26, జూన్ 2020, శుక్రవారం

పరమాచార్యుల ప్రసన్నదృష్టి

పరమాచార్యుల ప్రసన్నదృష్టి 

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                      స్వాములవార్లు వచ్చేరోజుకి ఒక రోజు ముందరే అందరం ఆరుగొలను చేరుకున్నాం. ఇటు నందివాడ కుటుంబం నుంచీ, అటు నండూరి కుటుంబం నుంచీ దాదాపు అందరూ వచ్చారు. స్వాములవారికి  పూర్ణకుంభంతో  స్వాగతం చెప్పారు అమ్మా, నాన్నా. స్వాములవారితో పాటు పెద్ద సంఖ్యలో సిబ్బంది కూడా వచ్చారు.  బళ్ళూ, ఎడ్లూ, వాటిని నడిపే వాళ్ళూ, పల్లకీ, దాన్ని మోసే బోయీలూ, ఒక ఏనుగూ, దాని మావటీ వచ్చారు. వీళ్ళే కాక, వేదపండితులూ, పూజారులూ, సేవకులూ, వంట బ్రాహ్మణులూ, వీళ్లంతా కూడా వచ్చారు. ఇంతమందికీ నాన్నా వాళ్ళ ఇల్లే విడిది. దాన్నే మేము ఓ నెల క్రితం బాగు చేయించింది. సుమారు ఓ 50, 60 మంది అక్కడ దిగారు. స్వామివారు వస్తూనే పీఠం పెట్టారు. స్వాములవారికి ఊరు ఊరంతా బ్రహ్మరథం పట్టింది. పది రోజులు ఉన్నారు ఆరుగొలనులో పీఠంతో సహా స్వామీజీ. ఆ పది రోజులు ఊరంతా జాతరే జాతర. రోజూ పూజలూ, తీర్థాలూ, ప్రసాదాలూ, ప్రవచనాలూ కోలాహలంగా సాగింది. మొదటి పాడుపడిన ఇంటికి, ఇప్పుడు సందడిగా ఉన్న ఇంటికి పోలికే లేదు. పరమాచార్యుల పాదం పడి ఆ ఇంటికి చక్కటి కళ వచ్చింది. 

   

శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామి

                                                   చిన్నస్వామి జయేంద్ర సరస్వతి స్వామివారు కూడా వచ్చారు. మా తాతయ్య సత్యనారాయణ గారు వెళ్లి స్వామివారిని తన ఇంటికి కూడా ఒకసారి రమ్మని పిలిచారు. కానీ స్వామివారు తాను రాలేననీ, చిన్న స్వామిని పంపిస్తానని, జయేంద్ర సరస్వతిని పంపించారు. అప్పుడు అందరూ ఆయనకి పాదాభివందనం చేసాం. ఇక్కడ జయేంద్ర సరస్వతిని గురించి కొంచెం చెప్పుకుందాం. ఈ స్వామికి వివేకానందుని వలె దేశం గురించీ, ధర్మం గురించీ, మతం గురించీ ఎన్నో ప్రశ్నలూ, మరెన్నో ఆలోచనలూ ఉండేవనుకుంటా. చివరికి శంకర విజయేంద్ర సరస్వతిని బాలస్వామిగా ప్రకటించాక 1987 లో ఎవరికీ చెప్పకుండా, చివరికి పరమాచార్యుల వారికి కూడా తెలియకుండా నిశ్శబ్దంగా, ఒక రకంగా సన్న్యాసాన్ని కూడా సన్యసించి తలకావేరి, కావేరీనదీ జన్మస్థానం, చేరుకొని అంతర్ముఖులై తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు. ఈ లోపల పరమాచార్య చెప్పగా మఠం నుంచి పండితులు వచ్చి జయేంద్రులని ఒప్పించి కంచికి తీసుకువచ్చారు. ఇద్దరు ఆచార్యులూ కూర్చుని చర్చలు జరిపారు. గురువుల మాటని గౌరవించి తిరిగి పీఠం బాధ్యతలు స్వీకరించారు జయేంద్రులు. మరోసారి 1991 లో జయేంద్రులని తిరుమలలో కలిసాను. నేను M.Ed. క్లాసుల కోసం తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమల కూడా వెళ్లాను. అలా తిరుమల వెళ్ళినప్పుడు కంచి స్వామి అక్కడే ఉన్నారని తెలిసి వెళ్లి దర్శనం చేసుకున్నా. అప్పుడు వారికి ఆరుగొలను గురించి గుర్తు చేసాను. నవ్వి  అక్కడ  ఉన్న అందరికీ ఆయన  "మేము వీళ్ళ ఊరికి వెళ్లాం" అని చెప్పారు.


