2, ఏప్రిల్ 2022, శనివారం

పంచాంగము అంటే ఏమిటి ?

పంచాంగము అంటే ఏమిటి ? 


అందరికీ శుభకృత్ నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 

ఈ రోజు మనం అందరం ఉగాది జరుపుకుంటున్నాం. ఈ నాడే పంచాంగ శ్రవణం చేస్తున్నాం. ఏ రాశి వారికి ఎలా వుందో, ఏ నక్షత్రం వారికి ఎలా ఉందో ఆతృతగా తెలుసుకుంటున్నాం. 
పంచాంగాలు రాసేవారిని సిద్ధాంతి అంటారు. మన భారత దేశంలో సిద్ధాంతులు  సాధారణంగా 
దృక్ సిద్ధాంతాన్ని అనుసరించి రాస్తారు. ఇంకా ఇతర సిద్ధాంతాలు కూడా వున్నాయి. కాలమును శాసించేవి ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు. వీరి గమనం వల్లే దివారాత్రాలు ఏర్పడుతున్నాయి. సూర్యుడు పగటి అధిపతి అయితే, చంద్రుడు రాత్రికి అధిపతి. అందుకే ముఖ్యంగా కాలాన్ని చాంద్రమానము, సౌరమానము అంటూ కొలుస్తాం. ఇంకా బార్హస్పత్య మానము వంటి ఇతర గ్రహ గమనాల ద్వారా కూడా కాలం కొలిచే పద్దతి కూడా వుంది. మన తెలుగు వారందరం చాంద్రమానాన్ని వాడతాం. తమిళులు సూర్యమానాన్ని వాడతారు. గ్రహచారం అంటే గ్రహగమనం బట్టీ లెక్కించి చెప్పేదే గ్రహచారం, గోచారం. ఇవి ఆ రాశి వారికి, ఆ నక్షత్రం వారికి కలిపి మూకుమ్మడిగా ఒక్కటే చెప్తారు. అవే ఇప్పుడు మనం స్థూలంగా చెప్పుకుంటున్న సంవత్సర ఫలితాలు. కచ్చితమైన ఫలితాలను తెలుసుకోవాలంటే ఎవరైనా స్వీయ జాతకం  చూపించుకోవలసిందే. జాతకం రాయించుకోవాలంటే DTP కావాలి. వారు పుట్టిన D అంటే డేట్, T అంటే టైం, P అంటే ప్లేస్ వివరాలు కావాలి. ఉగాది అంటే సంవత్సరంలో  మొదటి రోజు.  ఆ పండుగ వారంలో ఏ రోజు వస్తే ఆ గ్రహమే ఆ సంవత్సరానికి అధిపతి. ఈ సంవత్సరం అధిపతి శని, ఎందుకంటే ఉగాది శనివారం వచ్చింది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనే అయిదు అంగములతో కూర్చినది పంచాంగము. 

మొదటిది తిథి: ఇది చాలా మందికి తెలుసు. తిథులు మొత్తం 16. పాడ్యమి నుంచి చతుర్దశి వరకూ 14,  పౌర్ణమి, అమావాస్యలను  కూడా కలుపుకొని మొత్తం 16. తిథి లేకుండా వచ్చేవాడినే అతిథి అంటారు. అంటే అప్పటికప్పుడు అనుకోకుండా వారం , వర్జ్యం చూసుకోకుండా  వచ్చేవాడే అతిథి అన్నమాట. 
  
రెండవది వారం: ఇవీ అందరికీ  తెలుసు. వారములు 7. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, 
శని వారాలు. మరి గ్రహాలూ తొమ్మిది కదా మిగిలిన రాహువుకీ, కేతువుకీ కాలమానంలో స్థానం లేదా 
అంటే, వున్నది. ఈ రెండూ ఛాయా గ్రహాలైనా వీటికీ వాటి సమయం వాటికి వుంది. రాహువు అధిపతిగా వుండే కాలం రాహుకాలం, కేతువు అధిపతిగా వుండే కాలం యమగండం. 

మూడవది నక్షత్రం: ఇవి మొత్తం 27. కొద్దిసేపు మాత్రమే వుండే అభిజిత్ తో కలిపి లెక్కిస్తే, వీటి సంఖ్య 28. అభిజిత్ సంగతి ఏమో కానీ మిగిలిన 27 నక్షత్రాలూ చాలామందికి తెలుసు. కనుక 27 నక్షత్రములు అశ్వని నుంచి రేవతి వరకు + అభిజిత్.   వీరు అందరూ దక్ష ప్రజాపతి పుత్రికలు, చంద్రుని భార్యలు. వీరి వలననే చంద్రునికి వృద్ధి క్షయాలు వచ్చాయి. వీరిలో చంద్రునికి రోహిణీ అంటే ఎంతో ఇష్టం. మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసిన దక్షుడు చంద్రుణ్ణి క్షయ వ్యాధితో కృశించమని శపించాడు. అది తెలిసి నక్షత్రాలన్నీ శోకించాయి. అప్పుడు శివుడు ఆ దక్షశాపాన్ని కొంచెం సవరించి చంద్రుడికి ఒక పక్షం రోజులు పెరుగుతూ ఉండేలాగా, మరొక పక్షంరోజులు తరుగుతూ ఉండేలా చేసి,  ఆ చంద్రకళను తలమీద పెట్టుకుని చంద్రశేఖరుడు అయ్యాడు. అన్నట్టు పక్షాలు రెండు. ఒకటి  శుక్ల లేదా శుద్ధ పక్షము అయితే, రెండవది కృష్ణ లేదా బహుళ పక్షము. శుక్లము అంటే తెలుపు, ఈ పక్షంలో చంద్రుడు రోజు రోజుకీ పెరుగుతూ పౌర్ణమికి పూర్తి చంద్రుడు తెల్లని కాంతితో ప్రకాశిస్తాడు. కృష్ణ అంటే నలుపు, ఈ పక్షంలో చంద్రుడు రోజు రోజుకీ తరుగుతూ అమావాస్యనాటికి పూర్తిగా నల్లగా చీకటి చంద్రుడు అయిపోతాడు. 

నాలుగవది యోగము: వీటి గురించి చాలామందికి తెలియదు. ఇవి మొత్తం 27. ఏ సమయంలో ఏ యోగము ప్రభావం చూపిస్తుందో ఇది చెపుతుంది. విష్కంభము నుంచి వైధృతి వరకూ ఇవి 27. పేర్లు చెప్పటం లేదు అవి ఎక్కడైనా దొరుకుతాయి. 

అయిదవది కరణము :  ఇవి కూడా చాలామందికి తెలియవు. ఇవి మొత్తం 11. బవ కరణము నుంచి కింస్తుఘ్నము అనే కరణము వరకు ఇవి మొత్తం 11. ఇవి వాటి  ప్రభావంతో ప్రజలకు యోగాలు కలిగించేందుకు కారణమవుతాయి. ఈ అయిదూ కాక కాలాన్ని లెక్కించటానికి ఇంకా చాలా కొలమానాలు వున్నాయి. 

3 సంధ్యలు: సూర్యోదయం, అపరాహ్ణము, సూర్యాస్తమయం. త్రిసంధ్యలలోనూ జపాలు, స్తోత్ర పఠనాలు ఎంతోమంది చేస్తూ వుంటారు. గాయత్రి జపాన్ని సంధ్యావందనము అని అందుకే అంటారు. 

2 పూటలు: పగలు, రాత్రి, దివారాత్రాలు. వీటికి సూర్యుడు, చంద్రుళ్లు అధిపతులు. 

1 దినము: ఒక సూర్యోదయం ఒక దినానికి లెక్క. ఏ రోజు సూర్యోదయ కాలానికి ఏ తిథి ఉంటుందో, ఆ రోజు ఆ  తిథిగా పరిగణిస్తాం. 

4 యుగములు: కృత, త్రేతా, ద్వాపర. కలియుగాలు. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. సంకల్పంలో చెప్పుకుంటాం కదా కలియుగే, ప్రధమ పాదే అని. సంకల్పం అంటే కేవలం మామూలుగా మన జియో పొజిషన్, మన అప్పుడు వున్న కాల వివరం, మన నామ గోత్ర వివరాలు చెప్పుకోవటం మాత్రమే.  

60 సంవత్సరములు: ప్రభవ నుంచి అక్షయ వరకు ఇవి మొత్తం అరవై. ఏ సంవత్సరం ఏ పేరు మీద ఉందో  ఆ ఫలితమే ఆ సంవత్సరం ఉంటుంది. వికారి ఎంత వికారంగా ఉందో చూసాం. శార్వరి ఎంత చీకటిగా ఉందో కూడా చూసాం. ప్లవ కొద్దిగా గట్టెక్కించిందని ఆనందపడ్డాం. ఇప్పుడు శుభకృత్ శుభాలని కలగచేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాం. శుభకృత్ అంటే అర్ధం శుభములను చేయునది అని. రాబోయే శోభకృత్ మనందరినీ శోభాయమానంగా తీర్చిదిద్దుతుంది అని ఆనంద పడదాం. 

ఈ పేర్ల వెనక ఓ పురాణ గాధ వుంది. ఒకసారి నారదుడికి, తానే గొప్ప విష్ణు భక్తుడననీ, తాను మాత్రమే విష్ణుమాయకు అతీతుడనీ ఓ అహంకారపూరిత భావం ఏర్పడింది. అప్పుడు నారదుడికిఆ అహంభావం తొలగించడానికి శ్రీమన్నారాయణుడు నారదుణ్ణి ఒక నది ఒడ్డుకి తీసుకువెళ్లి, ఆ నదిలో స్నానం చేయమని చెప్తాడు. నీళ్ళల్లో మునగగానే శ్రీమన్నారాయణుడు మాయం అయిపోయాడు. నారదుడు కాస్తా నారదిగా, అంటే స్త్రీ గా మారిపోయాడు. అటుగా పోతున్న ఆ దేశపు రాజు, అందంగా వున్న ఈ ఒంటరి సుందరిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరూ అలా కొన్నేళ్లపాటు సంసారం చేసి, అరవై మంది కొడుకులను కన్నారు. ఆ పిల్లల పేర్లే ప్రభవ, విభవ, ప్రమోదూత, ప్రజోత్పత్తి నుంచి క్రోధన, అక్షయ. ఒకసారి ఇంకో దేశంతో జరిగిన యుద్ధంలో ఈ మొత్తం అరవై మంది నారద సంతానం, రాజుతో సహా మరణిస్తారు. నారదుడు తిరిగి ఆ నది ఒడ్డుకి వచ్చి శోకిస్తూ ఉంటాడు. అప్పుడు మళ్లీ  శ్రీమన్నారాయణుడు వచ్చి,"అయ్యో, ఎందుకమ్మా ఏడుస్తున్నావ్, ఆ నదిలో దిగి స్నానం చేసి రా. నీ దుఃఖం పోతుంది" అని చెప్తాడు. నారదుడు తిరిగి నీటిలో మునగగానే ఆ స్త్రీ రూపం పోయి, మామూలు దేవఋషి రూపం వచ్చేస్తుంది. నారదుడు అప్పుడు విష్ణుమాయ శక్తిని  గ్రహించి సిగ్గుపడి, నారాయణుడికి దాసోహం అంటాడు. కానీ పాపం తాను కన్న పిల్లల మీద ప్రేమ మాత్రం వదులుకోలేక పోతాడు. నారాయణుడికి చెప్పుకుంటే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు, "నీ అరవై మంది పిల్లలూ సంవత్సరానికి ఒకరుగా వస్తూ పోతూ వుంటారు. వారు సంవత్సరాల రూపంలో చిరంజీవులుగా వుంటారు", అని వరం ఇస్తాడు. వారే మన సంవత్సరాలు. భాగవతం లోని ఈ శ్లోకం చూడండి. 

ప్రహ్లాద నారద పరాశర పుండరీక  వ్యాసాంబరీష శుక శౌనక  భీష్మదాల్భ్యాన్,

రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదీన్  పుణ్యానిమాన్ పరమ భగవతాన్ స్మరామి !

కనుక భక్తిలో నారదుడు కూడా, తన శిష్యుడైన ప్రహ్లాదుని కన్నా తరువాత స్థానంలో ఉంటాడు. ప్రహ్లాదుడు పసి పిల్లవాడు, నిష్కల్మషమైన భక్తి ప్రపత్తులు కలిగిన వాడు. భక్తులలో ప్రథముడు. 

2 అయనములు:  ఉత్తరాయణం, దక్షిణాయనం. సూర్యగమనాన్ని బట్టి సూర్యుడు ఎటు దిక్కు 
ఉంటే ఆ వైపు ఆయనమని అంటారు. ఉత్తరాయణంలో వెలుగు ఎక్కువ, దక్షిణాయనంలో వెలుగు తక్కువ. ఈ అంశం మీద చెప్పాలంటే అది ఒక్కటే ఒక్క వ్యాసమవుతుంది. అన్నట్టు ఉత్తరం, దక్షిణం అంటే మరో విషయం గుర్తొచ్చింది. ఉత్తర దేశానికీ, దక్షిణ దేశానికీ 12 సంవత్సరములు తేడా. మనం శుభకృత్ అంటే వారు అంటే సరిగ్గా వింధ్య పర్వతాలకు అవతలివైపు ప్రాంతం వారు ఆనంద నామ సంవత్సరంలో వుంటారు. 

