18, ఏప్రిల్ 2020, శనివారం

లలితా రహస్య సహస్ర నామాల్లో చిన్న సవరణ

లలితా రహస్య సహస్ర నామాల్లో చిన్న సవరణ 
లలితా పరమేశ్వరీ దేవ్యై నమః  

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                          లలితా పరమేశ్వరీ దేవ్యై నమః. హిమాలయాల్లో మన్మధుడు పరమశివుని తపస్సుని భగ్నం చేసినప్పుడు, శివుడు మూడో కన్ను తెరచి మన్మధుణ్ణి భస్మం చేసాడు. తిరిగి రతీదేవి, పార్వతీ దేవి ప్రార్ధించగా మన్మధుడికి పునర్జన్మ ప్రసాదించాడు మహా దేవుడు. దాంతో మన్మధుడు తిరిగి జన్మించబోయే ప్రాంతానికి చేరుకుంది రతీదేవి. పార్వతిని హిమవంతుడు తీసుకు వెళ్ళిపోయాడు. తపోభంగమైన చోట ఉండకూడదని శివుడు తన ప్రమథ గణాలతో అక్కడి నుంచి  తరలిపోయాడు. ఇక మిగిలింది మన్మధుడి బూడిద. ఆకాశమార్గంలో వెళ్లే చిత్రకర్ముడనే రాక్షసుడొచ్చి ఏమైందో గ్రహించి తన శక్తితో ఆ బూడిద నుంచి ఒక బొమ్మను తయారుచేసి, ప్రాణం పోశాడు. వాడు లేచి, నన్నెందుకు పుట్టించావ్, ఏమి చేయాలీ అని అడిగాడు. ఇద్దరూ కలిసి శతరుద్రీయం పారాయణ చేశారు. అప్పుడు అతని కోరికపై శతరుద్రీయంతో ప్రసన్నుడైన రుద్రుడు వరాలు ఇచ్చాడు. అరవై వేల సంవత్సరాలు దిగ్విజయంగా ఈ ముల్లోకాలూ పాలించేట్టు, ఈ బ్రహ్మాండంలో ఏ ఒక్కడి చేతా మరణం రాకుండా వరాలు పొందాడు. ఇదంతా బ్రహ్మ చూసి మెచ్చి "భండ, భండ" అని అన్నాడు. దానితో వాడి పేరు భండాసురుడు అయ్యింది. 

                                                    భండాసురుడు పోతూ పోతూ మిగిలిన మన్మధ భస్మం నుంచి ఇద్దరు సోదరులని తయారు చేసుకున్నాడు. వారే, విశుక్రుడు, విషంగుడు. ముగ్గురూ కలిసి దక్షిణదేశం వైపుకు వెళ్లారు. అక్కడ మహేంద్ర పర్వతం దగ్గర వాళ్ళ రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. దానికి శూన్యకనగరం అని పేరు పెట్టాడు. భండాసురుడు సోదరులిద్దరినీ మంత్రి, సేనాపతి చేసుకుని పాలన మొదలుపెట్టాడు. ఈ వరగర్వం వల్ల ఇంద్రాది దేవతలతో సహా అందరినీ వశపరచుకున్నాడు. అందరూ భండాసురుడి సేవకులైపోయారు. భండాసురుడు కామప్రళయం సృష్టించాడు. దాని వలన స్త్రీలకూ స్త్రీత్వము, పురుషులకు పుంస్త్వము పోయాయి. దీని వల్ల ఒక్క రాక్షసులకు తప్ప ఇతర జాతుల్లో  సంతతి పెరగలేదు. ఈ విధంగా అరవైవేల సంవత్సరాలు దాదాపు గడిచిపోయాయి. ఇప్పుడు ఇంద్రాది దేవతల్లో ఆందోళన ప్రారంభమయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఈ భండాసురుడు కనుక తపస్సు చేసి మళ్ళీ వరాలు పొందితే, ఎలా అని భయపడ్డారు. అప్పుడు అందరూ కలిసి త్రిమూర్తుల వద్దకు వెళ్లారు. వాళ్ళూ ఈ బ్రహ్మాండానికి సంబంధించిన వారే కనుక నిస్సహాయత వ్యక్తం చేస్తూ, ఒక ఉపాయం ఆలోచించారు. 
                                                                       
                                                                              ఈ బ్రహ్మాండం బయట నుంచి మాత్రమే ఎవరైనా వచ్చి ఈ భండాసురుని వధించాలి అనుకున్నారు, అందునా రుద్రుడిచ్చిన వరంలో ఎవడి చేతా భండాసురుడు  మరణించడు అని వున్నది కనుక,  స్త్రీ మాత్రమే వాడిని చంపగలదు అని నిర్ధారించుకున్నారు. కనుక ఈ బ్రహ్మాండం బయట వున్న స్త్రీ మాత్రమే భండాసురుడిని వధించగలదు అని అందరికీ అర్ధం అయ్యింది. అప్పుడు త్రిమూర్తులు, "లలితాదేవి మాత్రమే ఈ పని చేయగలదు" అని చెప్పారు.  అప్పుడు అందరూ ముందు ఈ బ్రహ్మాండం నుంచి బయట ఎలా పడాలీ అని ఆలోచించడం మొదలైంది. ఈ బ్రహ్మాండం చుట్టూ వేల మైళ్ళ మందపాటి గోడ వుంది. దానినుంచి బైట పడాలి. ఆ గోడలో ఎక్కడైనా పగులు ఉందేమో అని వెతకడం మొదలు పెట్టారు. ఒకచోట బ్రహ్మాండం పైకప్పులో  రావి చెట్టు (అశ్వత్థవృక్షం) కనపడింది. ఆ చెట్టు పైనుంచి వేళ్ళాడుతోంది. కొమ్మలు కిందకు, వేళ్ళు బయటకు వున్న ఆ రావి చెట్టు కనపడింది. ఆ చెట్టు వేళ్ళ దగ్గర కొద్దిగా పగుళ్లు కనిపించాయి. అష్టదిగ్గజాలతో ఆ ప్రాంతంలో వాటి కుంభస్థలాలతో మోదించి ఆ పగులుని కొంచం పెద్దది చేసి అందరూ బయటకు వచ్చారు. అందరూ బయలుదేరి ఆ పాలపుంతలో లలితాదేవిని వెతుక్కుంటూ  బయల్దేరారు. దారిలో ