా వుండేవారు. చూడచక్కని జంట. మామయ్య ఎప్పుడూ తన రచనా లోకంలో వుంటే, అత్తయ్యే సంసార బాధ్యతలు అన్నీ చూసుకునేది. పిల్లల చదువులు, ఆరోగ్యాలు, పెళ్ళిళ్ళు వగైరా బాధ్యతలు అన్నీ అత్తయ్య ఒంటి చేత్తో చేసేది. 

                                        తరువాత మా హీరో, మల్లు మామయ్య, మల్లిఖార్జున రావు పూర్తి పేరు. ఆమామయ్య మా అందరితో ఖబుర్లు చెబుతూ సరదాగా ఉండేవాడు. బోల్డు గొప్పలు చెప్పేవాడు, కోతలు భలే కోసేవాడు, మా చిన్న పిల్లలకి అవి భలే సరదాగా ఉండేవి. కంచంలో ఏవీ పారేయకూడదు అనేవాడు. మా మల్లు మామయ్యని చూసి నేను నేర్చుకున్నది ఇదే, అన్నం పారేయకుండా తినటం. తరవాత తెలిసిందేమిటంటే మామయ్య కోతల్లో ఇది కూడా ఒకటి అని. కోతల సంగతి ఎలా వున్నా నాకు మాత్రం ఒక మంచి అలవాటు అబ్బింది. తెనాల్లో మా ఇంట్లోనే వుండి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళ ప్రెమీమండలిలో హిందీ ప్రచారక్ కోర్సు చదివేవాడు. ఆ కోర్సులో భాగంగా మేము చదివే తాలుకా జూనియర్ కాలేజీకి కూడా వచ్చి మాకు స్కూల్లో హిందీ పాఠాలు చెప్పేవాడు. ఈ ట్రైనీలు వస్తే మాకు చాలా సరదాగా వుండేది. పాఠాలు కొత్త పద్ధతుల్లో, మాకు అర్థం కాకపోయినా సరే, హిందీలో మాత్రమే మాట్లాడుతూ పాఠాలు చెప్పేవారు. రోజూ హోం వర్క్ ఇచ్చేవాళ్ళు. ఎంత మంచి వాళ్ళో, మర్నాడు అది మేం చేసామా, లేదా అని మాత్రం చూసేవాళ్ళు కాదు. హొమ్ వర్క్ ఎగ్గొట్టటం మా పిల్లలందరికీ మహా సంతోషంగా వుండేది, కాకపోతే నోట్సు రాసుకోమని చంపేవాళ్ళు. ఆ అత్తయ్య సువర్చల.ఇద్దరు పిల్లలు, శారద, రవి. ఇద్దరికీ ఇద్దరిద్దరు పిల్లలు. వీళ్ళు పూర్తిగా విజయవాడలోనే ఉండటంతో వాళ్ళ అమ్మాయి, అబ్బాయిలతో  అంత చనువు లేదు. అప్పటికే మేం తెనాలి వదిలి సంబల్ పూర్ వెళ్లిపోయాం. వాళ్ళు బెజవాడ లోనే వుండేవాళ్ళు. ఇందుమతి ఆమ్మా(మా చిన్నమ్మమ్మ కూతురు, మా అమ్మ కజిన్, చాలా మంచి ఆవిడ, చాలా క్లోజ్ గా, స్నేహంగా వుండేది అందరితో, ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండి సాయం చేసేది. తరువాత మా తరంలో కూడా మా మధ్య ఆ దగ్గరితనం వుంది ఇంకా) వాళ్ళ ఇండియన్ మెడిసిన్ హౌస్ లో పనిచేసేవాళ్ళు. రవి భార్య ప్రశాంతి కలుపుగోలు మనిషి. వాళ్లకు ఒక అబ్బాయి జయదేవ్, ఒక అమ్మాయి, గీతిక. తరువాతి తరానికి నండూరి ఇంటిపేరుకి చిన్నారి ప్రతినిధి. శారద భర్త పేరు రామచంద్ర ప్రభు, పిల్లలు నాగలక్ష్మి, లక్ష్మీ నరసింహారావు.  

                                              ఆతరువాత మా మురళి మామయ్య. నండూరి మురళీకృష్ణ, మా నాన్న కంటే కొంచం చిన్న, మా అందరికీ మా నాన్న తరవాత నాన్నంత చనువు, ఇష్టం. మామయ్యా ఆల్ ఇండియా రేడియో లో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. రేడియో నాటకాలు వేసేవాడు. కొన్ని సినిమాల్లో కూడా వేషాలు వేశాడు. ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, పూలరంగడు, జైజవాన్ సినిమాల్లో మంచి పాత్రలే వేసాడు. ఎందుకో తానే తరవాత వద్దనుకుని మానేశాడు. ఆ అత్తయ్య, మీనాక్షి, కూడా అందరితో బాగా కలిసిపోయేది. ఎంతో ప్రేమగా, మరెంతో బాధ్యతగా వుండేది. అసలు పద్ధతులు, బాధ్యతలకి  ఈ మామయ్య, అత్తయ్య నెంబర్ వన్. ఇల్లు ఎంత బాగా శుభ్రంగా వుంచేదో. మా అమ్మ అయితే " మా మురళన్నయ్య ఇంట్లో కింద పాలు వలకబోస్తే ఎత్తచ్చు, అంత శుభ్రంగా ఉంచుతుంది మీనాక్షి" అనేది.  నా శుభ్రం కొంత మీనాక్షత్తయ్య నుంచి వస్తే, మిగిలింది మా ఉమాదేవి పిన్ని(మా సాంబుడు బాబాయి భార్య, వీళ్ళందరినీ నందివాడ కుటుంబంలో పరిచయం చేస్తాను) నుంచి వచ్చింది. పిల్లలని యెంత డిసిప్లిన్ తో పెంచేదో. ఈ అత్తయ్య నాకు ఈ విభాగంలో(పిల్లల్ని పెంచే విషయంలో) కూడా గురువు. రవి, రాజా, జ్యోతి. మంచి బుద్దిమంతులైన పిల్లలు. బంధువులందరూ ఈ పిల్లల్ని, వాళ్ళ మంచితనాన్ని, రెస్పాన్సిబిలిటీని గొప్పగా చెప్పుకుంటారు. ఐకమత్యంగా వుంటారు. జ్యోతి కూతుళ్లిద్దరూ మంచి టాలెంట్ వున్నవాళ్ళు. పెద్దది లలిత, మేమంతా ప్రేమగా లల్లి అంటాం, మంచి కర్ణాటక సంగీత విద్వాంసురాలు. చిన్నది గాయత్రి, రోయింగ్ చేసేది, జూనియర్ నేషనల్ ఛాంపియన్  కూడా. పిల్లలిద్దరూ ఈ స్థితికి రావటానికి వెనక జ్యోతి, మూర్తీ  గార్ల పరిశ్రమ ఎంత వుందో. సత్యనారాయణమూర్తి గారు కూడా ఒక మంచి తమ్ముడులాగా ఉంటారు. రవి భార్య వసంత చాలా క్రియేటివ్, బాగా పెయింటింగ్స్ వేస్తుంది, నేర్పిస్తుంది, వాళ్ళ అమ్మాయ్ అమూల్య కూడా వాళ్ళ అమ్మ లాగానే మంచి ఆర్టిస్ట్. రాజా అసలు పేరు సత్యనారాయణ, మా తాతయ్య పేరు, కానీ మాకందరికీ రాజా అంటేనే అర్థం అవుతుంది. రాజా భార్య సునీత కూడా చాలా మంచిది, కామ్ గా వుంటుంది. వాడు జంషెడ్పూర్ లో పనిచేసేటప్పుడు అంటార్కిటిక్ ఎక్స్ పెడిషన్ టీం లో సెలెక్ట్ అయి అంటార్కిటికా వెళ్లి వచ్చాడు. వాళ్ళ అబ్బాయ్ విష్ణు తరవాత తరం లో నండూరి వంశానికి ఏకైక ప్రతినిధి, మల్లు మామయ్య మనవడు జయదేవ్ పుట్టిందాకా.   

                                                          ఆ తరువాత మా సీతామ్మ. వీళ్ళదీ పూర్తిగా సంగీత విద్వాంసుల కుటుంబం. పెద్దది మహాలక్ష్మి చక్కగా పాడుతుంది, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. రెండోది శశికళ వయొలిన్ వాయించేది. మా ఇంట్లో శశికళే మొట్టమొదట కంప్యూటర్ సంబంధించిన జాబు చేసింది ఆంధ్రజ్యోతిలో. మూడోవాడు మోదుమూడి సుధాకర్, మా వివేక్ కంటే రెండు, మూడు నెలలు పెద్దవాడు. గొప్ప సంగీత విద్వాంసుడు. విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో పని చేస్తున్నాడు. సుధాకర్ భార్య అంజన, కూతురు శృతి కూడా చాలా బాగా పాడతారు. అసలు ఆ జీన్స్ మాసీతామ్మ, మాపెదనాన్నగారివి. సోమశేఖరరావు పెద్దనాన్నగారు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి (మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారి గురువు)  మేనల్లుడు. మా ఆమ్మ కూడా బాగా పాడుతుంది. చాలా మృదువైన, మధురమైన కంఠం, షరా మామూలుగా తక్కువగా పాడేది.(లేకపోతే నండూరి వంశ సంప్రదాయం ఏమైపోతుంది?) ఎంతో నెమ్మదిగా, మంచిగా మాట్లాడుతుంది. ఎంత నిదానమో, వేదాంతం, విశ్లేషణ, ఆలోచన యెక్కువ. ఆవిడ ఒక ముడి వజ్రం, ఎవరూ సాన పట్టలేదు. కానీ సహజ ప్రకాశం తళుకులీనుతూనే వుంటుంది. మా అమ్మకి వాళ్ళ అక్కంటే  చాలా ఇష్టం. మా అమ్మా, ఆమ్మా కలిస్తే రోజులకి రోజులు తిండీ నీళ్ళూ లేకుండా ఖబుర్లు చెప్పుకునే వాళ్ళు, ఎక్కువగా వేదాంత చర్చే. శంకరాభరణం సినిమా లో శంకరశాస్త్రిగారి ఇల్లులాగా వీళ్ళింట్లో ఏమూల చూసినా, ఏ గోడ తాకినా, ఏం ముట్టుకున్నాసంగీతమే. ఇంత గొప్ప విద్వాంసులు మా వాళ్ళేనంటే నాతల ఓ నాలుగించీలు పైకి లేస్తూ వుంటుంది.

                                                                 వీళ్లంతా మా అమ్మకన్నా పెద్దవాళ్ళు. మా అమ్మ కన్నా చిన్నవాళ్లు గురించి తరువాతి పోస్ట్ లో చెపుతాను.





  

20, జులై 2015, సోమవారం

మా అమ్మవే మరి కొన్ని ముచ్చట్లు

                                          మా అమ్మవే మరి కొన్ని ముచ్చట్లు

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                           చక్కగా సమానంగా పంచుతానని పూలమాల కూడామా అమ్మ గుర్తుల్లో చిన్నప్పుడు వడ్లుదంపించటం, కూలీలకి కూలీ ఇవ్వటం, అది వాళ్ళు చక్కగా పంచుకోవటం కూడా ఒకటి. ఈ విషయం చాలాసార్లు చెప్పేది. వడ్లపురుల్లోంచి వడ్లు తీసి ఆడ కూలీలని పిలిచి ఇంట్లోనే దంపించేవారట. రోళ్ళు, కుందులు, రోకళ్ళు తీసుకుని అందరూ ఆటలు, మాటలు, పాటలతో ఇల్లంతా హోరెత్తిస్తూ వడ్లు దంచేవారట. అమ్మా వాళ్ళంతా ఇదంతా నోరు తెరుచుకు చూస్తూ వుండేవాళ్ళట. ఆ కూలీలకు కూలీగా వడ్లు, బియ్యం, నూకలు ఇచ్చేవారట. వాళ్ళు అవన్నీ ఎంత సమానంగా పంచుకునేవారో చూస్తే ముచ్చట వేసేదిట. ఒక్క గింజ ఎక్కువా, తక్కువా కాకుండా భలే పంచుకునేవారట. ముందర మానికలతో, తరువాత చిన్న గిద్ద కొలతలతో, ఆ తరువాత అరచేతులతో, ఆ తరువాత నాలుగు వేళ్ళతో , అంటే చారెడు చారెడు అలా పంచుకునేవారట. అమ్మకి అలా సమానంగా పంచుకుంటుంటే భలే ముచ్చట వేసేదిట. అలా ఏదైనా సమానంగా పంచితే ఆవిడకి చాలా ఇష్టం. నేను కూడా ఏదైనా  నాకే ఇచ్చి ముక్కలు చేసి అందరికీ ఇమ్మనేది. సమానంగా వున్న ముక్కలు చూసి మహా ముచ్చట పడేది, మెచ్చుకునేది. 

                                                           'నువ్వుకానీ, బాబుకానీ వుంటే నాకు ధైర్యమే, మీతో ఎక్కడికైనా రాగలను, నా చెయ్యి పట్టుకుని నడిపిస్తారు, వదలరు, నా సౌకర్యం చూస్తారు' అనేది. నాలుగో క్లాసు తర్వాత బడి ఎలా ఎగ్గొట్టాలా అని ప్లాన్లేసిన మా అమ్మ తన జీవితపు చివరి పదిహేను సంవత్సరాల్లో అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, పారిస్, కెనడా దేశాలు తిరిగింది. అప్పుడు బాబు (వివేక్) అమెరికాకి, లండన్ కి, కెనడాకి, పారిస్ కి తీసుకెళ్తే,  పద్మ  ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళింది. అన్నట్టు, నాన్న ఉన్నప్పుడే అమ్మా, నాన్నా, భారతి కుటుంబం, మా కుటుంబం అంతా నేపాల్ వెళ్ళాం. పశుపతినాధున్ని  దర్శించుకున్నాం. లుంబినీ వెళ్లాం, బుద్ధుడు పుట్టిన సరోవరం చూశాం. అమ్మ బాగా ఎంజాయ్ చేసింది, ఆవిడకి బుద్ధుడంటే చాలా ఇష్టం. హుస్సేన్ సాగర్ బుద్ధుడి దగ్గరక్కూడా తీసుకెళ్ళమంది, కానీ ఎందుకో కుదరలేదు, మేమూ దాన్ని ఈనాటికీ చూడలేదు.  ఒకసారి వెళ్తే బుకింగ్ క్లోజ్ అన్నాడు. యాత్రలంటే ఆవిడకిష్టం. నాన్న ఉన్నప్పుడే ఎల్టీసీలో చాలా చూపించాడు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అస్సాం, మేఘాలయ, తమిళనాడు అన్నీ చూశాం.

                                                  ఇవ్వన్నీ ఒక ఎత్తు, ఆవిడ పుస్తక పఠనం ఒక యెత్తు. బోలెడు పుస్తకాలు చదివేది, (బహుశా నాకు  ఈ పుస్తకాలు చదివే అలవాటు అమ్మ నుంచే వచ్చి వుంటుంది.) కావ్యాలూ, నవలలూ, కవితలూ, వీక్లీలూ, మంత్లీలూ, పురాణాలూ, ప్రవచనాలూ, ధర్మగ్రంథాలూ అన్నీ చదివేది. వాళ్ళ మోహనన్నయ్య, పార్థు ( మా మామయ్య నండూరి పార్థసారథి) రాసిన పుస్తకాలు ఇంకా శ్రద్ధగా చదివేది. రమణ బాబాయి గారి పుస్తకాలు ఓసారి శ్రీదేవి పిన్ని బోల్డు ఇచ్చింది. అవి అన్నీ చదివింది. అవ్వన్నీ మాకందరికీ కంఠస్థం అయిపోయాయి.

                                                          ఓసారి సువర్చలత్తయ్య, సీతామ్మలతో కలిసి (అప్పుడు ఓ పది పదిహేను మంది వెళ్ళారనుకుంటా) అరుణాచలం వెళ్ళింది. అరుణాచలం వెళ్ళాక చలం ఎలా రమణుడి మైకంలో పడిపోయారో, అలాగే మా అమ్మ కూడా రమణుడి ఫిలాసఫీలో, ఆయన మత్తులో మునిగిపోయింది. ఆయన పుస్తకాలు చాలా చదివింది. ఆయన వేదాంతమే మాట్లాడేది. ఏ కాస్త అవకాశమొచ్చినా ఇంట్లో చర్చలు నడిపేది, నాతోనో, మరెవరితోనో. మొత్తానికి సత్కాలక్షేపం చేసేది. చక్కగా దేవుళ్ళ పటాలు పెట్టి వాటన్నింటికీ పూలు పెట్టేది. ఆ పూలు పడిపోకుండా అగరుబత్తి చివరన  వుండే పుల్లని సగానికి వంచి దాన్ని హుక్ లాగా ప్రతి పటా నికీ పైన పెట్టి దానికి పూలు పెట్టి అలంకరించేది. ఆ పూలు మర్నాడు తీసేదాకా పడిపోయేవికావు. ఇంటి నిండా దేవుడి పటాలు, కాలండర్లు నింపేసేది. ఇంకా పాత కాలండర్లు మంచి పటాలవి వుంటే తెండి అనేది. అవ్వన్నీ గమ్ టేప్ తో గోడలకి అంటించేది. నేను ఎటు చూసినా ముచ్చటైన దేవుడి పటం కనిపించాలి అనేది. ధ్యానం చేసుకునేది. తన ధ్యాన అనుభవాలని సువర్చలత్తయ్యతో, నాతొ చర్చించేది. చివరి ఏడాది రెండేళ్ళు చాలా సాధన చేసింది. 

19, జులై 2015, ఆదివారం

'అ' ---- అమ్మ, 'ఆ' ----- ఆరుగొలను

'అ' ---- అమ్మ, 'ఆ' ----- ఆరుగొలను


భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                    మా బామ్మ చేత 'అందరి కోడళ్లలో లీల మంచిది, నేను దాని దగ్గర ఉంటా,  బాగా చూస్తుంది' అనిపించుకుంది. మా బామ్మ తన పూజా పంచాయతనం కూడా మా అమ్మకే ఇచ్చేసింది. అది నాన్న పోయాక అమ్మ బాబు, మా తమ్ముడు వివేకానంద్, దగ్గరికి వెళ్ళే ముందు మా పెద్ద పెదనాన్న పెద్ద కోడలు సత్యవతి వదినకి ఇచ్చింది. 'తరువాత తరంలో నువ్వే పెద్ద కోడలివి, పూజా, పునస్కారం వున్నదానివి' అంటూ. 

                                                 నాకు తెలిసి అమ్మ ఎప్పుడూ సన్నగా, నాజూగ్గానే వుండేది. లీల లావు అవటం అంటే ప్రపంచ వింత అన్నట్లుండేది. కానీ చాలా శక్తి వున్నట్లు అన్ని పనులూ చేసేది. సెకండ్ హ్యాండ్ మెరిట్ సూయింగ్ మిషన్ కొని మా అందరికీ దానితో బట్టలు కుట్టేది. తరవాత్తరవాత ఆ పని నాకు బదిలీ చేసింది. మా అందరికీ అన్ని పనులూ నేర్పింది. వంట చేయటం, ఇల్లు సర్దటం, పూజకి ఏర్పాట్లు చేయటం, టిఫిన్లు చేయటం అన్నీ నేర్పింది. నాకు ముగ్గులు వేయటం రాదు. కానీ భారతి, నా పెద్ద చెల్లి, బాగా ముగ్గులు వేసేది. బాగా ఏమిటి బ్రహ్మాండంగా వేసేది. దాదాపు ప్రతి పండక్కీ ముగ్గులు వేసే భాద్యత దానిదే. పద్మ కూడా దానికి సాయం చేసేది. పాడగా రేపనగా ముందు రోజు రాత్రే నాము వుండని నీళ్ళల్లో నానేసి, మర్నాడు పని మనిషి ఇల్లు కడగంగానే ఇల్లంతా తెల్లగా ముగ్గులు పెట్టేది. ఆ రోజుల పండగల హడావుడే వేరు. 

                                                      ఇంకోవిషయం ఏంటంటే మా అమ్మ, మా నాన్న ఇద్దరిదీ ఒకే వూరు. అదే ఆరుగొలను. కృష్ణా జిల్లాలో నూజివీడు, ఏలూరు మధ్యలో హైవే పైనే వుంటుంది. మా అమ్మా వాళ్ళ ఇంట్లో అందరూ ఆరుగొలను అంటే ఒక రకం ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. మా అమ్మకి వాళ్ళ ఊరంటే అంతిష్టం. అసలు అమ్మే కాదు వాళ్ళ పదిమందీ అంతే, అసలు వాళ్లకి ఆ వూరు పేరు మొత్తం చెప్పఖ్ఖర్లా. 'ఆ' అంటే చాలు అది ఆరుగొలనే, బహుశా చిన్నప్పుడు వాళ్ళ వూరి బడిలో అందరికీ ఆ అంటే ఆరుగొలను అని చెప్పి వుంటారు. (అన్నట్టు, వాళ్ళ వూరిలో బడి వాళ్ళ సుబ్బారావు బాబాయే నడిపేవాట్ట. మళ్ళీ ఈ సుబ్బారావుగారు కూడా వేరెవరో కాదు. నండూరి సుబ్బారావు గారే, నండూరి సుబ్బారావు గారంటే ఆల్ ఇండియా రేడియోలో ఎంతో పేరున్న ఆర్టిస్ట్. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి రేడియో గణపతి అంటే ఇంకా బాగా అర్థం అవుతుందేమో. ఈ తరంలో వాళ్లకి ఆయన యెంత తెలుసో నాకు తెలియదు గానీ, మేమంతా చిన్నప్పుడు మా సుబ్బారావు తాతయ్య రేడియో నాటకాలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ సుబ్బారావు తాతయ్య, మా అమ్మకి బాబాయి పిల్లలు బడికి రాంగానే ఒక్కక్కళ్ళ ముందరా ఇసుక కుప్పలు పోసి దాన్ని బల్లపరుపుగా పరిచి అదే పలక అనుకోమని దానిమీద అక్షరాలు దిద్దించే వాట్ట. ఇవాల్టి చదువు అయిపోయాక ఆ ఇసుక మళ్ళీ కుప్పలో కలిపేసి పిల్లలు వెళ్లి పోయేవారుట. మర్నాటికి మళ్ళీ ఎవరి ఇసుక వాళ్ళు ముందు పోసుకుని మళ్ళీ తయారు. కాణీ ఖర్చు లేని చదువు. మన భారతదేశస్థులకి వున్న వనరుల్ని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు) మా నాన్న క్కూడా ఆరుగొలను అంటే ఇష్టమే గానీ మరీ మా అమ్మా వాళ్ళలా కాదు. మా  శ్రీదేవి పిన్నైతే ఆరుగొలను మీద 'నెమరేసిన మెమొరీస్' అని ఓ పుస్తకమే రాసేసింది. మా రోహిణీ పిన్నైతే కార్డ్ బోర్డ్ తో ఓ మినియేచర్ ఇల్లు కట్టేసి, దానికి రంగులేసి, బల్బులు పెట్టి,  వాళ్ళ ఇంటిని, తన ఇంట్లో బంధించేసింది, కాదు కాదు, ఆవిష్కరించేసుకుంది. ఇక శంకరం మామయ్య అయితే జీడిమెట్లలో వాళ్ళ ఇంటి ముందు ఆరుగొలను ఇంటికున్నట్టు వీధిలో గేటుకి అటూ ఇటూ అరుగులు కట్టించేసుకున్నాడు. వీళ్ళందరూ కలిస్తే  'బాబోయ్, మళ్ళీ ఆరుగొలను వెల్లిపోతున్నార్రోయ్' (మాటలు, ఊహల్లోనే) అని మేమంతా తలోవైపూ సద్దుకునేవాళ్ళం. 

                                                        ఇల్లు, ఇంటి ముందు గేటుకి అటూ, ఇటూ అరుగులు, అవి దాటాక చాలా పెద్ద ముంగిలి, ఆపైన వడ్ల పురులు, వసారా, దానికి ఒక వైపు పోస్టాఫీసు గది, మరో వైపు స్పైరల్ మెట్లున్న గది, టెర్రేస్ పైన ఒక గది, (దాన్ని మేము చిన్నప్పుడు మల్లుమామయ్య గది అనేవాళ్ళం), కింద సింహద్వారం దాటగానే పే...............ద్ద హాలు, ఎట్సెట్రా ఎట్సెట్రా. పెద్ద పెరడు, దాంట్లో జాజి తీగలూ, మందారచెట్టూ, బాదం చెట్టూ, ఆ పెరట్లోనే కొంత భాగంలో పెద్ద పాకా, పెద్ద వంటల కోసమనుకుంటా, ఒక వైపు స్నానాలగదీ (ఓపెన్ టాప్) మరోపక్క నీళ్ళు బాగా వున్నబావీ, దాని చుట్టూ చప్టా, ఇదికాక ఇంట్లో వంటిల్లు, పడమటిల్లూ, దేవుడి గదీ, గాంధీ విగ్రహమున్న గదీ ఉండేవి. గాంధీ విగ్రహం, నిలువెత్తుది, పార్కులో పెట్టటానికి తెచ్చారుట, తరువాత అది ఎందుకో పెట్టకుండా, మరోటి పెట్టారుట. ఆ ఎక్స్ట్రా విగ్రహాన్ని ఇక్కడ మూల గదిలో పెట్టారుట. సడెన్ గా చూస్తే భయమేసేది నాకు. ఇది కాక ఇంటి ముందు పెద్ద చెరువూ, చెరువు నిండుగా నీళ్ళూ, దాన్నిండుగా విరబూసిన తామరలూ, తామరతూళ్ళూ, కాయలూ, అబ్బో, మా అమ్మ మహా వైభవం గా వర్ణించి వర్ణించి చెప్పేది. 











18, జులై 2015, శనివారం

మా అమ్మా వాళ్ళ తాతయ్య

మా అమ్మా వాళ్ళ తాతయ్య 

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                           వాళ్ళ తాతయ్య గురించి చాలా సంతోషంగా బోల్డు ముచ్చట్లు చెప్పేది. ఆయన రోజూ దొడ్లో వున్నా బాదం చెట్టు ఆకులు కర్రతో దులిపి, ఆ ఆకుల్తో ఇంట్లో అందరికీ విస్తళ్ళు కుట్టి ఇచ్చేవాట్ట. ఒక్కోసారి ఏదైనా పండుటాకు, ఎర్రది రాలితే దానితో విస్తరికి ఓ చెవిలాగా ఎక్స్టెన్షన్ గా కుట్టేవాట్ట. అందరూ ఆ విస్తరి మాక్కావాలంటే మాకని పోట్లాడుకునేవారట. కానీ ఆ పోట్లాటలో ఎప్పుడూ మల్లు మామయ్యే నెగ్గేవాట్ట. వాళ్ళ తాతయ్యే చివరికి 'మల్లుకిచ్చేద్దాంలే' అనేవాట్ట. 

                                        అందరూ పొద్దున్నే చద్దన్నాలు ఊరగాయ వేసుకుని తింటుంటే మల్లు మామయ్య మాత్రం స్పెషల్ గా  రెండు బంగాళ  దుంపలు ఎర్రగా వేయింపించుకుని అందర్నీ ఊరిస్తూ తినేవాట్ట. అమ్మకి అన్నీ గుర్తే, ఆ విశేషాలన్నీ చెపుతూ వుండేది. వాళ్ళ తాతయ్య దీపావళికి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు వుంటే అన్ని గుమ్మటాలు తాటాకులతో తయారు చేసి వాటిల్లో ఆడపిల్లల చేత దీపాలు పెట్టించే వాట్ట. మగపిల్లల చేత దివిటీలు చేసిచ్చి గుండ్రంగా తిప్పమనేవాట్ట. 

                                     అమ్మకి వాళ్ళ బామ్మ తెలియదు. వీళ్ళందరికీ బామ్మ అంటే వాళ్ళ సూర్యనారాయణ తాతయ్య భార్య శ్యామలంబామ్మే. వాళ్ళ పెద్ద బాబాయి, రమణారావు బాబాయి, డాక్టర్ బాబాయి గురించి కూడా బాగా చెప్పేది. ఒక్క  గోడే అడ్డంగా ఈ రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండేవట. 

                                                  వాళ్ళ అమ్మ, అంటే మా అమ్మమ్మ, నండూరి లక్ష్మీ నరసమ్మ గారు, ఇంత మంది (పదిమంది) పిల్లల మీద పొదుపు చెయ్యాలని తన రవికలూ అవీ తనే చేత్తో కుట్టుకునేదిట. కత్తెర చాలా ఖరీదని కత్తిపీటతో బట్ట కత్తిరించి మరీ కుట్టుకునేదట. మా బామ్మ కూడా నండూరి వారి ఆడపడుచే. ఆవిడ కూడా చాలా పాతకాలం ముచ్చట్లు చెప్పేది. మా అమ్మమ్మ కజిన్ పేరు కూడా లక్ష్మీ నరసమ్మే, ఇద్దరు అక్కచెల్లెళ్ళూ ఒకే వూరికి కాపురానికి వచ్చారట. ఆరోజుల్లో ఈ ఆడవాళ్ళు, అంటే మా అమ్మమ్మలు, బైటకు ఏ పెళ్లిళ్ళకో  వెళ్ళాలంటే మేనా కట్టించుకుని వెళ్ళేవాళ్ళట. ఇది మా బామ్మ విజయరావమ్మ గారు చెప్పేది. ఆవిడని ఆ వూళ్ళో అందరూ వియ్యమ్మగారనేవారు. నాపేరు కూడా బామ్మ, అమ్మమ్మల పేర్ల కాంబినేషన్, విజయ-లక్ష్మి. 

                                        ఇంకా మా అమ్మా వాళ్ళింట్లో గోరింటాకు చెట్టు ఉండేదిట. చేతులకి ఎప్పుడూ గోరింటాకు పెట్టుకునేవార్ట. పాత గోరింటాకు రంగు మాయం గానే మళ్ళీ గోరింటాకు పెట్టుకునే వారట. మా తాతయ్య, నండూరి సత్యనారాయణ గారు, అంటే అమ్మా వాళ్ళ నాన్న మాత్రం 'మీ అందరిదీ ఎర్ర గోరింటాకు, నాది తెల్ల గోరింటాకు, నా చెయ్యి చూడండి, ఎలా తెల్లగా పండిందో' అనేవారట తన తెల్ల అర చెయ్యి చూపిస్తూ. సంక్రాంతికి ముందు ధనుర్మాసంలో గొబ్బిళ్ళకి ఆవుపేడ మేము బైట నుంచి తెచ్చుకునే వాళ్ళం. వాళ్ళచిన్నప్పుడు వాళ్ళు బైటకు వెళ్ళకుండానే కరణం గారి పిల్లలకని పాలేళ్ళే తెచ్చి పెట్టేవాళ్లుట. మేం బైట నుంచి ఆవుపేడ, గోరింటాకు తెచ్చుకుంటుంటే నవ్వేది. రథసప్తమికి ఆ ఆవుపేడ పిడకలతో బైట ఎండలో ఆవుపాలతో పరవాన్నం వండేది. చిక్కుడు కాయలతో రధాలు చేసేది. ప్రసాదాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టుకుని తినేవాళ్ళం. భలేగా వుండేది ఆ రుచి. అదే రుచి ఇంట్లో గ్యాస్ స్టవ్వు మీద వండితే వచ్చేది కాదు. నాగులచవితికి  చిమ్మిలి, చలిమిడి చేసేది,  అద్భుతం గా ఉండేవి అవి. మా కోసమని నాగుల చవితికి ఉపవాసం వుండేది. అన్నట్టు వుపవాసమంటే గుర్తొచ్చింది, మా అమ్మ పుట్టింది మహాశివరాత్రికి. మా నాన్న ఎప్పుడూ మా అమ్మని ఏడిపిస్తూ ఉండేవాడు. అందరూ పుట్టినరోజుకి స్వీట్స్ చేసుకుని తింటుంటే నువ్వు 'పస్తు' అని. ఇంకా బ్రహ్మాండంగా బీరకాయ, సొరకాయ వంకాయ ముక్కల పులుసు అదిరిపోయేట్టు కాచేది. వంకాయ తొడిమ ముక్కలు నాలుగు పక్షాలుగా కోసి పులుసుల్లో వేసి వాటిని 'దేవుడు ముక్కలు' అనేది. పిల్లల చేత అనీ తినిపించటానికి అవి తల్లుల టెక్నిక్కులేమో.



మా అమ్మ

మా అమ్మ 


భట్టిప్రోలు విజయలక్ష్మి


                          చాలా రోజుల తర్వాత ఏదో రాద్దామని కూర్చున్నాఇది రాయటానికి అమ్మ తరఫున నండూరి వారి విశేషాలు రాయాల్సిన అవసరం పడటం కూడా ఒక కారణంహరి అడిగినందువల్లాపార్థుమామయ్యతో మాట్లాడినతర్వాతాఎన్నాళ్ళనుంచో నావెంటపడుతున్న మా కాత్యాయనీ మేడమ్ వల్లా, సావిత్రీ ఆంటీ పుస్తకం చూసాకా, శ్రీదేవి పిన్ని పుస్తకం చదివాకా, నాకే ఇక రాయక తప్పదూ అనిపించీ, మొదలు పెడుతున్న నా జ్ఞాపకాల దొంతర.  

                                                       ముందుగా మా అమ్మ గురించి, ఎందుకంటే ఈ బ్లాగ్, ఈ రాత కి కారణం అమ్మ కాబట్టి. అమ్మ, నందివాడ లీలా కుమారి, పెళ్లి కాక ముందు నండూరి లీలా కుమారి. కానీ ఆవిడకి మాత్రం లీల అంటేనే ఇష్టం. 'ఈ కుమారి ఏంటీ, అసయ్యంగా, లీల అంటేనే బావుంది', అనేది. చక్కగా పాడేది. కానీ పాడటం చాలా చాలా తక్కువ.  ఎంతో అడిగించుకుని ఒక్క పాట పాడేది. అసలు అమ్మా వాళ్ళందరికీ, అంటే వాళ్ళ అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళకు భానుమతి, రావు బాలసరస్వతి, సాలూరి, దేవులపల్లి, రజనీకాంత రావు అంటే చాలా అభిమానం. చక్కగా, భావుకతతో, శ్రావ్యంగా, మృదువుగా, మధురంగా 'ఆ తోటలో నొకటి ఆరాధనాలయము, ఆలయములోన అందగాడెవడే' అంటూ ఆ పాట చాలా బాగా పాడేది. నాన్నక్కూడా అమ్మ పాటంటే ఇష్టం. కానీ ఎందుకో ఎప్పుడూ పాడేది కాదు.

                                          తాను నాలుగు, అయిదు క్లాసులకే చదువు మానేసినా మమ్మల్ని మాత్రం చదువుకోమని మహా పోరేది. 'చదువుకోండే, చదువుకుని వుద్యోగం చెయ్యండి, అప్పుడే గౌరవం, మర్యాదా' అనేది. ఆవిడ ప్రోద్బలం వల్లేనేమో మా అందరికీ కాస్త చదువులబ్బాయి. చదువు గురించి చెప్తూ, తను చిన్నప్పుడు చదువుకోక, బడికి వెళ్ళటం ఎలా తప్పించుకు తిరిగేదో, ఎలా మా అమ్మమ్మకి దొరక్కుండా దాక్కునేదో అనీ చెప్పేది. వాళ్ళ తాతయ్య పందిరి మంచం కింద దాక్కునేదట. అమ్మమ్మ పట్టుకోటానికి వచ్చి మామగారినేమీ అనలేక గొణుక్కుంటూ వెళ్ళిపోయేదట. వాళ్ళ పది మందిలో చదువు అంటే పారిపోయేది అమ్మా, వాళ్ళ మల్లన్నయ్యేనట.

                                              ఇంకా వాళ్ళ తాతయ్య గురించి బోల్డు కబుర్లు చెప్పేది. ఆయన చాలా ఊళ్ళకి కరణంట. ఊళ్ళకి పని మీద వెళ్ళాలంటే చక్కని జరీ పంచెలు, లాల్చీ, వుత్తరీయం వేసుకుని గుఱ్ఱం మీద స్వారీ చేసుకుంటూ వెళ్ళేవాట్ట. ఆయనకీ హాల్లో పే.....ద్ద  పందిరి మంచం, దానికి నాలుగు వైపులా పందిరి కర్రలు పెట్టుకోటానికి యిత్తడివి ధగ ధగ మెరిసే హోల్డర్స్ వుండేవిట. కర్రలు లేనప్పుడు వాళ్ళ తాతయ్య వాటిల్లో తనకు కావాల్సిన వక్కలు, బీడీలు వగైరా పెట్టుకునేవాట్ట. అమ్మ ఆ మంచం కిందే దాక్కుని బడి ఎగ్గొట్టేదన్నమాట . అమ్మమ్మ అమ్మని మంచం కిందే వదిలేసి తిట్టుకుంటూ వెళ్ళిపోయేదిట. అంటే మా అమ్మ 'ఆడ బుడుగు' అన్నమాట.