18, జులై 2015, శనివారం

మా అమ్మ

మా అమ్మ 


భట్టిప్రోలు విజయలక్ష్మి


                          చాలా రోజుల తర్వాత ఏదో రాద్దామని కూర్చున్నాఇది రాయటానికి అమ్మ తరఫున నండూరి వారి విశేషాలు రాయాల్సిన అవసరం పడటం కూడా ఒక కారణంహరి అడిగినందువల్లాపార్థుమామయ్యతో మాట్లాడినతర్వాతాఎన్నాళ్ళనుంచో నావెంటపడుతున్న మా కాత్యాయనీ మేడమ్ వల్లా, సావిత్రీ ఆంటీ పుస్తకం చూసాకా, శ్రీదేవి పిన్ని పుస్తకం చదివాకా, నాకే ఇక రాయక తప్పదూ అనిపించీ, మొదలు పెడుతున్న నా జ్ఞాపకాల దొంతర.  

                                                       ముందుగా మా అమ్మ గురించి, ఎందుకంటే ఈ బ్లాగ్, ఈ రాత కి కారణం అమ్మ కాబట్టి. అమ్మ, నందివాడ లీలా కుమారి, పెళ్లి కాక ముందు నండూరి లీలా కుమారి. కానీ ఆవిడకి మాత్రం లీల అంటేనే ఇష్టం. 'ఈ కుమారి ఏంటీ, అసయ్యంగా, లీల అంటేనే బావుంది', అనేది. చక్కగా పాడేది. కానీ పాడటం చాలా చాలా తక్కువ.  ఎంతో అడిగించుకుని ఒక్క పాట పాడేది. అసలు అమ్మా వాళ్ళందరికీ, అంటే వాళ్ళ అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళకు భానుమతి, రావు బాలసరస్వతి, సాలూరి, దేవులపల్లి, రజనీకాంత రావు అంటే చాలా అభిమానం. చక్కగా, భావుకతతో, శ్రావ్యంగా, మృదువుగా, మధురంగా 'ఆ తోటలో నొకటి ఆరాధనాలయము, ఆలయములోన అందగాడెవడే' అంటూ ఆ పాట చాలా బాగా పాడేది. నాన్నక్కూడా అమ్మ పాటంటే ఇష్టం. కానీ ఎందుకో ఎప్పుడూ పాడేది కాదు.

                                          తాను నాలుగు, అయిదు క్లాసులకే చదువు మానేసినా మమ్మల్ని మాత్రం చదువుకోమని మహా పోరేది. 'చదువుకోండే, చదువుకుని వుద్యోగం చెయ్యండి, అప్పుడే గౌరవం, మర్యాదా' అనేది. ఆవిడ ప్రోద్బలం వల్లేనేమో మా అందరికీ కాస్త చదువులబ్బాయి. చదువు గురించి చెప్తూ, తను చిన్నప్పుడు చదువుకోక, బడికి వెళ్ళటం ఎలా తప్పించుకు తిరిగేదో, ఎలా మా అమ్మమ్మకి దొరక్కుండా దాక్కునేదో అనీ చెప్పేది. వాళ్ళ తాతయ్య పందిరి మంచం కింద దాక్కునేదట. అమ్మమ్మ పట్టుకోటానికి వచ్చి మామగారినేమీ అనలేక గొణుక్కుంటూ వెళ్ళిపోయేదట. వాళ్ళ పది మందిలో చదువు అంటే పారిపోయేది అమ్మా, వాళ్ళ మల్లన్నయ్యేనట.

                                              ఇంకా వాళ్ళ తాతయ్య గురించి బోల్డు కబుర్లు చెప్పేది. ఆయన చాలా ఊళ్ళకి కరణంట. ఊళ్ళకి పని మీద వెళ్ళాలంటే చక్కని జరీ పంచెలు, లాల్చీ, వుత్తరీయం వేసుకుని గుఱ్ఱం మీద స్వారీ చేసుకుంటూ వెళ్ళేవాట్ట. ఆయనకీ హాల్లో పే.....ద్ద  పందిరి మంచం, దానికి నాలుగు వైపులా పందిరి కర్రలు పెట్టుకోటానికి యిత్తడివి ధగ ధగ మెరిసే హోల్డర్స్ వుండేవిట. కర్రలు లేనప్పుడు వాళ్ళ తాతయ్య వాటిల్లో తనకు కావాల్సిన వక్కలు, బీడీలు వగైరా పెట్టుకునేవాట్ట. అమ్మ ఆ మంచం కిందే దాక్కుని బడి ఎగ్గొట్టేదన్నమాట . అమ్మమ్మ అమ్మని మంచం కిందే వదిలేసి తిట్టుకుంటూ వెళ్ళిపోయేదిట. అంటే మా అమ్మ 'ఆడ బుడుగు' అన్నమాట.  

7 కామెంట్‌లు:

  1. Chala baga rasthunavu.Mi amma gurinchi maku teliyanivi enno rasavu.Nanduri vari kutumbam meeda niku unna abimananiki chala santhosham + kruthajnathalu.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. పెద్దక్కా,
    శ్రీదేవి పిన్నిలాగానే నువ్వు కూడా కళ్ళకి కట్టినట్టుగా వ్రాస్తున్నావు. నీ జ్ఞ్యాపకశక్తిని మెచ్చుకోవాలో, ఓపికని మెచ్చుకోవాలో, వ్రాతశైలిని మెచ్చుకోవాలో తెలియయడంలేదు. అమ్మా నాన్నలమీద, మన అందరి బంధువులమీద నీకున్న ఆపేక్ష, అభిమానం అన్నీ నీ వ్రాతలలో తెలుస్తున్నాయి. చదువుతూ పోతుంటే ఒకపక్క చాలా సంతోషంగా ఉంటే, ఒకపక్క గొంతు తడారిపోయి కళ్ళంబట నీళ్ళూ వస్తున్నాయి, వాళ్ళందరూ ఇకలేరూ, ఆరోజులు మళ్ళీ రావని. అమ్మా నాన్న బ్రతికుండగా వాళ్లకి పెద్దకూతురిగాకన్నాపెద్దకొడుకై ధైర్యంగా అండగా ఉన్నావు. వాళ్ళు ఈలోకం వదిలి వెళ్ళిపోయాక నాన్న తరవాత నాన్నవైయ్యీ, అమ్మ తరవాత అమ్మవైయ్యీ మాకందరికీ ఆధారంగానూ నిలిచావు. ఇప్పుడు ఈ నీ స్మృతుల ద్వారా వాళ్ళ మంచిదనాన్నీ, గోప్పదనాన్నీ, వాళ్ళపట్ల నీఆపేక్షనీ వ్యక్తపరుస్తూ మిగిలిపోయిన రుణాలన్నీతీర్చేసుకుంటున్నావు!
    సీతారాం ఆమ్మ తన ఎనభైయ్యోఏటి పుట్టినరోజునాడు అమెరికాలో మా అందరికీ కొన్ని సూత్రాలని చెప్పింది. ఆ సూత్రాలలో ఒకటి ఏమిటంటే, ప్రతిమనిషిలో గుణాలూ అవగుణాలూ, మంచీ చెడూ వేరే వేరే మోతాదుల్లో ఉంటాయి; అవి లేనిదే మనిషి మనిషెలా అవుతాడు? ఆ మంచీ చెడూ కూడా అందరిపట్లా, అన్నివేళల్లో ఒకేలా ఉండవు. మనం మాత్రం అన్నివేళల్లా వాళ్ళల్లో ఉన్న మంచినేచూడాలి, ఆమంచినే పాటించాలి. సీతారాం ఆమ్మ పుట్టినరోజు నాడు నువ్వు ఇక్కడలేనప్పటికీ, ఆ సూత్రాన్ని మాత్రం అక్షరాలా పాటిస్తున్నావు నీ రచనల్లో. ఈవిషయం నాకు బాగా నచ్చింది.
    ఆఖరుగా ఒక్క సలహా - ఏమైనా మరిచిపోయిన సంఘటలు కొత్తగా గుర్తొస్తే వెనక్కెళ్ళి ఇదివరకే రాసేసిన భాగాలకి మార్పులూ చేర్పులూ చెయ్యడానికి సందేహించకు. నువ్వు అవి కలపకపోతే అటు కధ అసంపూర్తిగా ఉండిపోతుందీ, ఇటు నీకూ అసంతృప్తిగా ఉంటుంది. అచ్చ్చయ్యే పుస్తకానికి లేని అనుకూలం నీకుంది. వాడుకో.
    సంగీతం పాడేవాడికన్నా వినేవాడిదే ఎక్కువ అదృష్టం అంటారు. అల్లాగే, రాస్తుంటే నీకెంత త్రుప్తి కలుగుతోందో దానికన్నా చదివేవాళ్ళకి మాకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. అది మనసులో పెట్టుకుని ఇలాగే రాస్తూ ఉండు.
    ప్రేమతో,
    బాబు.

    రిప్లయితొలగించండి
  6. అందరికీ కృతజ్ఞతలు రూట్స్ లో లాగా ఏడు తరాలు రాయలేక పోయినా కనీసం నాకు తెలిసినంతవరకూ మూడు తరాల చరిత్ర రాయాలని నా ప్రయత్నం. ఎంతవరకూ కృతార్దురాలనవుతానో తెలియదు. జరిగేది జరుగుతున్నట్టు జరగనివ్వటమే.

    రిప్లయితొలగించండి