     

      జయేంద్ర సరస్వతీ స్వామి                    శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి 
                                                     
                                             సాయంత్రం పూట స్వామివార్ల కోసం హరికథలూ, పురాణ కాలక్షేపాలూ, పౌరాణిక, చారిత్రిక నాటకాల ప్రదర్శనలూ నిత్యం జరిగేవి. ఊర్లో అందరూ తమ కష్టసుఖాలు చెప్పుకునేవారు. స్వామివారు వారికి ఏ జపమో, పూజో చెప్పేవారు. ఊర్లో అందరూ నాన్నని ఆరాధనగా, గర్వంగా చూసేవారు. మేము సుమారు 50, 60 మంది అమ్మమ్మా వాళ్ళింట్లో ఉండేవాళ్ళం. భోజనాలన్నీ స్వాములవారి తోనే. నడిచే దేవుడు చంద్ర శేఖరేంద్ర సరస్వతి మా ఊరంతా నడిచే తిరిగారు. ఆరుగొలనులో చెరువుని చూసి, "ఈ చెరువులో ఎవరూ స్నానం చేయకండి. మంచిది కాదు. ఏ చెరువులోనైనా స్నానం చేయాలంటే ఆ చెరువు మధ్యలో ఒక మంటపం కానీ స్తంభం కానీ ఉండాలి. లేకపోతే ప్రమాదం" అని చెప్పారు. తానూ ఆ చెరువులో స్నానం చెయ్యలేదు. మా ఇంటి బావి నీటి తోనే స్నానం చేసేవారు. ప్రతిరోజూ ప్రవచనాలు చెప్పేవారు.  ఊరు ఊరంతా చాలా క్రమశిక్షణతో స్వామివారు ఏమి చెప్పినా వినేవారు. అందరికీ ప్రతి నిత్యం ఏమేమి శ్లోకాలు చదువుకోవాలో చెప్పారు.

                                                               తెనాలి తాలూకా హైస్కూల్ నుంచి మహామహులంతా వచ్చారు. తెనాలి గురించి, అక్కడ మా స్కూల్లో పనిచేసే టీచర్ల ఎక్స్ట్రా ఆర్డినరీ టాలెంట్ గురించి ముందు పోస్టులలో చెప్పా గదా. ఆ రోజుల్లో ఆ స్కూల్లో ములుకుట్ల సదాశివ శాస్త్రిగారు  తెలుగు పండితుడుగా పనిచేసేవారు. వారి దగ్గర కొన్ని నెలలు నేనూ, మా చెల్లెలు భారతీ సంగీతం, వీణా నేర్చుకున్నాం కూడా. ములుకుట్ల వారు ఆరుగొలను వచ్చి హరికథలు చెప్పారు. స్వామివారు చాలా సంతోషించి ఆయన్ను బ్లెస్ చేశారు. ఆ హరికథలు విని ఊళ్లోవాళ్ళు ఎంత ఆనందపడ్డారో.  తరువాత నాటకాలు వేసే వాళ్ళ వంతు వచ్చింది. మొత్తం టీమ్ కిరీటాలు, గదలూ, కత్తులూ, వగైరా అన్నింటితో సహా దిగేసారు. రెండు రాత్రులు తెల్లవార్లూ పాండవ ఉద్యోగ విజయాలు, కురుక్షేత్రం నాటకాలు వేశారు. తమాషాగా ఈ నాటకాలు తెల్లవార్లూ సాగుతాయి.  అందుకని మొదటినుంచి చివరిదాకా నడిచే ముఖ్యమైన కారెక్టర్ కృష్ణుడు లాంటి పాత్రలు వేసేవాళ్ళు ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు.  వాళ్ళని ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అనేవాళ్ళు.  ఆరుగొలను వాళ్ళైతే ఈ నాటకాలు చూసి పిచ్చెక్కి పోయారు. వాళ్ళు ఇంతవరకూ అలాంటి నాటకాలు చూసి ఉండరు. ఆ తరువాత రోజూ కాసేపు పురాణకాలక్షేపం కూడా ఉండేది. మొదటిసారి అప్పుడే నేను గరుడ పురాణం ప్రసక్తి విన్నాను. అప్పుడు స్వామీజీ కూడా చెప్పారు. ఇలాంటి పురాణాలూ, ఉపనిషత్తులూ, భగవద్గీత అందరూ వినాలని, చదవాలనీ చెప్పారు.