ఈ విశేషానికి సంబంధించిన "వింధ్యపర్వతం గర్వ భంగం కథ" ఒకటి పురాణాల్లో వుంది. దాని ప్రకారం 'మేరుపర్వతం తనకన్నా పెద్ద పర్వతం, దాని చుట్టూ సూర్యుడు ప్రదక్షిణం చేస్తాడు' అని నారదముని ద్వారా తెలుసుకున్న వింధ్య, "నేనేం తక్కువ, నేనూ పెద్దగా ఎదుగుతాను" అని బాగా ఎత్తుగా పెరిగిపోయేసరికి సూర్యుడు దాన్ని దాటలేక మిగిలిన ప్రాంతాన్నే పరిభ్రమించాడుట. దాంతో వింధ్యకి ఈవలి వైపు దక్షిణ భారత ప్రాంతమంతా పూర్తిగా చీకట్లో ఉండి పోయిందిట. దానితో దక్షిణ భారత దేశంలో సూర్యోదయం, సూర్యాస్తమయం లేకపోవటంతో తిధులు, వారాలు, నెలలు, సంవత్సరాలు మారలేదు. ఉత్తర భారతంలో అయితే మామూలుగా సంవత్సరాలు మారిపోతున్నాయి. అప్పుడు దేవతలంతా ఈ ఇబ్బంది గురించి ఇంద్రుడి దగ్గరకు వెళ్లి చెప్పుకుంటే, ఆయన అగస్త్యుడిని ఎన్నుకుని వింధ్యపర్వతం ఎత్తు అణచమని అడిగాడట. 
అప్పుడు అగస్త్యుడు దేవతల ఆదేశంతో తన కుటుంబంతో సహా దక్షిణ భారత పర్యటనకు 
బయలుదేరి, వింధ్యపర్వతాల వద్దకు రాగానే, వింధ్య పర్వతం అగస్త్యుని చూసి వంగి దణ్ణం 
పెట్టాడు. అప్పుడు అగస్త్యుడు వింధ్యపర్వతాన్ని ఇదే విధంగా వంగి ఉండమని, లేకపోతే తన
వంటి పొట్టివాళ్లకు వింధ్యని దాటి వెళ్ళటం కష్టమవుతుందని, తాను దక్షిణభారత యాత్రలు చేసి తిరిగి వస్తానని చెప్పాడు. దానితో తిరిగి, వింధ్యపర్వతాలు మళ్ళీ పొట్టిగా వంగిపోయాయి. 
అప్పటినుంచి సూర్యుడు యధావిధిగా పరిభ్రమణం మొదలుపెట్టాడు. దానితో దక్షిణ భారత 
దేశంలో తిరిగి సంవత్సరాలు మారటం మొదలైంది. ఈ కారణం చేతే మనకు వాళ్లకు  12 సంవత్సరాల తేడా వుంది. 

3 కాలాలు: వేసవికాలం, వానాకాలం, శీతాకాలం.  

6 ఋతువులు: వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం. 

వసంతం --- చైత్రం, వైశాఖం మాసాల్లోనూ, గ్రీష్మం --- జ్యేష్టం, ఆషాఢం మాసాల్లోనూ,  వర్షం --- శ్రావణం, భాద్రపదం మాసాల్లోనూ, శరత్తు --- ఆశ్వీయుజం, కార్తీకం మాసాల్లోనూ, హేమంతం --- మార్గశిరం, పుష్యం మాసాల్లోనూ, శిశిరం --- మాఘం, ఫాల్గుణం మాసాల్లోనూ వస్తుంది. 

12 మాసములు: ఒక సంవత్సరంలో 12 మాసాలు, 12 సంక్రమణాలు వస్తాయి. మకర సంక్రమణం మాత్రం సంక్రాంతి పండుగగా ప్రసిద్ధి. ఏ నక్షత్రమైతే పూర్ణమికి  చంద్రునికి దగ్గరగా ఉంటుందో,    ఆ నక్షత్రం పేరు మీద ఆ మాసం పిలవబడుతుంది. ఉదాహరణకి అశ్విని నక్షత్రం పున్నమి నాడు చంద్రుడికి చేరువగా ఉంటే ఆ నెల ఆశ్వీయుజం. పూర్వాభాద్ర కానీ,  ఉత్తరాభాద్ర కానీ పున్నమి రోజు చంద్రునికి దగ్గరగా ఉంటే ఆ మాసం భాద్రపదం. 

వర్జ్యం: మనకందరికీ ఒక విషయం బాగా తెలుసు. సంవత్సరం అంటే ఖచ్చితంగా 365 రోజులు కాదు. ఒక రోజు అంటే, పూర్తిగా 24 గంటలు కావు అని. ఎంతో కొంత సమయం మిగిలిపోతుంది. అలా  వదిలి వేయబడిన సమయాన్ని వర్జ్యం అంటారు. ఆ సమయం వదిలి వేశాం కనుక ఆ సమయంలో ఏ శుభకార్యాలూ చేయకూడదు. ఈ సమయాన్ని పరిగణన లోనికి తీసుకుని అంతర్జాతీయ గడియారాలని కూడా అప్పుడప్పుడు సవరిస్తూ వుంటారు.  

దుర్ముహూర్తం: అలాగే 24 గంటలలో కొంత సమయం మంచిది కాదు , అప్పుడు ఏ  యోగం, కరణం వగైరాలు యోగించవు. అటువంటి సమయాన్ని దుర్ముహూర్తంగా పరిగణించి ఆ సమయంలో కూడా ఏ శుభకార్యాలూ చేయరు. 

ప్రదోషం: ఇది సరిగ్గా సూర్యాస్తమయానికి సుమారుగా ఒక అరగంట ముందు నుంచీ, ఒక అరగంటతరువాత దాకా ఉంటుంది. పూజలకు, జపాలకు ప్రశస్తమయిన కాలం. ఈ సమయంలో అభిషేకం చేసినా, దీపారాధన చేసినా ఎంతో మేలు. 

24 గంటలు: ఆదివారం తరువాత సోమవారమే ఎందుకు రావాలి? బుధవారం ముందు రోజు మంగళవారమే ఎందుకు అయి ఉండాలి? అనే ప్రశ్న పిల్లలు వేస్తే, మనం ఏం సమాధానం చెప్పాలి. వారాలకు ఆ క్రమం ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. మన ప్రాచీన ఋషులు మానవాళికి అమర్చిపెట్టిన, కూర్చిపెట్టిన విజ్ఞాన భాండారం విప్పి చూద్దాం రండి. ఇప్పుడంటే గంటలు అంటున్నాం కానీ, మనం ఘడియలు, విఘడియలు అనేవాళ్ళం. కానీ అసలు సిసలు పదం హోర. మనమైతే మూర్ఖంగా ఈ పదం పూర్తిగా మర్చిపోయాం కానీ, పాశ్చాత్యులు మాత్రం, మన హోరలని  Hours అని మార్చి ఎడాపెడా వాడేస్తున్నారు. వాళ్ళు Hours లో హ శబ్దం పలకరు, మన హోర పదంలో హ శబ్దాన్ని కూడా పలుకుతాం. అంటే తేడా. ఇప్పుడు హోర అంటే ఏమిటో, దాని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. రోజుకు 24 గంటలు, Hours, హోరలు. మనకున్న ఏడు వారాల గ్రహాలలోనూ వాటి గమన వేగాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ వేగంగా వెళ్లే శనిగ్రహము  మొదటి వాడు. మందంగా నడుస్తాడనే ఆయన్ని మందుడు అంటాం. తరువాత నెమ్మదస్తుడు, భారీ కాయుడు కనుక గురుడు, ఆ తరువాత కుజుడు అంటే మంగళుడు, తరువాత సూర్యుడు, ఆ పై శుక్రుడు, ఇంకాస్త వేగంగా బుధుడు, అందరికన్నా అతి వేగంగా చంద్రుడు వున్నారు. కనుక ఆ గ్రహాల గమన వేగపరంగా చూస్తే తక్కువ వేగం నుంచి ఎక్కువ వేగానికి ఆ క్రమం ఇది. శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర. ఇదే హోరా ఆర్డర్ --- శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర. ఈ క్రమాన్ని గుర్తు పెట్టుకోండి. రోజుకి 24 గంటలు, 24 హోరాలు. గంటకి ఒకటి చొప్పున ఈ ఏడూ  వరసగా తిరుగుతూ ఉంటాయి. అంటే రోజులో మొదటి ఏడు గంటలూ శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర ఇవి ఒక రౌండ్ తిరిగేస్తాయి. మళ్ళీ శని హోరా మొదలు. ఇలా 21 గంటలు అయిపోయాక మళ్ళీ శని, గురు, కుజ వస్తారు. ఆ తరువాత సూర్యుడు. అంటే రెండవరోజు మొదటి గంట సూర్యుడితో మొదలు అవుతుంది. మళ్ళీ లెక్కించండి. తిరిగి 25వ గంటకి చంద్రుడు వస్తాడు. గణితంలో దీన్ని MODULUS 7 అంటాం, సంగీతంలో సప్తస్వరాల లాగా. ఏ రోజు సూర్యోదయానికి ఏ గ్రహ హోరా ఉంటుందో ఆ రోజు ఆ వారం. ఆ ఆర్డర్ ని బట్టీ శనివారం తరువాత ఆదివారం, ఆదివారం తరువాత సోమవారం, ఆ తరువాత వరుసగా మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాలు ఏర్పడతాయి. వేగాన్ని బట్టీ గ్రహాల క్రమం శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర అయితే, 24 హోరాల ఆర్డర్ లో ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని మళ్ళీ ఆది వస్తాయి. ఎందుకంటే, ఆనాటి సూర్యోదయ సమయానికి ఆ హోరనే ఉంటుంది కనుక.  ఈ హోరా సిద్ధాంతాన్ని మేము ఆధునికులం, పురోభివృద్ధి చెందిన వారం అని చెప్పుకునే వారంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించి ఆచరిస్తున్నారు. ఇంత గొప్ప గణిత, ఖగోళ, శాస్త్ర విజ్ఞానాన్ని మనకందించిన ఆ ఋషులందరికీ శిరసు వంచి వందనం చేస్తున్నాను.  ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరుడు మొదలైన ఖగోళ గణిత ఋషులందరికీ పాదాభివందనం.  

స్థూలంగా ఇదీ మన ఉగాది కథ, పంచాంగం కథ, కాలం కథ, కాలస్వరూపం కథ. 

అందరికీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మీ భట్టిప్రోలు విజయలక్ష్మి 

 9885010650

16, మార్చి 2022, బుధవారం

మోహనం మామయ్య - రాజేశ్వరత్తయ్య

 మోహనం మామయ్య - రాజేశ్వరత్తయ్య 

               

మా అమ్మా వాళ్ళ రెండో అన్నయ్య, మోహనం అన్నయ్య, అందరికీ నండూరి రామమోహనరావుగా సుపరిచితుడు. గొప్ప కవి, రచయిత, సంపాదకుడు, పాత్రికేయుడు, పరిశోధకుడు, ఎందరికో ఎన్నింటి లోనో మార్గదర్శి, వూహా విహారి, సౌమ్యుడు, భావుకుడు, అందగాడు, నిదానస్తుడు. ఇలా మా మోహనం మామయ్య గురించి ఎన్నయినా లలితమైన, గంభీరమైన, విశేషణాలు రాయచ్చు. మా మామయ్యది మా అమ్మమ్మ పోలిక. తెల్లగా నాజూగ్గా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి భావుకత ఎక్కువ. ఆలోచన అధికం. వేదాంత పుస్తకాలు చదివీ చదివీ, ఆ వినూత్న ఆలోచనల తోనే, చిన్నవయసులో, అందరినీ వదిలేసి, హిమాలయాల బాట పట్టాడు. శివానందగారి రచనలు చదివి, వారిని కలవాలని, కొన్నాళ్ళు వారి సహచర్యంలో గడపాలని, ఏదో నేర్చుకోవాలన్న తపనతో, ఎవ్వరితో చెప్పకుండా హృషీకేశం వెళ్ళిపోయాడు. అప్పటికే మామయ్యకి పెళ్లి అయ్యింది. స్వయానా తన మేనమామ, కిష్టప్ప మామయ్య పెద్దకూతురు రాజేశ్వరినే పెళ్లాడాడు. అందమైన భార్య, చక్కటి కుటుంబం, తమాషాగా ఇవి ఏవీ కూడా మామయ్యను హృషీకేశం వెళ్లకుండా ఆపలేకపోయాయి. విషయాలు తెలుసుకున్న శివానంద గారు కోప్పడి, మామయ్యను వెనక్కు పంపించారట. అయినా కూడా మామయ్య కొన్నాళ్ళు అక్కడే వుండి, ఆ తరువాత తిరిగి వచ్చాడు. అసలే భావుకుడు, అందునా హిమాలయ పర్వత శ్రేణుల వాతావరణం, ఆ ప్రశాంత ఆశ్రమ పరిసరాలు మామయ్యను ఒక పూర్తి భావకవిగా మార్చాయి. ఆ తరువాత ఎన్నో, ఎన్నెన్నో కవితలు, పాటలు రాసాడు. తాను రాసిన పాటలకు తానే బాణీలు కట్టి పాడుకుంటూ, ఇంట్లో పిల్లలందరికీ కూడా ఆ పాటలు నేర్పేవాడట. మా కుటుంబంలో బహుశా తొలి వాగ్గేయకారుడు మోహనం మామయ్య. ఆ రోజుల్లో వాళ్ళందరూ ఆ పాటలే ఎప్పుడూ పాడుకుంటూ వుండే వాళ్లమని మా అమ్మ చెప్పింది. అదీ ఎంత విపరీతంగా అంటే, చివరికి మంగళహారతి  ఇచ్చేటప్పుడు కూడా మామయ్య రాసిన "విభుడేగుతెంచేటి వేళాయెనే సఖీ....." అని ప్రేమ, విరహ గీతాలు పాడేసేవాళ్ళట. ఇది విని చచ్చే నవ్వేదాన్ని నేను. 

       
 
మామయ్య ప్రవృత్తి రీత్యా భావకవి అయినా, వృత్తి రీత్యా, జీవనోపాధి కోసం పాత్రికేయుడయ్యి, ఆ తరువాత, ఎంతో గొప్ప సాహిత్యాన్ని, భారతీయ పాశ్చాత్య వేదాంతాన్ని, చివరకు సైన్స్ సాహిత్యాన్ని కూడా విపులంగా రాసి తెలుగువారి అందరికీ పరిచయం చేసాడు. మోహనం మామయ్య రాసే సంపాదకీయాలంటే అప్పటికీ ఇప్పటికీ ఒక గీటురాయి, ఒక ప్రమాణం, ఒక కొలబద్ద. ఎందరో పాత్రికేయులకు అవి నేటికీ మార్గదర్శకాలు. మామయ్య ఎంత ఎదిగినా ఒదిగే ఉండేవాడు. గర్వం అనేది మచ్చుకైనా కనిపించేది కాదు. 'నేను కదా ఇంతంత గొప్ప రచనలు చేసాను' అన్నట్టు ఎప్పుడూ డాబూ, దర్పం, అతిశయం, అహంభావం ప్రకటించలేదు. అమ్మమ్మ, తాతయ్యల పెంపకం నమూనా అది. అన్నదమ్ములందరిలోకీ పెద్ద పేరు తెచ్చుకున్న వాడు, కళాప్రపూర్ణుడు మోహనం మామయ్య. సింపుల్ గా ఉండేవాడు. చక్కటి చిరునవ్వు ఎప్పుడూ ముఖం మీద ఉండేది. ఎవరినీ కోప్పడ్డట్టు నేను ఎప్పుడూ చూడలేదు. కానీ వాళ్ళ పిల్లలందరూ ఎందుకో మామయ్యకి, (మేము మా నాన్నకి దగ్గరయ్యినట్టుగా) ఉన్నట్టు నాకు ఎప్పుడూ కనిపించలేదు. మా తరంలో ఆయన్ని బతిమాలి పాటలు పాడించి, విన్న అదృష్టం నాదే. అందరి మేనల్లుళ్లు, మేనకోడళ్లలోనూ, ఆయనతో ఎక్కువ పరిచయం, సాన్నిహిత్యం వున్నది నాకే. ఈ మాట మా మోహనం మామయ్య కూడా స్వయంగా నాతో అన్నాడు. (మా పెద్దమామయ్య పిల్లలకి ఇంకా ఎక్కువ సాన్నిహిత్యం ఉందేమో మరి నాకు తెలియదు. అందుకని నా స్టేట్ మెంట్లో వాళ్ళని మినహాయించి అని చదువుకోవాలి). మామయ్య జీవితంలో సింహభాగం ఎప్పుడూ తన రచనలు, జర్నలిజం ఆక్రమించాయి. ఆయన ఊహావిహారం ఆయనది, ఆయన పరిశోధనా ప్రపంచం ఆయనది, ఆయన సాహితీ వ్యవసాయం ఆయనది, ఆయన కవితా ఘోష ఆయనది, ఆయన భావనాలోకం ఆయనది. ఇల్లు, పిల్లలు రెండో ప్రయారిటీకి వెళ్లిపోయాయి. ఈ భాగం పూరించడానికా అన్నట్టు, దేవుడు ఆయన జీవితం లోకి మా రాజేశ్వరత్తయ్యను పంపించాడు. శివపార్వతులిద్దరూ కలిస్తే పూర్ణం అవుతారు. అలాగే వీళ్ళు కూడా, ఒకళ్ళలో లేని క్వాలిటీస్ ఇంకొకళ్ళలో వుండి ఇద్దరూ కలిసి పూర్ణం అయ్యారు. నాలోని రచయిత్రికి మామయ్య ఇష్టమైతే, నాలోని తల్లికి అత్తయ్య అంటేనే ఎక్కువ ఇష్టం. అత్తయ్య చాలా సక్సెస్ ఫుల్ తల్లి.  పిల్లలని చాలా బాగా పెంచింది. 

   

రాజేశ్వరి అత్తయ్య భలే చక్కనిది, మంచి రంగు, సౌమ్యురాలు. ఎప్పుడూ గొంతు వినపడేదే కాదు. నిదానంగా ఉండేది. మా అమ్మ రాజు వదిన, చిన్నవదిన అనేది. ప్రతి విజయవంతమైన స్త్రీ వెనకాల పురుషుడు ఉంటాడు అంటారు, సుబ్బులక్ష్మికి సదాశివం లాగా. కానీ నేను మాత్రం మామయ్య సాహితీ, పాత్రికేయ విజయాల వెనుక వున్నది అత్తయ్య అంటాను. మామయ్యకి ఇంటి బాధ్యత ఏదీ తగలకుండా చూసుకున్నది అత్తయ్యే. ఇంటి విషయంలో నిష్పూచీగా వున్నాడు కనుకే, మామయ్య అంత గొప్ప సాహిత్యాన్ని చదువరులకి అందించగలిగాడు. పిల్లల పెంపకం, చదువులూ, పెళ్ళిళ్ళూ, పేరంటాలూ అన్నీ అత్తయ్యే చూసుకునేది. అవసరానికి మామయ్య, అత్తయ్య పక్కన కూర్చుని ఆ సమయానికి ఆ కార్యక్రమం నడిపించేవాడు. మామయ్య రాసుకుంటుంటే ఆయనకి ఏ అంతరాయం, ఆటంకం రాకుండా చూసుకునేది. అందుకేనేమో, వాళ్ళ ఇల్లు ఎప్పుడూ చాలా నిశ్శబ్దంగా ఉండేది. ఆయన గదిలోకి వెళ్లి ఎవరూ ఆయన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. పిల్లలందరినీ తన లాగా సౌమ్యంగా పెంచింది. అయిదుగురు పిల్లలూ నిదానస్తులే. అందరికీ అత్తయ్య, మామయ్యల అందం వచ్చింది. మా కుటుంబంలో అందరి కన్నా వీళ్ళు చక్కని అందమైన పిల్లలు అనే పేరుండేది. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు.

  
   రాజేశ్వరి అత్తయ్య, మీనాక్షి పిన్ని, లలిత పిన్ని                      సీతామ్మతో అత్తయ్య 

ఇక్కడ అత్తయ్య సమర్ధత, చాకచక్యం, తెలివితేటలు, ధైర్యం గురించి చెప్పాలి. ద్రోణంరాజు కృష్ణమూర్తి గారి అమ్మాయి. చిన్నప్పుడే తల్లి పోతే, వాళ్ళ బామ్మ పెంపకంలో విస్సన్నపేట లోనే పెరిగింది. ఆ రోజుల్లోని వానాకాలం పల్లెటూరి చదువు. మా అమ్మమ్మ అన్నయ్య కూతురు. చిన్నప్పుడు పెళ్లి అనుకునే రోజుల్లో, కట్నం ఇస్తే గానీ పెళ్లి కాదు అనుకుంటున్నప్పుడు, ధైర్యంగా అంత చిన్నపిల్ల కూడా "ఎలాగూ కట్నం ఇస్తున్నారు కనుక, బావనే చేసుకుంటాను" అని చెప్పిందట. అలా పెళ్లి కుదిరిందిట వాళ్లకి. అత్తయ్యే ఒకసారి ఈ విషయం చెప్పింది. పెళ్లి అయిన తరువాత కొద్ది రోజులకే, మామయ్య శివానంద ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అల్లుడు ఇలా వెళ్లిపోయాడన్న బెంగతో అత్తయ్యా వాళ్ళ నాన్న చనిపోయారుట. "నాకిప్పుడు అమ్మానాన్నా ఇద్దరూ లేరు, మీరు కాకపోతే నన్ను ఇంకెవరు చూస్తారు" అంటూ వాళ్ళ బామ్మ ప్రోద్బలంతో మామయ్యకి ఉత్తరం రాసిందట. దాంతో మామయ్యకి తన బాధ్యతలు, బంధాలు గుర్తొచ్చి తిరిగి వచ్చాడు కాబోలు. మొత్తానికి తన సమస్య చక్కగా, ధైర్యంగా, మర్యాదగా సాల్వ్ చేసుకుంది. ఈ మామయ్యా అత్తయ్యా ఇద్దరూ చూడచక్కని జంటలా కలిసి మెలిసి ఉండేవారు. మామయ్యా ఉద్యోగరీత్యా మద్రాసు వెళ్తే, ఏ తోడూ లేకపోయినా, మామయ్యుంటే చాలు అన్నట్టుగా ధైర్యంగా ఆయనతో వెళ్లి, భాష తెలియని వూళ్ళో కూడా హాయిగా వుంది.  

  

అత్తయ్య తానే పూనుకుని పిల్లలందరి పెళ్లిళ్లూ కుదిర్చింది. అందరితో మంచిగా ఉంటూ తనకు కావలసిన పని చేయించుకునేది. చక్కగా నవ్వుతూ మాట్లాడేది. మల్లెపూవులా ఉండేది. చీర కానీ, జుట్టు కానీ నలగనిచ్చేది కాదు. చక్కగా లక్ష్మీకళతో ఉండేది. ఎప్పుడూ, ఎవరితోనూ ఘర్షణ పడ్డట్టు నేను ఎప్పుడూ చూడలా. సన్నగా మాట్లాడేది. గొంతు పెద్దది చేయటం కూడా నేను ఎప్పుడూ వినలా. కృష్ణప్రసాద్, సత్యవతి, నిర్మల, శకుంతల, ఫణి అందరినీ సమానంగా చూసుకునేది. తన భర్త ఎంత గొప్పవాడో తెలిసినా, ఏనాడూ గర్వం చూపేది కాదు. మామయ్యకే లేని హెచ్చులు తనకెందుకు అన్నట్టు ఉండేది. ఉన్నదాంతో తృప్తిగా, హాయిగా ఉండేది. మామయ్యా అంతే. ఇల్లు శుభ్రంగా వుంచుకునేది. కృష్ణప్రసాద్ పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళ వరకూ కూడా ఇంటి బాధ్యత వదల్లేదు. చక్కగా మనవలని, మనవరాళ్ళనీ, మునిమనవలు, మునిమనవరాళ్ళనీ చూసింది. సత్యవతి పిల్లలు శ్రీదేవి, శ్రీలతల పిల్లలను కూడా చూసింది. తన పిల్లలు కూడా వయసులో పెద్దవాళ్ళవటం గమనించింది. మామయ్య పోయాక కొన్నాళ్ళు పిల్లలతో వున్నా, తాను వాళ్ళకెవరికీ భారం కాకూడదని, తనంతట తనే ఒక స్నేహితురాలి ద్వారా ఒక వృద్ధాశ్రమంలో చేరింది. అక్కడ కూడా అందరితో చాలా స్నేహంగా ఉండేది. వాళ్లందరితో కలిసి మెలిసి ఉంటూ ఊరగాయలు పెట్టించేది. ఆశ్రమంలో వాళ్ళు కూడా అత్తయ్యకి అభిమానులైపోయారు. అత్తయ్య పోయినప్పుడు వాళ్లంతా ఆశ్రమం నుంచి ఒక బస్సులో వచ్చి మరీ అత్తయ్యను చూసారు. అత్తయ్య చివరి మజిలీ కూడా చాలా సునాయాసంగా జరిగిపోయింది. అమెరికాలో వుండే శకుంతల కూడా అనుకోకుండా అప్పుడు దగ్గరే వుంది. అన్నీ అది దగ్గర వుండి చూసుకుంది. ఎంత నిదానంగా, నిశ్శబ్దంగా ఉండేదో, అంతే నిదానంగా, నిశ్శబ్దంగా నిష్క్రమించింది. మామయ్యకి చివరిరోజుల్లో మతిమరపు వస్తే, పక్కనే వుంటూ ఆ లోపం పూరించేది. ఇద్దరూ ఒక్క మాటగా వుండేవాళ్ళు. చివరికి మామయ్య వాళ్ళ రెండో అమ్మాయి నిర్మలకు ఒకసారి కొన్ని మంచి మాటలు అంటూ "సప్త సూత్రాలు" రాసిచ్చాడు. ఆ కాపీ ఒకటి నిర్మల నుంచి నేను తీసుకున్నాను. ఆ మాటలు మా ఇద్దరివీ అంటూ ఇద్దరి సంతకాలూ పెట్టి ఇచ్చాడుట నిర్మలకి. 

నిజంగా ఆ ఇద్దరూ ఎప్పుడూ ఒక్కటే. సైలెంట్ గా, సామరస్యంగా వుండే దంపతులు వాళ్ళు. ఇవీ ఈ ఇద్దరి గురించీ నాకు తెలిసిందీ, నేను చెప్పగలిగిందీ, చెప్తున్నదీను.  


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650


6, మార్చి 2022, ఆదివారం

ఆ తోటలోనొకటి ఆరాధనాలయము

ఆ తోటలోనొకటి ఆరాధనాలయము

ఈ పాట మా అమ్మకు ఎంతో ఇష్టం. మా అమ్మ ఈ పాట పాడితే మా నాన్నకి మరీ ఇష్టం. చక్కగా సన్నగా పాడేది. ఈ పాటంటే మా కందరికీ ఇష్టం, పైగా మా నలుగురికీ ఈ పాట వినంగానే మా అమ్మ గుర్తు వస్తుంది. ఆ మధ్య మా తమ్ముడు వివేక్ ఒకసారి ఈ పాట నేర్చుకుంటూ, "దీని అర్ధం చెప్పవే, అప్పుడైతే, పాటలో భావాలు బాగా పలుకుతాయి" అన్నాడు. అప్పుడు వాడి కోసం రాసిన వివరణ ఇది. మీ అందరి కోసం ఇప్పుడు జ్ఞాపకాలదొంతర బ్లాగ్ లో పెడుతున్నాను.

                      

మేము విజయవాడలో వున్న రోజుల్లో మానాన్న ఏదో పత్రికలో ఫోటో కాంపిటీషన్ కోసం, మా అమ్మని మేడమీదకు తీసుకువెళ్లి, ఈ ఫోటో తీసి, "నారీ-నారికేళం" అనే పేరుతో పంపించాలని అనుకున్నాట్ట. మరి పంపించాడో, లేదో ఎప్పుడూ చెప్పలేదు. ఈ రెండో ఫోటో మా అమ్మ మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు. 

ముందుగా ఆ పాత పాట మీ అందరి కోసం. 

ఆ తోటలోనొకటి ఆరాధనాలయము ఆ ఆలయములోని అందగాడెవరే అందగాడెవరే.....అందగాడెవరే మన్మథుండనీ చెలియా మనసు ఘోషించెనే మరలీ వచ్చెదమన్నా మరపురాకున్నాడే //ఆ తోటలో// చంద్రబింబపు ముఖమూ గండుకోకిల స్వరమూ పండూ వెన్నెలలోనే పవ్వాళించేనమ్మా చెలియా, చుక్కల్లా రేడమ్మ సఖియా మరుని శరములు చేత మనసునిలువక నేను మల్లె మొల్ల మొగలి మాలతి మందార మాలికలు వాని మెడలోన వైచినానే మధురామూర్తి మేల్కొని మందహాసము చేయ మకరకర్ణిక మెరిసేనే చెలియా మదివెన్న చిల్కినదే సఖియా

మెరపులోనా నేను మైమరచి వెంటనే
పేరేమిటని వాని ప్రశ్నించినానే
పేరేమిటని వాని ప్రశ్నించినానే

మాయాదేవీ సుతునని మధురామూర్తీ పల్కె
సిద్ధార్థుడే నాకు సిద్ధించెనే చెలియా
మది కోర్కె నెరవేరె సఖియా.....

ఆ తోటలోనొకటి ఆరాధనాలయము ఆ ఆలయములోని అందగాడితడే.....


ఆ తోటలోనొకటి ఆరాధనాలయము    ఒరిజినల్ పాట లింక్  

వివేక్ .... ఆ తోటలోనొకటి         తమ్ముడు పాడిన పాట లింక్ 

ఈ పాటపైన నేను వివేక్ కి రాసిన నా భావం.........   

ఒక  చక్కని  పడుచు తన చెలికత్తెతో చీకటి పడ్డాక ఒక తోటలో మందిరానికి వెళ్ళింది. గుళ్లో దేవుడి కన్నా ఆమెను వెన్నెల్లో నిద్ర పోతున్న (పవ్వళించిన) ఒక అందగాడైన యువకుడు ఆకర్షించాడు.  (తరువాత పాటలో ఆ యువకుడే బుద్ధుడని తెలుస్తుంది) 

ఆతడు మన్మధుడిలాగా ఉన్నాడని తెలిసి మనసు మొత్తుకుంది. వెనుతిరిగి వచ్చేద్దామంటే ఎంతకీ మరిచి పోలేక పోతోంది. 

ఆ తోట లోని ఆ మందిరంలో ఉన్న ఆ అందగాడెవడు అనే ప్రశ్న ఆమెను వదల్లేదు. 

ఆ నిద్రిస్తున్న యువకుని ముఖం చంద్రబింబం వలె ఉంది. స్వరం గండు(మగ)కోకిల వలె ఉంది, అని ఆ పడుచు అనుకుంది. (ఈమెకి ఆతని స్వరం తనకు తరువాత సమాధానం చెప్పినప్పుడు మాత్రమే వినిపించింది. కానీ ముందే గండు కోకిల స్వరము అన్నాడు కవి. ఇది ఒక దోషమేమో. పోనీ ఇంకెవరితో నైనా మాట్లాడేటప్పుడు విన్నదీ అనుకుంటే, వెన్నెల్లో నిద్ర పోతున్నాడని కూడా ఆ నాయికే అన్నది.) (ఇంకో విషయం......సృష్టిలో సాధారణంగా మగజంతువులు అన్నీ, ఆడజంతువులు వాటిని చూసి మోహించటానికి ప్రత్యేకంగా పింఛమో, జూలో, డోలో, చక్కటి గొంతో ఇలా ఏదో ఒక స్పెషాలిటీ కలిగి ఉంటాయి)

ఆ అందగాడు చక్కటి వెన్నెల్లో, నిద్రపోతున్నాడు.

వాడు చుక్కల్లరేడు, అంటే, చుక్కల్లో చంద్రుడు వలె వున్నాడు, అంటోంది నాయిక తన సఖితో.

మరుని శరము, అంటే, మన్మధ బాణాల తాకిడికి మనసు ఆగక ఆ నాయిక మల్లె, మొల్ల, మొగలి, మాలతి, మందారం పూలతో అల్లిన మాలలు అతని మెడలో వేసింది. దేవుని కోసం అనే మిషతో  తెచ్చిన మాలలని మోహంతో, ఆ యువకుడి మెడలో వేసింది. ఇదో  గడుసుదనం కూడా. లేకపోతే ఎలా మరి. ఆ సుందరుడేమో పడుకునే వున్నాడు, లేవటం లేదు. తన ప్రేమను ప్రకటించటం ఎలా. ఆలయానికి వస్తూ తెచ్చిన సుగంధ పుష్పాల మాలలని ఈతడి మెడలో వేసేసి అతడికి మెలకువ వచ్చేలా చేసింది. 

ఇక్కడో మధురోహ వుంది. ఆ కన్యకు ఎలాగైనా సరే నిద్రిస్తున్న ఈ అందగాడిని లేపి మాటలు కలపాలనీ, తన ప్రేమను వెల్లడించాలనీ వుంది. మన్మథుడేమో ఈ కన్య మీద ఇప్పటికే తన అయిదు పుష్పబాణాలనీ, పద్మము, అశోకము, మామిడిపూత, నవమల్లిక, నల్లకలువ బాణాలనీ  ప్రయోగించేసి వున్నాడు. ఆ బాణాలు ఆ కన్యని సమ్మోహన పరిచేశాయి. అరవిందమశోకంచ, చూతంచ నవమల్లికా, నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చశాయకా. ఈ అయిదు బాణాలూ బ్రహ్మ మన్మథునికి ఇచ్చాడు, బ్రహ్మకి సృష్టి కార్యంలో మన్మథుని సాయం కావాలి కదా మరి. ఈ కన్య దగ్గర ఆ పంచ పుష్పాబాణాలకి  బదులు, దేవుడి కోసం తెచ్చిన వేరే పంచపుష్పాల మాలలు వున్నాయి. వెంటనే చేతిలో వున్న సజ్జలో నుంచి మల్లె, మొల్ల, మొగలి, మాలతీ, మందార పుష్పమాలలు తీసింది. ఆ యువకుడి మేడలో తటాలున తన సమ్మోహన పంచ పుష్ప బాణ మాలలను వేసేసింది. ఆ సుగంధ భరిత స్పర్శకి ఆ అందగాడు లేచి చిరునవ్వు నవ్వాడు.  కన్య కోరిక సిద్ధించింది. 

ఆ పూమాలల స్పర్శకు ఆ మధురమూర్తి లేచి చిరునవ్వు నవ్వాడు. అప్పుడు అతని చెవులకు పెట్టుకున్న మకరకుందనాలు (మకరకర్ణిక......మొసలి ఆకారంలో ఉన్న చెవి దిద్దు) తళుక్కున మెరిసాయి. అది చూసిన నాయికకు మనసులో వెన్న చిలికినట్టు అయ్యింది. మరి మన్మథుడు చేసేది మనోమథనమే కదా.

అప్పుడు ఆ కన్య పరవశంతో ఒళ్ళు మరిచి, అతన్ని వెంటనే నీ పేరేమిటి అని అడిగింది. అతడు వెంటనే నేను మాయాదేవి పుత్రుడిని అని చెప్పాడు. అప్పుడు ఆమెకు, ఈ అందగాడు మాయాదేవీ కుమారుడు సిద్ధార్థుడు అని తెలిసింది. సిద్ధార్థుడు అంటే సిద్ధించిన కోరిక కలవాడు అని అర్ధం. అప్పుడు ఆమె "ఆహా, తనకు దొరికింది సిద్ధార్థుడు" అని ఎంతో ఆనందించింది. 

తన మనసు లోని కోరిక తీరింది అని సంతోషించింది. బహుశా ఈమె ముందు నుంచీ ఇతని గురించి విని, తెలిసి ఇష్టపడి ఉంటుంది. ఈ యువకుడి కోసమే ఆమె రోజూ ఈ ఆలయానికి వచ్చి పోతోందేమో. ఆ సిద్ధార్థుడు ఈమెని ఎప్పుడూ గమనించి ఉండడు. సమయం కోసం ఎదురు చూసి, ఆతడు పవ్వళించి వున్నప్పుడు వచ్చి, మాలలు మేడలో వేసి, మేల్కొలిపి, ఆతడు ఎవరో కనుక్కుని సంతోషపడింది. సిద్ధార్థుడిని వలచిన ఆ పడతికి ఇన్నాళ్ళకి సిద్ధార్థుడు సిద్ధించాడు. ఆహా,  ఈ మనోహరుడు, ఈ మధురమూర్తి, ఈ చుక్కల్లరేడు, ఈ మన్మథుడు నా  సిద్ధార్థుడే అని ఆ పడుచు మహదానంద పడింది. 

ఫైనల్ గా 

ఆ తోటలోని ఆలయం లోని అందగాడు ఇతడే అని ప్రకటిస్తూ హర్షం వ్యక్తం చేసింది. 

ఇక పాటలోని అభిసారిక విషయానికి వస్తే, 

సిద్ధార్ధుని జీవితంలో వచ్చిన స్త్రీలు మాయాదేవి, గౌతమి కాక, భార్య యశోధర, వైశాలి నగర గణిక ఆమ్రపాలి, బుద్ధగయలో పాలు పోసి ప్రాణం నిలబెట్టిన సుజాత అనే కన్య. 

పాట లోని పడుచు ఖచ్చితంగా యశోధర కాదు. యశోధర శుద్ధోధనుడు చేత సిద్ధార్థుని మనసు ఆకట్టుకోటానికి ఎన్నుకోబడిన కోడలు. అది ప్రేమ వివాహంగా ఎక్కడా చెప్పబడలేదు. కనుక ఆ యువతి యశోధర కాదు.    

మాయాదేవి కొడుకుని కని పురిటి లోనే జబ్బు పడి చనిపోయింది. అయినప్పటికీ బుద్ధుణ్ణి మాయాదేవి పుత్రుడు గానే సంఘం లెక్కించింది. తల్లి చనిపోతే అంతఃపుర దాసి గౌతమి పెంచింది. ఆ రోజుల్లో ఇంకా మాతృ స్వామ్యం పోలేదు. పితృ స్వామ్యం అప్పుడప్పుడే వస్తున్న రోజులు. పిల్లలు వారి తల్లుల పేర్ల తోనే గుర్తించబడేవారు. గౌతమీ పుత్ర శాతకర్ణి లాగా. సిద్ధార్థుడికి పెంపుడు తల్లి పేరు మీద గౌతముడు అనే పేరు కూడా వుంది. 

అది జరిగింది వైశాలిలో కూడా అయి ఉండదు. వైశాలిలో ఆమ్రపాలి అప్పటి రోజుల్లో ఖరీదైన గణిక, అంటే వేశ్య. ఆమ్రపాలి ఉదంతం బుద్ధుని తరువాత అతని శిష్యుల్లో ఒకనితో జరిగింది, బుద్ధుడు, ఆమ్రపాలి సమకాలీకులు కాదు అని కూడా చెప్పుకుంటారు. ఏది ఏమైనా ఆమ్రపాలి కాలానికి బుద్ధుడు యువకుడు కాదు వృద్ధుడు. 

బహుశా ఈ అమ్మాయి సుజాత కావచ్చు. ఆ గుడి బుద్ధగయలో ఉండి ఉండొచ్చు. సుజాత అయితే కొద్దిరోజులుగా అతన్ని గుడికి వచ్చినప్పుడు గమనిస్తూ ఉందని అనుకోవచ్చు. ఈ సుజాతే ఉపవాసాలతో శుష్కించి, స్పృహ తప్పి పడి వున్న బుద్ధుణ్ణి గమనించి, అతనికి ఆహారం ఇచ్చి చావకుండా రక్షించింది. ఈ సంఘటన వలననే బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది. అప్పుడే అతడికి, "ఉపవాసాలు, పస్తులు, దేవుణ్ణి (సత్యాన్ని) చూపలేవు", అనే సత్యం బోధపడింది.  అతని జీవితంలో స్త్రీలు కేవలం మాయాదేవి, గౌతమి, యశోధర, ఆమ్రపాలి. కానీ ఆమ్రపాలిని కలుసుకునేసరికి బుద్ధుడు యవ్వనదశని దాటాడు. కనుకనే ఆ పాటలోని పడుచు, సుజాత ఏమో అని అనుకుంటున్నా. 

ఇక ఈ పాట రచన, సంగీతం గురించి........ 

ఇటువంటి అందమైన ప్రేమ భావాలు పలికించేది, సాధారణంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు గార్లు. అందుకే రచయిత వాళ్ళల్లో ఒకరు అని ముందు అనుకున్నా. కానీ తరువాత తెలిసింది, రచయిత సాలూరు సన్యాసిరాజు గారు, సాలూరు రాజేశ్వరరావు గారి తండ్రి. తండ్రి పాటకు కొడుకు సంగీతం సమకూర్చి రావు బాలసరస్వతి గారిచే పాడించాడు. ఆ రోజుల్లో ఈ పాట ఒక గొప్ప హిట్టు. ఈ పాట సరిగ్గా ఏ సంవత్సరంలో రిలీజ్ అయ్యిందో మాత్రం తెలియలేదు. సుమారుగా 1940 లలో అయి ఉండవచ్చు. 

ఈ పాట పాడిన రావు బాల సరస్వతీ దేవి. ఈవిడ చరిత్ర కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. నెల్లూరు దగ్గర వెంకటగిరి సంస్థానం జమీందార్ల ఇంట్లో పుట్టిన (రాజ)వెలమ కన్య. వారింట్లో కొంచం ఘోషా ఆచారం తక్కువ. తెలుగు సినిమాల్లో పాడిన మొదటి నేపధ్య గాయని కూడా ఈవిడే. తన ఆరేళ్ళ వయసులో ఫస్ట్ రికార్డింగ్ ఇచ్చిందని అంటారు. కొన్ని సినిమాల్లో వేషాలు కూడా వేసిందిట. అద్భుతమైన అందగత్తె. సుమారు 25, 30 ఏళ్లపాటు సినీ రంగాన్ని తన పాటలతో దున్నేసింది. అందుకే అమ్మావాళ్ళకి ఆవిడ అంటే అంతిష్టం. ఎంతో ఇష్టపడి ఈవిడను, ఈవిడ పాటను మోహించి, నూజివీడు/చల్లపల్లి మహారాజు ఈవిడను పెళ్లాడి అంతఃపురంలో ఉంచేశాడట. అప్పటినుంచి ఆవిడ పాటల్లేవు. ఆ అత్తగారింట్లో విపరీతమైన ఘోషా పధ్ధతి వుంది. 

ఆ భర్త చనిపోయాక, ఒక 10 ఏళ్ల నుంచి సభల్లో, సమావేశాల్లో కనబడుతోంది, వినబడుతోంది. ఇప్పటికీ ఎంతో మధురంగా పాడుతోంది. ఈ వయసులో కూడా ఎంత అందంగా, నాజూగ్గా ఉంటుందో.... ఆవిడ వయసు 90 ఏళ్ల పైనే. పక్కా తెలుగావిడ, ఉత్తరాది మహిళ కాదు. కాకపోతే, రచయిత, మ్యూజిక్  డైరెక్టర్ ఎలా చెప్తే అలా పాడాలి కదా. హిందుస్తానీ బాణీలు కూడా బాగా పాడేది. 

మా వివేక్ కల్పనల పెళ్లి తరువాత 


అమ్మతో మేము ముగ్గురం, సుస్మిత, కింద కొంచెం మా ప్రమోద్ కూడా కనిపిస్తున్నాడు. 

ఇక్కడ బక్క పద్మ,  శ్రీ రాజిత కూడా వున్నారు.  
  

బుద్ధుడు అంటే అమ్మకు ఇష్టం. లుంబిని చూడాలని అనుకుంది. మా నేపాల్ ట్రిప్ లో 
మా అమ్మా, నేనూ, సరిగ్గా బుద్ధుడు పుట్టిన చెట్టు కింద తిన్నె మీద. 
ఈ చెట్టు కొమ్మ పుచ్చుకుని నించుని బుద్ధుణ్ణి మాయాదేవి కన్నదట. 



ఇదీ మా అమ్మ పాట కథ. బుద్ధుడి కథ.


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650

26, జూన్ 2020, శుక్రవారం

పరమాచార్యుల ప్రసన్నదృష్టి

పరమాచార్యుల ప్రసన్నదృష్టి 

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                      స్వాములవార్లు వచ్చేరోజుకి ఒక రోజు ముందరే అందరం ఆరుగొలను చేరుకున్నాం. ఇటు నందివాడ కుటుంబం నుంచీ, అటు నండూరి కుటుంబం నుంచీ దాదాపు అందరూ వచ్చారు. స్వాములవారికి  పూర్ణకుంభంతో  స్వాగతం చెప్పారు అమ్మా, నాన్నా. స్వాములవారితో పాటు పెద్ద సంఖ్యలో సిబ్బంది కూడా వచ్చారు.  బళ్ళూ, ఎడ్లూ, వాటిని నడిపే వాళ్ళూ, పల్లకీ, దాన్ని మోసే బోయీలూ, ఒక ఏనుగూ, దాని మావటీ వచ్చారు. వీళ్ళే కాక, వేదపండితులూ, పూజారులూ, సేవకులూ, వంట బ్రాహ్మణులూ, వీళ్లంతా కూడా వచ్చారు. ఇంతమందికీ నాన్నా వాళ్ళ ఇల్లే విడిది. దాన్నే మేము ఓ నెల క్రితం బాగు చేయించింది. సుమారు ఓ 50, 60 మంది అక్కడ దిగారు. స్వామివారు వస్తూనే పీఠం పెట్టారు. స్వాములవారికి ఊరు ఊరంతా బ్రహ్మరథం పట్టింది. పది రోజులు ఉన్నారు ఆరుగొలనులో పీఠంతో సహా స్వామీజీ. ఆ పది రోజులు ఊరంతా జాతరే జాతర. రోజూ పూజలూ, తీర్థాలూ, ప్రసాదాలూ, ప్రవచనాలూ కోలాహలంగా సాగింది. మొదటి పాడుపడిన ఇంటికి, ఇప్పుడు సందడిగా ఉన్న ఇంటికి పోలికే లేదు. పరమాచార్యుల పాదం పడి ఆ ఇంటికి చక్కటి కళ వచ్చింది. 

   

శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామి

                                                   చిన్నస్వామి జయేంద్ర సరస్వతి స్వామివారు కూడా వచ్చారు. మా తాతయ్య సత్యనారాయణ గారు వెళ్లి స్వామివారిని తన ఇంటికి కూడా ఒకసారి రమ్మని పిలిచారు. కానీ స్వామివారు తాను రాలేననీ, చిన్న స్వామిని పంపిస్తానని, జయేంద్ర సరస్వతిని పంపించారు. అప్పుడు అందరూ ఆయనకి పాదాభివందనం చేసాం. ఇక్కడ జయేంద్ర సరస్వతిని గురించి కొంచెం చెప్పుకుందాం. ఈ స్వామికి వివేకానందుని వలె దేశం గురించీ, ధర్మం గురించీ, మతం గురించీ ఎన్నో ప్రశ్నలూ, మరెన్నో ఆలోచనలూ ఉండేవనుకుంటా. చివరికి శంకర విజయేంద్ర సరస్వతిని బాలస్వామిగా ప్రకటించాక 1987 లో ఎవరికీ చెప్పకుండా, చివరికి పరమాచార్యుల వారికి కూడా తెలియకుండా నిశ్శబ్దంగా, ఒక రకంగా సన్న్యాసాన్ని కూడా సన్యసించి తలకావేరి, కావేరీనదీ జన్మస్థానం, చేరుకొని అంతర్ముఖులై తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు. ఈ లోపల పరమాచార్య చెప్పగా మఠం నుంచి పండితులు వచ్చి జయేంద్రులని ఒప్పించి కంచికి తీసుకువచ్చారు. ఇద్దరు ఆచార్యులూ కూర్చుని చర్చలు జరిపారు. గురువుల మాటని గౌరవించి తిరిగి పీఠం బాధ్యతలు స్వీకరించారు జయేంద్రులు. మరోసారి 1991 లో జయేంద్రులని తిరుమలలో కలిసాను. నేను M.Ed. క్లాసుల కోసం తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమల కూడా వెళ్లాను. అలా తిరుమల వెళ్ళినప్పుడు కంచి స్వామి అక్కడే ఉన్నారని తెలిసి వెళ్లి దర్శనం చేసుకున్నా. అప్పుడు వారికి ఆరుగొలను గురించి గుర్తు చేసాను. నవ్వి  అక్కడ  ఉన్న అందరికీ ఆయన  "మేము వీళ్ళ ఊరికి వెళ్లాం" అని చెప్పారు.


     

      జయేంద్ర సరస్వతీ స్వామి                    శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి 
                                                     
                                             సాయంత్రం పూట స్వామివార్ల కోసం హరికథలూ, పురాణ కాలక్షేపాలూ, పౌరాణిక, చారిత్రిక నాటకాల ప్రదర్శనలూ నిత్యం జరిగేవి. ఊర్లో అందరూ తమ కష్టసుఖాలు చెప్పుకునేవారు. స్వామివారు వారికి ఏ జపమో, పూజో చెప్పేవారు. ఊర్లో అందరూ నాన్నని ఆరాధనగా, గర్వంగా చూసేవారు. మేము సుమారు 50, 60 మంది అమ్మమ్మా వాళ్ళింట్లో ఉండేవాళ్ళం. భోజనాలన్నీ స్వాములవారి తోనే. నడిచే దేవుడు చంద్ర శేఖరేంద్ర సరస్వతి మా ఊరంతా నడిచే తిరిగారు. ఆరుగొలనులో చెరువుని చూసి, "ఈ చెరువులో ఎవరూ స్నానం చేయకండి. మంచిది కాదు. ఏ చెరువులోనైనా స్నానం చేయాలంటే ఆ చెరువు మధ్యలో ఒక మంటపం కానీ స్తంభం కానీ ఉండాలి. లేకపోతే ప్రమాదం" అని చెప్పారు. తానూ ఆ చెరువులో స్నానం చెయ్యలేదు. మా ఇంటి బావి నీటి తోనే స్నానం చేసేవారు. ప్రతిరోజూ ప్రవచనాలు చెప్పేవారు.  ఊరు ఊరంతా చాలా క్రమశిక్షణతో స్వామివారు ఏమి చెప్పినా వినేవారు. అందరికీ ప్రతి నిత్యం ఏమేమి శ్లోకాలు చదువుకోవాలో చెప్పారు.

                                                               తెనాలి తాలూకా హైస్కూల్ నుంచి మహామహులంతా వచ్చారు. తెనాలి గురించి, అక్కడ మా స్కూల్లో పనిచేసే టీచర్ల ఎక్స్ట్రా ఆర్డినరీ టాలెంట్ గురించి ముందు పోస్టులలో చెప్పా గదా. ఆ రోజుల్లో ఆ స్కూల్లో ములుకుట్ల సదాశివ శాస్త్రిగారు  తెలుగు పండితుడుగా పనిచేసేవారు. వారి దగ్గర కొన్ని నెలలు నేనూ, మా చెల్లెలు భారతీ సంగీతం, వీణా నేర్చుకున్నాం కూడా. ములుకుట్ల వారు ఆరుగొలను వచ్చి హరికథలు చెప్పారు. స్వామివారు చాలా సంతోషించి ఆయన్ను బ్లెస్ చేశారు. ఆ హరికథలు విని ఊళ్లోవాళ్ళు ఎంత ఆనందపడ్డారో.  తరువాత నాటకాలు వేసే వాళ్ళ వంతు వచ్చింది. మొత్తం టీమ్ కిరీటాలు, గదలూ, కత్తులూ, వగైరా అన్నింటితో సహా దిగేసారు. రెండు రాత్రులు తెల్లవార్లూ పాండవ ఉద్యోగ విజయాలు, కురుక్షేత్రం నాటకాలు వేశారు. తమాషాగా ఈ నాటకాలు తెల్లవార్లూ సాగుతాయి.  అందుకని మొదటినుంచి చివరిదాకా నడిచే ముఖ్యమైన కారెక్టర్ కృష్ణుడు లాంటి పాత్రలు వేసేవాళ్ళు ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు.  వాళ్ళని ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అనేవాళ్ళు.  ఆరుగొలను వాళ్ళైతే ఈ నాటకాలు చూసి పిచ్చెక్కి పోయారు. వాళ్ళు ఇంతవరకూ అలాంటి నాటకాలు చూసి ఉండరు. ఆ తరువాత రోజూ కాసేపు పురాణకాలక్షేపం కూడా ఉండేది. మొదటిసారి అప్పుడే నేను గరుడ పురాణం ప్రసక్తి విన్నాను. అప్పుడు స్వామీజీ కూడా చెప్పారు. ఇలాంటి పురాణాలూ, ఉపనిషత్తులూ, భగవద్గీత అందరూ వినాలని, చదవాలనీ చెప్పారు.

                                                  ఇక్కడ నాదో చిన్నమాట. చాలామంది కొన్ని పురాణాలు ఎవరైనా చనిపోతే చదవాలని, లేదా ముసలి వయసులో చదవాలనీ అనుకుంటారు. కానీ ఈ గ్రంథాలన్నీ మనకు ఎలా బతుకు నడుపుకోవాలో చెప్తాయి. చచ్చే ముందరో, చచ్చిపోయాకో చదివితే ఏం ప్రయోజనం. కనుక ముందరే చదవండి. అన్నీ చదవచ్చు. అవి మనకు దిశా నిర్దేశం చేస్తాయి. తప్పకుండా బ్రెయిన్ చక్కగా అన్నీ అర్ధం చేసుకోగలిగే స్థితిలో ఉన్నప్పుడే చదివేయండి. వృద్ధాప్యం కోసం ఎదురు చూడకండి. ఈ సంగతి పక్కన పెట్టి స్వాములవారి దగ్గరకి వెళదాం. పది రోజుల పాటు పండగలా జరిగాక, చివరికి స్వాములవారు వెళ్లిపోయే రోజు వచ్చింది. మామూలుగా ఆయన నడిచే బయల్దేరారు. ఊరి బైటకు వెళ్ళాక పల్లకీ ఎక్కుతారట. ఆయన వెళ్లిపోయే టైం వచ్చేసరికి అందరూ కొద్దిగా ఉదాసీనంగా అయిపోయారు. నాన్న లాంటి వాళ్ళు కొద్దీ దూరం స్వాములవారితో నడిచి వెనక్కు వచ్చారు. ఆ తరువాత మరో మూడేళ్లు కంచి స్వాములని తెనాల్లోనే చూస్తూ వచ్చాం. మళ్ళీ 1974 లోనో, 1975 లోనో ఒకసారి కంచి వెళ్లాం అందరం. అప్పుడు చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారు మౌన వ్రతంలో తపస్సు కోసం కంచి పొలిమేరల్లో ఒక కుటీరంలో ఉండేవారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు, ఎప్పుడో కానీ బయటకు రాని పరమాచార్యులు ఆ రోజు బయటకు వచ్చి మాకు దర్శనం ఇచ్చారు. అప్పుడు ఆయన మౌనంగా ఉన్నా, ఆయన ప్రసన్నదృష్టీ, చిరునవ్వుతో వెలిగిన కళ్లూ ఆయన మమ్మల్ని ముఖ్యంగా నాన్నని గుర్తించి, ఆశీర్వదించినట్లు మాకు అర్ధం అయ్యి చాలా ఆనందంగా అనిపించింది.  ఇదీ పరమాచార్యులతో మా కుటుంబానికి ఉన్న అనుబంధం, సంబంధం. ఆ బృహత్తర, మహత్తర కార్యక్రమంలో నేను కూడా ఉడతలా కొద్దిపాటి పాత్ర వహించినందుకు నాకూ ఇప్పటికీ చాలా సంతోషంగా ఉంది.

                                                                ప్రస్తుతానికి దాదాపుగా చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసాను.  40 పోస్టులు పూర్తి అయినాయి. తిరిగి కొద్దిగా టైం తీసుకుని మళ్ళీ నాన్న గురించి చెప్పటం మొదలుపెడతాను. ఈ సారి మనం వచ్చే వారం నుంచీ  నా ప్రయాణోపనిషత్ బ్లాగ్ లో కలుసుకుందాం. నమస్కారం. 
                  







25, జూన్ 2020, గురువారం

ఆరుగొలను ఇల్లు సిద్ధం

ఆరుగొలను ఇల్లు సిద్ధం  

భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                                   
                                                            నాన్న ప్లానింగ్ అంతా పకడ్బందీగా చేసాడు ఎవరికీ, ఏ ఇబ్బందీ రాకుండా. బామ్మ పెద్దదయిపోయింది కనుక, ఓపిక తక్కువ, అందుకని వంట చేసిపెట్టటానికి ఒక వంట మనిషి, బహుశా ఆవిడ పేరు కమలమ్మ అనుకుంటా, పని సాయానికి ఒక పనివాడు, కోటేశ్వరరావు, స్కూల్లో కాంట్రాక్టు పనివాడు. ఈ ఇద్దరూ బామ్మకి సహాయంగా వచ్చే ఏర్పాటు చేశాడు. ఆ పైన అతి ముఖ్యంగా బామ్మకి తోకగా నేను. మా టీంకి బామ్మ కాప్టెన్. నలుగురం కలిసి ఒక మూడు వారాలలో ఇల్లు మొత్తం స్వాములవార్లకి, వారి పీఠానికీ, సిబ్బందికీ ఏ ఇబ్బంది లేకుండా సిద్ధం చేయించటం మా టాస్క్. అప్పటికి బామ్మ ఆరుగొలను ఊరు వెళ్లి చాలా ఏళ్లయ్యింది. దాంతో, ముందు గుడివాడలో దిగి అక్కడ ఉన్న ఇద్దరు కొడుకులనీ, ఇతర బంధువులనీ చూసి అక్కడి నుంచి ఆరుగొలను వెళ్లాలనేది బామ్మ ప్లాన్. సరే, నాన్న మా నలుగురికీ రైల్లో టిక్కెట్లు బుక్ చేసాడు. గుడివాడ రైల్వేస్టేషన్ కు చిన్నన్నయ్య (మా ఉమా పెదనాన్న వాళ్ళ రెండో అబ్బాయి, మురళి) వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. చిన్నన్నయ్య డ్యూటీ ఏమిటంటే, మమ్మల్ని గుడివాడ స్టేషన్ లో దించుకుని, మాతో పాటు గుడివాడలో ఒక రోజు ఉండి, మమ్మల్ని మళ్ళీ ఆరుగొలనులో దింపి మాక్కావాల్సిన ఏర్పాట్లు చేసి వెళ్లాలి. చెప్పా గదా, నాన్న ఏర్పాట్లు చేయటంలో ఘనుడు.

                                                              గుడివాడలో పెద్ద పెదనాన్న, శర్మ పెదనాన్న వాళ్ళని కలిసి, ఆ తరువాత ఆ పక్కనే ఉన్న విశ్వం పెదనాన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి, అందరినీ కలిసి, ఆ సాయంత్రానికి ఆరుగొలను చేరుకున్నాం అందరం. తీరా ఇంట్లో దిగాక చూద్దును కదా, కరంట్ లేని ఇల్లు అది. బామ్మా, చీకటి, మరి కరంట్ లేకపోతే ఎలా, అంటే, ఆవిడ వెంటనే ఇంట్లోకి వెళ్లి లాంతరు తెచ్చి దీపం వెలిగించింది. చెరువులో చేప లాగ, బామ్మ ఆ ఇంట్లో కాలు పెట్టంగానే, ఎంతో ఉత్సాహంగా మారిపోయింది. ఏది ఎక్కడుంటుందో ఆవిడకి అంత గుర్తు. చిన్నపిల్ల లాగా మారిపోయి, చకచకా ఇల్లంతా తిరిగేసి నాకు అన్ని గదులూ, గదుల్లో అన్ని , వస్తువులూ చూపించేసింది. వాటి గురించి బోల్డు వివరాలు చెప్పింది. బామ్మకి తన ఇల్లు చూడంగానే బోల్డంత శక్తి వచ్చేసింది. ఆ పక్కనే పెరట్లో ఉంటున్న లక్ష్మీకాంతారావు గారు వచ్ఛారు. ఈయనకే, మా బామ్మ పది రూపాయల అద్దె కోసం నాతో ఉత్తరాలు రాయించేది. మా బామ్మ ఆయన్ని కాంతాయ్ అని పిలిచేది. ఆయన బామ్మని అత్తయ్యా అని పిలిచేవాడు. ఈ లక్ష్మీకాంతారావుగారి భార్య మా కోసం ఇల్లు కొంచెం శుభ్రం చేయించి పెట్టింది. ఇంతలో మా సత్యనారాయణ తాతయ్య, మా అమ్మా వాళ్ళ నాన్న, కూడా వచ్చేసారు, "చీకట్లో ఏం ఉంటారు, మా ఇంటికి రండి, అక్కడి నుంచే పని చేయిద్దాం" అంటూ. బామ్మ వింటేనా,  "నాయిల్లు నాకు కొత్తా సత్యం, ఇన్నాళ్ల కొచ్చాను, ఇక్కడే ఉంటాను" అనేసింది. పాపం మా తాతయ్య వెళ్ళిపోయాడు. అలా మొదలైంది మా మొదటిరోజు ఆరుగొలనులో. ఎప్పటి మా ఆనందరామయ్య తాతగారూ, ఏనాడనంగా ఆయన సన్యాసం తీసుకున్నారూ, ఆ విషయం చంద్రశేఖరేంద్రసరస్వతికి తెలియగానే వారు ఈ ఇంటికి వస్తానని ఎలా అన్నారూ, అంతా తమాషాగా జరిగింది. మా తాతగారు చాలా గొప్ప మహాత్ములు కాబోలు. మహాత్ముల గురించి మహాత్ములకే తెలుస్తుందేమో. ఆయన గొప్పతనం తెలిసే ఈ ఇంటికి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి వస్తానన్నారేమో. ఇటువంటి భావాలేవీ అర్ధం కాని వయసు నాది అప్పుడు. ఇప్పుడు వెనక్కు వెళ్లి ఆలోచిస్తే ఇదే నిజం అనిపిస్తోంది.


  
సుమారు 1945 నాటి నందివాడ కుటుంబం ఫోటో
                                                     
                                                       రెండో రోజు నుంచీ మా అసలు పని సీరియస్ గా మొదలైపోయింది. పని వాళ్ళొచ్చేసారు. అందరూ బామ్మకి తెలిసిన వాళ్ళే. బామ్మ వాళ్లందరినీ పేరు పేరునా పలకరించింది. మంచీ చెడూ అడిగింది. అమ్మో, వియ్యమ్మగారు మనల్ని మర్చిపోలేదు అనుకున్నారందరూ. అందరూ పని లోకి దిగి ముందు పిచ్చి చెట్లు అన్నీ కొట్టేశారు. గడ్డీ, గాదం పీకేశారు. ఇంటి ముందూ, వెనుకా, పక్కనా వున్న పెరడంతా క్లీన్ చేశారు. చక్కగా దొడ్డంతా బాగు చేసాక స్వాములవారికి వంటశాల కోసం పెరట్లో పొడవుగా పెద్ద పాక వేశారు. దాంట్లో గాడిపొయ్యి తవ్వారు. దాన్ని రాళ్లతో, పేడతో చక్కగా పొయ్యి రూపం తెచ్చేసారు.  ఇంటి వెనక వైపున కూడా పాకలు వేశారు. బావిలో పూడిక తీశారు. గిలక బాగు చేశారు. మొత్తం పెరడంతా పేడ పెట్టి అలికేశారు. ఇంట్లో అన్ని గదులూ ఖాళీ చేసి ఆ సామాన్లన్నీ పడగ్గదిలో పెట్టారు. దాంతో మా బామ్మ పూజా, పచ్చళ్ళూ కూడా మా పడగ్గది లోకి వచ్చేసాయి. ఇల్లంతా మట్టీ, సిమెంటూ మెత్తి, బొక్కలూ, పగుళ్ళూ పూడ్చేశారు. తరువాత ఇంటికి సున్నాలేశారు. ఇల్లంతా శుభ్రం అయ్యాక మమ్మల్ని పక్క గదిలోకి పంపించి పడగ్గది స్వాములవారి కోసం శుభ్రం చేసి సిద్ధం చేశారు. అమ్మయ్య, ఇంటి పని అయిపోయింది. ఇక ఊళ్ళో వాళ్ళ కోసం ఇంటి ముందు రోడ్డు పక్కన ఒక పెద్ద పందిరీ, దాంట్లో ఒక పెద్ద వేదికా కట్టారు. మా ఇంటి వసారా లోనే పీఠం పెట్టి అమ్మవారి పూజలు చెయ్యటానికి వీలుగా గట్లు కట్టారు. ఇంటి ముందరే మరో పందిరీ, వేదికా కట్టారు. ఇదేమో స్వాములవారు కూర్చుని తీర్థప్రసాదాలు ఇవ్వటానికి. పెద్ద పందిరేమో ఊళ్ళో వాళ్లంతా కూర్చుని ప్రవచనాలు వినటానికి. ఇక స్వాములవారు, వారి పీఠం, సిబ్బందీ విడిది చేయటానికి ఇల్లూ, ఊరూ సిద్ధం. అంత గొప్ప స్వాములవారు మా ఊరు వస్తున్నారంటేనే అందరికీ గొప్పగా అనిపించింది. చాలా భక్తిగా, శ్రద్ధగా పనులు స్వచ్ఛందంగా చేశారు. ఈ పనంతా ఇంత బాగా చక్కగా జరగటానికి మూడు వారాలు పట్టింది, అది కూడా అందరూ ముచ్చటగా, ఇష్టంగా తలో చెయ్యీ వేశారు కాబట్టి. అమ్మయ్య, మొత్తం పనైపోయింది ఇక మేం వెళ్లిపోవచ్చు.



మా తాతయ్యా, బామ్మా 

                                                               ఇక ఈ మూడు వారాలూ నా గోడు చెప్తా వినండి. బామ్మకి చాలా ఏళ్ళ తరువాత తన ఇంటికి వచ్చేసరికి మహా బలం వచ్చేసింది. మహోత్సాహంతో వంట పనులూ, ఇంటి పనులూ చేసేసింది. ఆ పనికి మనిషి ఉన్నా సరే. అయిదేళ్ల నాటి ఆవకాయ, నిమ్మకాయ, చింతకాయ అంటూ ఆ పాత జాడీల్లో నుంచి అట్టడుగున ఉన్న ఊరగాయల్ని పట్టుదలగా బైటకు లాగి, నేనెంత బాగా ఊరగాయలు పెట్టేదాన్నో చూడు, అని బలవంతంగా తినిపించింది. పైగా పాత పచ్చళ్ళు పథ్యం అని దబాయించింది. నాకూ, కమలమ్మగారికీ, కోటేశ్వరరావుకీ అదే పచ్చడి. కొత్తగా ఏమైనా తిందాం బామ్మా, అంటే, 'ఠాట్, అంత మంచి పచ్చళ్ళు పారేస్తానా' అని గయ్యిమంది. ఎట్లాగూ అవి చివర్లో పని వాళ్లకి ఇచ్చేసి ఇల్లు క్లీన్ చేయించాం అనుకోండి. పనిలో పనిగా, నేనూ పనివాళ్ళూ కలిసి బామ్మ వంటింట్లో ఎప్పటినుంచో ఉండిపోయిన మిగిలిన సరుకులు కూడా పారేశాం. తెలిసాక బామ్మ గొల్లుమంటూ ఉండేది. అయినా బామ్మ దగ్గర ఆ మాత్రం లిబర్టీ నాకెప్పుడూ ఉండేది లెండి. నేను బామ్మా వాళ్ళ ఇంటికీ , అమ్మమ్మా వాళ్ళ ఇంటికీ మధ్య వారధిగా కూడా ఆ రోజుల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండేదాన్ని. అమ్మమ్మా వాళ్ళింటి నుండి బామ్మ పూజకి రోజూ పొద్దున్నే వెళ్లి పూలు తెచ్చిపెట్టేదాన్ని. దానికి వేరే మరో అవసరం కూడా వచ్చి పడింది. బామ్మ ఇంట్లో లెట్రిన్ ఆ రోజుల్లో లేదు. అమ్మమ్మా వాళ్ళ ఇంట్లో ఉండేది. బామ్మా, వంట మనిషి కమలమ్మగారూ పొద్దున్నే, అలవాటుగా చెరువు గట్టున ఉన్న పొలాల్లోకి వెళ్లి ఆ పని ముగించుకునేవారు. నేనేమో పొద్దున్నే లేవలేను. పైగా బామ్మ ఒకప్పుడు తనకి ఇలా తెల్లవారు ఝామున చెరువు గట్టుకి వెళితే, ఓ పెద్ద తాచుపాము ఎలా వచ్చిందో, అప్పుడు బామ్మ కేకలకి అందరూ వచ్చి దాన్ని ఎలా చంపేసారో అంటూ ఓ కథ చెప్పింది. ఇక అంతే, నేను మళ్ళీ పొలాల దగ్గరకి వెళితే ఒట్టు. అమ్మమ్మా వాళ్ళ ఇంట్లో లెట్రిన్ ఉంది. రోజూ పొద్దున్నే ఓ కిలోమీటర్ నడిచి వెళ్లి, నా పని ముగించుకుని, వస్తూ వస్తూ బామ్మకి మందారాలూ, సన్నజాజులూ పూజకి తెచ్చి ఇచ్చేదాన్ని. నా అదృష్టం కొద్దీ బామ్మ ఇంట్లో ఓ తడికెల గది బాత్ రూమ్ ఉంది. స్నానాలు మాత్రం అక్కడే చేసేదాన్ని.

                                                   ఇక బామ్మ పడగ్గది. దాంట్లో ఇంతెత్తు పందిరి మంచం. బహుశా ఆ రోజుల్లో పందిరి మంచం ఎంత పెద్దదీ, ఎన్ని లతలూ, పువ్వులూ చెక్కారు, ఎంత ఎత్తుగా ఉందీ అన్న దాని మీద ఆ ఇంటి గొప్పతనం లెక్కించేవారేమో నాకు తెలియదు కానీ, అమ్మమ్మా వాళ్ళింట్లో కూడా ఓ పెద్ద పందిరి మంచం ఉంది. దానికీ బోల్డంత కథ ఉండేది. మా అమ్మ చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టటానికి ఆ మంచం కింద దాక్కుంటే, ఎవరికీ కనిపించేది కాదట. ఎటునించీ మా అమ్మమ్మకి చిక్కేది కాదట. అంత పెద్ద మంచం అది. బామ్మా వాళ్ళింట్లో పందిరి మంచమేమో ఇంకా పెద్దదీ, ఎత్తుదీను. దాన్నెక్కడానికో పెద్ద కుర్చీపీటో, నిచ్చెన లాంటిది ఏదో ఉండేది, మంచం లోనే భాగంగా. నేను పొడుగు కదా, ఒక్క గెంతు పెట్టి ఎక్కేసేదాన్ని. పాపం బామ్మ మాత్రం పద్ధతిగా ఆ స్టూల్ ఎక్కే మంచం మీదకు చేరేది. నా కిప్పుడు అర్ధం అవుతోంది, ఆ రోజుల్లో ఆడవాళ్లు మధ్యాన్నం పూట ఓ చిన్న కునుకు తీయటానికి, వంటింటి గడప మీదే తల పెట్టుకుని ఎందుకు పడుకునేవారో. లేకపోతే, ఈ ఎక్కీ, దూకీ, పాకీ, ఈ ప్రొసీజర్ అంతా ప్రతిసారీ ఎవరు పడతారూ అని. మళ్ళీ లేచి దిగి రావాలన్నా అంతే. అంతకన్నా గడప మీద తల పెట్టుకు పడుకోవటం తేలిగ్గదూ. రాత్రిపూట మాత్రం ఈ ప్రొసీజరంతా యథాతథంగా జరగాల్సిందే. ఇప్పుడు ఆ మంచం ఏమైందో. ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్ళే తీసుకున్నారా, తీసుకుంటే వాళ్ళు దాన్ని అలాగే ఉంచారా, ఏం చేశారో. ఈ సారి మాత్రం ఆరుగొలను వెళ్లే అవకాశం వస్తే ఆ విషయం వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే, మా వాళ్ళెవ్వరూ లేరు కదా ఇప్పుడు, ఒక్క శ్రీధర్ బాబాయ్ తప్ప. బాబాయికి కూడా ఆ సంగతి ఎంత గుర్తుందో ఏమో. సుమారు 45 ఏళ్ళ కిందట అమెరికా వెళ్ళిపోయాడు మరి.



                            
                                          సుమారు 1966 నాటి నందివాడ కుటుంబం ఫోటో

                                                            ఇల్లు రెడీ, ఊరు రెడీ, ఊళ్ళో జనం రెడీ. స్వాములవారి రాక కోసం అంతా సన్నద్ధం అయిపోయింది. మేం నలుగురం పెట్టే బేడా సద్దేసి బయల్దేరాం. ఇక్కడో చిన్న పిట్టకథ. బేడా అంటే ఆ రోజుల్లో 12 పైసలు. పెట్టె సరే, ఈ 12 పైసల బేడాతో ఏం చెయ్యగలం, ఎందుకు పెట్టెతో పాటు బేడా కూడా సద్దాలీ, అని ఎవరికైనా సందేహం వస్తుందేమో అని చెప్తున్నా. ఈ బేడా మన 12 పైసల బేడా కాదు. బెడ్డింగ్ అనబడే పరుపు చుట్ట బేడా ఇది. పూర్వం రైళ్లల్లో వెళ్ళేటప్పుడు ఆ చెక్క బెంచీల మీద కూర్చోలేక, పడుకోలేక మెత్తగా ఉంటుందని ఓ పరుపు చుట్టని బెడ్డింగ్ అనే ఓ హోల్డాల్లో సద్ది తీసుకెళ్ళే వాళ్ళం. గుర్తొస్తోందా, ఆ బెడ్డింగే ఈ బేడా. ఇల్లు తాళం వేసేసి, తాళం చెవులు కాంతాయ్ అనబడే లక్ష్మీకాంతారావు గారికి ఇచ్చేసి, అమ్మమ్మా తాతయ్యలకి టాటా చెప్పేసి, తిరిగి దిగ్విజయంగా తెనాలి వచ్చేసాం. అలా మా ఆరుగొలను జైత్రయాత్ర ముగిసింది. మేం చేసిన పనికి మా నాన్న కూడా చాలా సంతోషపడ్డాడు. ఇక ఆయన స్వాములవారికి ఈ విషయం చేరవెయ్యడమే మిగిలింది. మళ్ళీ స్వాములవారితో పాటు ఆరుగొలనులో కలుసుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి.
























18, జూన్ 2020, గురువారం

కంచి పీఠంతో సాంగత్యం

కంచి పీఠంతో సాంగత్యం   

భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                                   తెనాలి తాలూకా హైస్కూల్ తో చక్కని అనుబంధం ఉన్న మరొక అద్వైత పీఠం కంచి కామకోటి పీఠం. ఈ పీఠం కూడా దాదాపు ప్రతి సంవత్సరం వచ్చి స్కూల్లో విడిది చేసి, వచ్చే భక్తులందరికీ ఆశీస్సులు అందిస్తూ ప్రవచనాలు ఇచ్చేవారు. ఈ పీఠానికి అధిపతి ఆ రోజుల్లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి, ఈయన్నే పెద్దస్వామి అని ఆ రోజుల్లో అనేవారు. ఆ తరువాత ఈ స్వామినే పరమాచార్య అని పిలిచేవారు. ఈ పీఠానికి ఆ రోజుల్లోనే మరొక చిన్నస్వామి కూడా ఉండేవారు. వారే శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి. జయేంద్రులు కామకోటి పీఠానికి భావి పీఠాధిపతి. ఆ తరువాత రోజుల్లో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామిని కూడా పరమాచార్యుల తరువాత మూడవ వారసునిగా ప్రకటించారు. సన్యాసదీక్ష తీసుకున్న తొలి రోజుల్లో ఈ విజయేంద్రులను చూడటం జరిగింది. బహుశా అప్పుడు అయన ఏడు, ఎనిమిది సంవత్సరాల చిన్న పిల్లవాడు. ఈ పీఠం మాకు బాగా తెలిసిన సమయానికి పెద్దస్వామికి సుమారు 70 ఏళ్ళు, చిన్న స్వామికి 30 ఏళ్ళు ఉండేవి. తెనాలి స్కూల్ కి రెగ్యులర్ గా ఈ స్వాములిద్దరూ పీఠంతో తరలి వచ్చేవారు. పీఠం మామూలుగా సరస్వతీ విగ్రహం ఉన్న వేదిక మీదే పెట్టేవారు. మా నాన్నగారు ఎందుకో పెద్దస్వామికి ఇష్టులయ్యారు. మా నాన్నగారికి ఆ రోజుల్లో ఇదంతా కొత్త. అయినా ఆ స్కూల్ ఫిలాసఫీకి త్వరగానే అలవాటు పడిపోయారు.


 

                                                            పెద్దస్వామికి నడిచే దేవుడు అని పేరు. ఆయన ఎక్కడికి వెళ్లినా, నడిచి కానీ, లేదా మరీ అలసిపోయినప్పుడు పల్లకీలో కానీ వెళ్లేవారు. ఆయన చేతి తీర్ధం తీసుకోవటం అంటేనే అదో మహా అదృష్టంగా భావించేవారు అందరూ. ఎటువంటి కష్టాలూ, బాధలూ, రోగాలూ ఆ తీర్ధం వల్ల తొలగిపోతాయని నమ్మకం. ఎవరు ఏ పూలూ, రుద్రాక్షలూ, తులసి మాలలూ ఇచ్చినా వాటిని ఆయన తల మీద పెట్టుకునేవారు. ప్రతిరోజూ పూజ, తరువాత తీర్ధ, ప్రసాద వితరణ అయినాక ఒక్కోసారి కొద్దిసేపు ప్రవచనం కూడా ఇచ్చేవారు. ప్రతి సాయంకాలం మాత్రం తప్పనిసరిగా చాలాసేపు పెద్ద స్వామి ప్రవచనం ఇచ్చేవారు. ఒక్కోసారి చిన్నస్వామి కూడా ప్రవచనాలు ఇచ్చేవారు. ఈ ప్రవచనాలన్నీ సాధారణంగా తెలుగులోనే ఉండేవి. వారి మాతృభాష తెలుగు కాకపోయినా భక్తులందరికీ చక్కగా అర్ధం అయ్యేలా ఈ ప్రవచనాలు ఉండేవి. ఆ రోజుల్లోనే స్వామివారి ప్రవచనాల పుస్తకాలు తెలుగులో జగద్గురు బోధలు అని చాలా పుస్తకాలు అమ్మేవారు. అవి ఎన్నో వాల్యూమ్స్ ఉండేవి. ఆ పుస్తకాలు మా ఇంట్లో చాలా ఏళ్ళు ఉండేవి. ఆ రోజుల్లో నాన్న నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు. ఆయనకి తన పనుల్లో రోజూ స్వామివారి ప్రవచనాలు వినే ఛాన్స్ ఉండేది కాదు. నా పనేమిటంటే, రోజూ ఒక నోట్ బుక్ పెట్టుకుని స్వాములవారు చెప్తున్న విషయాల్లో నాకు ఏవి నచ్చాయో, ఏవి ముఖ్యం అనిపిస్తోందో అవి అన్నీ రాసి పెట్టటం. అలా చాలా రోజులు రాసాను. ఆ నోట్స్ నాన్న ఏం చేసాడో నాకు ఇప్పుడు గుర్తులేదు. చిన్నపిల్లని నేను అలా నోట్స్ రాస్తుంటే, చుట్టుపక్కల పెద్దవాళ్ళు కొంతమంది నవ్వితే, కొంతమంది ఆశ్చర్యంగా చూసేవారు. నేను మాత్రం కొంచం లైట్ వచ్చే చోట పెద్ద పోజు పెట్టి మరీ రాసుకుంటూ ఉండేదాన్ని.   

 

                                                             ఆ రోజుల్లో పెద్దస్వామి నాన్ననీ, మరికొంత మంది అకడమీషియన్స్ నీ, కొంతమంది డబ్బు దానం చేసేవాళ్ళనీ ఉత్సాహపరచి, ఒక కొత్త ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెరిపించారు. దాని పేరే వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్. నాన్నే దానికి ఫౌండర్ ప్రెసిడెంట్. మా ఇంటి ఓనర్ వేదాంతం కృష్ణప్రసాద్ గారు ఫౌండర్ కరస్పాండెంట్.  ఇద్దరూ కలిసి చాలా కష్టపడి, పనిచేసి, ఈ  స్కూల్ ప్రారంభించారు. మా తమ్ముడు పేరు వివేకానంద్. వాడినే ఈ కొత్త వివేకానంద స్కూల్లో మొదటి విద్యార్థిగా నమోదు చేశారు. కృష్ణప్రసాద్ గారి అబ్బాయి, శరత్ ని మా తమ్ముడి వయసు వాడే,  రెండవ విద్యార్థిగా నమోదు చేసారు. మా వివేక్ ఆ స్కూల్ మొదటి విద్యార్థిగా నమోదు చేయడానికి కారణం వాడిపేరూ, స్కూల్ పేరూ ఒకటే కావటం. అదో సరదా అంతే. కృష్ణప్రసాద్ గారు, నాన్నకి తమ్ముడల్లే ఉండేవారు. కాకపోతే ఆ స్కూల్ తెరిచాక మేము ఆ ఊళ్ళో కేవలం ఒక్క సంవత్సరమే ఉన్నాం. అక్కడి నుంచి నాన్నకి కొత్త జాబ్ వస్తే, ఒరిస్సా వెళ్లిపోయాం. కృష్ణప్రసాద్ గారే ఆ తరువాత ఆ స్కూల్ బాధ్యత తీసుకున్నారు.    

                                                       కంచి స్వాములవారు సాధారణంగా ఎవరింటికి బిక్షకి వెళ్లేవారు కాదు. భక్తులే స్కూల్ కి వచ్చి పాదపూజలు చేసి, బిక్ష పెట్టేవారు. ఈ స్వామివారిది పెద్ద సిబ్బంది. ఆయన పీఠంతో పాటు ఏనుగులు కూడా వచ్చేవి. మా పిల్లలు సరదాగా రోజూ ఆ ఏనుగులు చూడటానికి వెళ్ళేవాళ్ళం. ప్రతిరోజూ పొద్దున్నే పూజ చూడటం, పెద్ద స్వామివారి చేతిమీదుగా తీర్ధం, ప్రసాదం తీసుకోవటం, అప్పుడు ఇంటికి వెళ్ళటం, సాయంత్రం మళ్ళీ వచ్చి స్వామివారి ప్రవచనం వినటం, ఆ రోజుల్లో, ఇదే నా డైలీ ప్రోగ్రామ్. నిజాయితీగా చెప్పాలంటే, ఆ రోజుల్లో నేను చేసే ఏ పని విలువా నాకు తెలిసేది కాదు. పులుసులో గరిటకి పులుసు రుచి తెలియనట్టు.... ఏదో, ఆమ్మో, నాన్నో చెప్పారు, చేయాలి అంతే, మరో ఆలోచన ఉండేది కాదు. ఆ పనుల విలువ పెద్దయ్యాక తెలిసింది. అప్పుడే అమ్మా, నాన్నా కూడా ఒకసారి స్కూల్లోనే స్వాములవారికి పాదపూజ చేశారు. అలాంటి సందర్భాలలో ఒకసారి, నాన్న స్వాములవారిని మా ఇంటికి ఆహ్వానించారు. అప్పటికే నాన్న పెద్ద స్వాములవారితో మాటల్లో వాళ్ళ నాన్నగారు ఆనందరామయ్య గారు, చనిపోయే ముందు సన్యాసం తీసుకున్నారని, అలా ఈ సన్యాసం తీసుకోవటం అనే ఒక రివాజు మా కుటుంబాల్లో తరతరాలుగా వస్తోందనీ చెప్పారు. స్వాములవారికి ఆ విషయం చాలా విశేషంగా అనిపించిందో ఏమో, వెంటనే, "శర్మా, మీ ఇంటికి తప్పకుండా వస్తాను, వచ్చి ఓ పది రోజులు మీ ఇంట్లోనే పీఠం పెట్టి ఉంటాను. కానీ అది తెనాలిలో కాదు, మీ ఊరు, ఆరుగొలను వస్తాను. మీ ఇంట్లోనే ఉంటాను. ఏ ఇంట్లో మీ నాన్నగారు నివసించారో ఆ ఇంటికి వచ్చి పది రోజులుంటాను" అని చెప్పారు.
                   
                                                         నాన్న ఆశ్చర్య పోయారు. అసలు స్వాములవారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి సాధారణంగా ఎవరింటికి రారు, అలాంటి స్వామి ఒక్కసారిగా పది రోజులుంటానని చెప్పేసరికి నాన్న తెల్లబోయారు, ఆనందపడ్డారు. నిజం చెప్పాలంటే, ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వాళ్ళ నాన్న వల్ల కదా ఇంత గొప్ప  అవకాశం వచ్చిందని పొంగిపోయారు. స్వాములవారు ఒక్కసారి ఇంట్లో కాలు పెడితే చాలు అనుకునే స్థితి నుంచి ఒక్కసారిగా మా ఇంట్లో పీఠం పెట్టి, పది రోజులు ఉంటాననటం ఎంత గొప్ప అవకాశమో  తెలిసి అమ్మా, నాన్నా ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. అసలు ఇలాంటి ఒక అరుదైన వరం స్వాములవారు ఇంతవరకూ ఎవరికైనా, ఇచ్చారో లేదో కూడా తెలియదు. విషయం తెలిసి కొందరు ఆశ్చర్యపోతే, కొందరు అసూయ పడ్డారు. ఇక అప్పటి నుంచీ నాన్నకు హడావుడి మొదలైంది. ఎందుకంటే, ఆరుగొలను వెళ్లి సుమారు పది ఏళ్ళు దాటింది. ఆ ఇల్లు ఏ స్థితిలో ఉందో తెలియదు. ఇంటికి వచ్చి విషయం బామ్మకి చెప్పారు. బామ్మకి కూడా స్వాములవారు ఆరుగొలను వాళ్ళింటికి వస్తాననటం గొప్పగా అనిపించింది. మామూలుగా బామ్మ  ఎప్పుడూ స్వాములవార్ల సంగతుల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించేది కాదు. అటువంటిది నడిచే దేవుడు అని పేరున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి తన ఇంటికి వస్తానని అనటం ఆవిడనీ సంతోషపెట్టింది. అక్కడ ఇల్లు ఎలా ఉందో తెలియదు. పాతకాలం డాబా ఇల్లు. పైగా వదిలేసి ఏళ్ళు అయ్యింది. ప్రస్తుతం ఇదే సమస్య. బామ్మ అప్పుడు ఆఫర్ చేసింది. నేను ముందు వెళ్లి ఇల్లు  బాగు చేయిస్తాను, అని. ఇక నాన్నకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఈ మాత్రం హెల్ప్ ఉంటే చాలు, మా నాన్న మిరకిల్స్ చేయగలడు. అప్పటి నుంచీ ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే ప్లానింగ్ మొదలైంది. ఇవన్నీ తరువాత పోస్టులో చెప్పుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి.  



17, జూన్ 2020, బుధవారం

శృంగేరి పీఠంతో నాన్న అనుబంధం

శృంగేరి పీఠంతో నాన్న అనుబంధం   


భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                       శృంగేరి పీఠం జగద్గురు ఆది శంకరాచార్యచే  స్థాపించబడిన పీఠం. తన శిష్యుడైన సురేశ్వరాచార్యుడిని (మండన మిశ్రుడు) పీఠాధిపతిని చేసి, ఈ పీఠాన్ని దక్షిణామ్నాయ పీఠంగా స్థాపించాడు. ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్న అన్ని అద్వైత పీఠాలూ ఈ శృంగేరి పీఠం కిందే పనిచేస్తాయి. మేము తెనాలిలో ఉండే రోజుల్లో శృంగేరి పీఠాధిపతి, శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి. వారు దాదాపు ప్రతి సంవత్సరం మా స్కూలుకి వచ్చేవారు. ఒక సంవత్సరం చాతుర్మాస్య వ్రతం కూడా చేసారు. స్కూల్ కార్యక్రమాలకి అడ్డంకి రాకుండా ఈ స్వాములవార్ల కార్యక్రమాలు జరిగేవి. మా నాన్నగారు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడే శృంగేరి స్వాములవారు చెప్పారు, ఇది విద్యాలయం కనుక స్కూల్లో సరస్వతీదేవి విగ్రహం ఉంటే బావుంటుందని, తప్పక పెట్టాలని చెప్పారు. దాంతో నాన్న స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ అనుమతితో, జైపూర్ నుంచి సరస్వతీ విగ్రహం చేయించి తెప్పించారు. స్వామీజీనే ఆ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు.  తెల్లటి పాలరాయి మందిరంలో చక్కగా పాలరాయి పీఠంపై కాలుపై కాలువేసుకుని కూర్చుని వీణ వాయిస్తున్న సరస్వతీదేవి మహా కళగా ఉండేది. ఆ ప్రత్యేకతలన్నీ స్వాములవారు చెప్పి చేయించారు. అప్పటికే మా స్కూల్లో శారదాకళాపీఠం పేరుతో ఒక వేదిక ఉంది. ఈ సరస్వతీ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన వేదిక సరస్వతీ కళావేదిక అయిపోయింది. ప్రధానంగా ఈ వేదికనే రోజూ ప్రార్ధనకీ, స్కూల్ ఫంక్షన్స్ కీ వాడేవాళ్లు. ఈ వేదిక, శారదాకళాపీఠం కంటే పెద్దది. ముందున్న గ్రౌండ్ కూడా చాలా పెద్దది. స్వాములవార్లు వచ్చినా కూడా ఈ వేదికనే వాడుకునే వారు. సాధుపరిషత్ సమ్మేళనం జరిగినప్పుడు, రుద్రయాగం చేసినప్పుడు మాత్రం మా ప్లేగ్రౌండ్ లో పెద్ద పెద్ద పందిరులు వేదికలు, హోమగుండాలు ఏర్పాటు చేశారు. 

                                                   స్వాములవారు సరస్వతీ అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ రోజున మా స్కూల్ విద్యార్ధులందరికీ సరస్వతీ అమ్మవారిపై ఒక శ్లోకం నేర్పించి, ఆ శ్లోకాన్ని మా స్కూల్ నిత్య ప్రార్ధనలో తప్పక రోజూ పాడాలని చెప్పారు. ఆ శ్లోకం అప్పటినుంచీ రోజూ ప్రేయర్ లో పాడేవాళ్ళం. ఆ శ్లోకమే, 
శరదిందు వికాస మందహాసామ్  
స్ఫురదిందీవర  లోచనాభిరామామ్ 
అరవిందసమాన సుందరాస్యామ్ 
అరవిందాసన సుందరీముపాసే

స్వాములవారు చెప్పిన ఆ శ్లోకాన్ని ఈ రోజుకీ ఆ స్కూల్లో పాడుతూనే ఉన్నారు. మా నాన్నగారు చేసిన ఆపని ఆ స్కూల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఆయన హెడ్ మాస్టర్ గా ఉన్న రోజుల్లోనే, ఆ స్కూల్ జూనియర్ కాలేజ్ అయింది. మా నాన్నని చూస్తే, మా కందరికి వింతగా ఉండేది, ప్యాంటు వేసుకోవాల్సిన సందర్భంలో ప్యాంటు, షర్ట్ వేసుకుని స్టైల్ గా తిరిగేవాడు. పంచెలు కట్టుకోవాల్సిన సమయం వస్తే, పంచె, లాల్చీ కట్టేసుకుని తేలికగా తిరిగేసేవాడు. అవసరం వస్తే, ఆ చొక్కా కూడా విప్పేసి, స్వాములవార్ల దగ్గర ఎంతో అలవాటుగా హాయిగా చేతులు కట్టుకుని వెనుక నుంచునేవాడు. ఎప్పుడూ భేషజాలు చూపేవాడు కాదు. స్వాములవార్ల ఎదురుకుండా ఏనాడూ చొక్కా వేసుకునే వాడు కాదు.  
                                                      
 

                                                        ఆ రోజుల్లోనే శృంగేరి స్వాములవారిని మా నాన్నపాదపూజ, బిక్ష కోసం మా ఇంటికి ఆహ్వానించారు. స్వాములవారు ఒప్పుకున్నారు. ఆ రోజు మాఇంట్లో ఒక పెద్ద పండుగ లాగా జరిగింది. చాలామంది అతిధులు వచ్చారు. సుమారు వందమందికి పైగా భోజనానికి వచ్చారు. స్వామివారికి, వారి సిబ్బందికి వేరే మడి వంటలు చేయించారు. మిగిలిన అందరికీ దొడ్లో గాడిపొయ్యి తవ్వించి వేరే వంట. మధ్యలో ఎవరో, కాస్త సందడి చేద్దామని అనుకున్నారో ఏమో, బయట షామియానా కూడా వేయించారు. మా నాన్న అనుకోవటం ఆలస్యం, ఆయన అభిమాన సిబ్బంది చకచకా బోల్డు పనులు చేసేవాళ్ళు. హనుమంతరావు గారు, లోకనాథం గారు, జనస్వామి మాస్టారి అన్నదమ్ములు, (ఈ ఇద్దరూ స్కూల్లో టీచర్లే), వాటర్ మాన్ సీతారామయ్య గారు, ఇలా ఎందరో....అందరూ నడుం కడితేనే ఈ పనులన్నీ అయ్యేవి. మేమేమో  చిన్న పిల్లలం. అమ్మా, నాన్నా స్వామివార్ల సేవలో ఉంటే, ఈ పనులన్నీ ఎవరో ఒకరు చూసుకునే వాళ్ళు. యజ్ఞనారాయణ గారి భార్య సరస్వతమ్మ గారు కూడా అమ్మకి ఎన్నో పనులలో చాలా సహాయంగా ఉండేది. ఆరోజుల్లో మా చెల్లమ్మ అత్తయ్య కూతురు లలిత, మా ఇంట్లోనే ఉంటూ VSR కాలేజ్ లో B.Com. చదువుకునేది. ఆరోజు శృంగేరి స్వామి వారి పాదపూజ, బిక్ష అద్భుతంగా జరిగాయి. కొసమెరుపేమిటంటే, మా లలితని మరునాడు వాళ్ళ కాలేజీలో దాని పెళ్లేమైనా నిశ్చయమైందా, ఇంటి ముందు షామియానా వేశారు, అని అడిగారట. లలిత పాపం ఇబ్బంది పడుతూ, సందర్భం స్వాములవారి పాదపూజ కార్యక్రమం అని చెప్పిందిట. 

                                                                శృంగేరి పీఠం వారు శ్రీశైలంలో ఆలయం ఎదురుగా ఒక మఠం తెరిచారు. ఆ ప్రారంభోత్సవానికి నాన్నని, మా తెనాలి వాళ్ళని స్వాములవారు పిలిచారు. తెనాలి నుంచి ఒక బస్ లో సుమారు 40 మంది వెళ్లాం. అప్పుడు మా చిన్న పాపాయి, చిన్న చెల్లెలు, కూడా ఉండేది. ఆ తరువాతే అది డిఫ్తీరియాతో  పోయింది. మాకు శ్రీశైలం పర్యటన అదే మొదటిసారి. అందరం అప్పుడు ఆ మఠం లోనే ఉన్నాం. అంత చిన్నప్పుడు, బహుశా నేను అప్పుడు ఏడో క్లాసనుకుంటా, నాకెక్కువగా శ్రీశైలం ట్రిప్ ఎక్కువగా గుర్తులేదు. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తు, అది అంతా కొండ ప్రాంతం కదా, ఒక ద్వారం నుంచి రోడ్డు మీదకు వెళ్లాలంటే, ఓ పదిహేను, ఇరవై మెట్లు దిగాలి. అదే ఇంకో ద్వారంలో నుంచి బయటకు వస్తే మామూలుగా రోడ్డు మీదకు వచ్చేసేవాళ్ళం. ఇదో వింతలా ఉండేది నాకు. 

                                          ఆ ట్రిప్ లోనే మార్కాపురం, త్రిపురాంతకం కూడా చూసాం. త్రిపురాంతకం శివాలయంలో శివలింగం పైన ఉన్న ఒక చిన్న గుంత నుంచి నిరంతరం గంగాజలం ఊరుతూ ఉంటుంది, ఆ జలాన్నే తీర్థంగా పూజారి అందరికీ ఇచ్చారు. ఎన్ని సార్లు తీసిన మళ్ళీ ఆ జలం నిండుతూనే ఉంటుంది. ఆశ్చర్యంగా, భక్తిగా  చూసాం అందరం. దారిలో మార్కాపురంలో నాన్న బోల్డు పలకలు, బలపాలు కొన్నాడు. అక్కడ అవి ప్రసిద్ధి. ఈ మధ్యకాలంలో నేను, మావారు త్రిపురాంతకం వెళ్లి  ఆ ఆలయాలను దర్శించుకున్నాం. అప్పుడు పూజారి వేరే పాత్రలో నీరు తీర్థంగా ఇచ్చారు. నేను ఆయన్ని అడిగా, ఇదివరకు లింగం పైన ఊరే జలమే తీర్థంగా ఇచ్చేవారు కదా అని. అతను తెల్లబోయి, ఎన్నాళ్ళ కిందట వచ్చారు అని అడిగాడు. సుమారు యాభై ఏళ్ళ కిందట అంటే, ఇంత పాత విషయం మీకు గుర్తు ఉందా అని ఆశ్చర్యపోతూ, చెప్పాడు. ఆ లింగం కాలక్రమేణా భంగం అయిపోతే, కొత్త లింగం చేయించి ప్రతిష్ట చేశారట. ఈ లింగంలో ఆ సౌకర్యం లేదన్నాడు. అలాగే, శ్రీశైలంలోనూ శిఖరేశ్వరం వెళ్ళినప్పుడు, ఆ కొండ మీద నంది కింద నువ్వులు వేసి తిప్పుతూ అది లూబ్రికెంట్ గా పని చేస్తుంటే, నంది కొమ్ముల మధ్య నుంచి  శ్రీశైల ఆలయ శిఖరం చూసాం. అలా ఆ ఆలయ శిఖరాన్ని చూస్తే, ఇక పునర్జన్మ ఉండదని ఒక నమ్మకం. ఈ మధ్య వెళ్ళినప్పుడు అక్కడా అంతే, ఆ నంది మూర్తి పాడైపోతే, ఈ సారి మరో నంది విగ్రహాన్ని తెచ్చి చక్కగా ఆ శిఖరం కనపడే డైరెక్షన్ లోనే ఫిక్స్ చేసేసారు.  ఇది కూడా బాధ వేసింది. ఆ పాత నంది మూర్తి ఏదీ అంటే, కింద శిథిలాల్లో చూపించాడు. బాధ ఇంకా ఎక్కువైంది, కనీసం ఏ మ్యూజియం లోనైనా పెట్టొచ్చుగా అనిపించింది. త్రిపురాంతకంలోనూ బహుశా, ఇలానే అయి ఉంటుంది. ఆ లింగం మీద తీర్ధం కోసం ఉద్ధరిణతో గీకీ గీకీ దాన్ని పాడు చేసి ఉంటారు. 

                                                     నేనూ, మా వారూ ఈ  మధ్య కాలంలో మా యాత్రల్లో భాగంగా శృంగేరి వెళ్లాం. అప్పుడు పీఠాధిపతి శ్రీ భారతీ తీర్ధస్వామి. శారదామాతను, శివుడిని, ఆది శంకరుని, దర్శించుకుని కాసేపు అక్కడ కూర్చున్నాం. అడిగితే స్వాములవారు అప్పుడు పీఠంలోనే ఉన్నారని చెప్పారు. అదృష్టం కొద్దీ వారి దర్శనం కూడా అయ్యింది. నమస్కరిస్తే, ఆశీర్వదించి ప్రసాదం ఇప్పించారు. కిందికి వచ్చి వాళ్ళ ఆఫీసుకి వెళ్లి అమ్మవారి చీర కావాలని అక్కడి వాళ్ళను చాలాసేపు పీడించి, ఒక చీర, రవికలబట్ట, కుంకుమ తీసుకున్నాను. ఆలయాలకు వెళితే అమ్మవారి చీర కొనుక్కోవటం నాకు ఒక అలవాటు. వీళ్ళేమో అవి అమ్మరుట. అందుకే ఊరికే అయినా ఇమ్మని అడిగి తీసుకున్నా. లేకపోతే, ఎంతసేపటికీ VIP ల కేనా, శేషవస్త్రం , మాలాంటి వాళ్లకు వద్దా? అదీ సంగతి. 

                                               ఇదీ శృంగేరితో, శృంగేరి  పీఠాధిపతితో  మా అనుబంధం. మా నాన్న వారి శిష్యులవటం వాళ్ళతో ఈ అనుబంధం ఏర్పడింది. లేకపోతే వీలవుతుందా. ఇక్కడితో శృంగేరి స్వామీజీ తో మా సాంగత్యం గురించి చెప్పటం ముగించుకుని, ఈ సారి కంచి పీఠాధిపతులను గురించి చెప్పకుందాం. స్వస్తి.