                                                  ఇక్కడ నాదో చిన్నమాట. చాలామంది కొన్ని పురాణాలు ఎవరైనా చనిపోతే చదవాలని, లేదా ముసలి వయసులో చదవాలనీ అనుకుంటారు. కానీ ఈ గ్రంథాలన్నీ మనకు ఎలా బతుకు నడుపుకోవాలో చెప్తాయి. చచ్చే ముందరో, చచ్చిపోయాకో చదివితే ఏం ప్రయోజనం. కనుక ముందరే చదవండి. అన్నీ చదవచ్చు. అవి మనకు దిశా నిర్దేశం చేస్తాయి. తప్పకుండా బ్రెయిన్ చక్కగా అన్నీ అర్ధం చేసుకోగలిగే స్థితిలో ఉన్నప్పుడే చదివేయండి. వృద్ధాప్యం కోసం ఎదురు చూడకండి. ఈ సంగతి పక్కన పెట్టి స్వాములవారి దగ్గరకి వెళదాం. పది రోజుల పాటు పండగలా జరిగాక, చివరికి స్వాములవారు వెళ్లిపోయే రోజు వచ్చింది. మామూలుగా ఆయన నడిచే బయల్దేరారు. ఊరి బైటకు వెళ్ళాక పల్లకీ ఎక్కుతారట. ఆయన వెళ్లిపోయే టైం వచ్చేసరికి అందరూ కొద్దిగా ఉదాసీనంగా అయిపోయారు. నాన్న లాంటి వాళ్ళు కొద్దీ దూరం స్వాములవారితో నడిచి వెనక్కు వచ్చారు. ఆ తరువాత మరో మూడేళ్లు కంచి స్వాములని తెనాల్లోనే చూస్తూ వచ్చాం. మళ్ళీ 1974 లోనో, 1975 లోనో ఒకసారి కంచి వెళ్లాం అందరం. అప్పుడు చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారు మౌన వ్రతంలో తపస్సు కోసం కంచి పొలిమేరల్లో ఒక కుటీరంలో ఉండేవారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు, ఎప్పుడో కానీ బయటకు రాని పరమాచార్యులు ఆ రోజు బయటకు వచ్చి మాకు దర్శనం ఇచ్చారు. అప్పుడు ఆయన మౌనంగా ఉన్నా, ఆయన ప్రసన్నదృష్టీ, చిరునవ్వుతో వెలిగిన కళ్లూ ఆయన మమ్మల్ని ముఖ్యంగా నాన్నని గుర్తించి, ఆశీర్వదించినట్లు మాకు అర్ధం అయ్యి చాలా ఆనందంగా అనిపించింది.  ఇదీ పరమాచార్యులతో మా కుటుంబానికి ఉన్న అనుబంధం, సంబంధం. ఆ బృహత్తర, మహత్తర కార్యక్రమంలో నేను కూడా ఉడతలా కొద్దిపాటి పాత్ర వహించినందుకు నాకూ ఇప్పటికీ చాలా సంతోషంగా ఉంది.

                                                                ప్రస్తుతానికి దాదాపుగా చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసాను.  40 పోస్టులు పూర్తి అయినాయి. తిరిగి కొద్దిగా టైం తీసుకుని మళ్ళీ నాన్న గురించి చెప్పటం మొదలుపెడతాను. ఈ సారి మనం వచ్చే వారం నుంచీ  నా ప్రయాణోపనిషత్ బ్లాగ్ లో కలుసుకుందాం. నమస్కారం. 
                  







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి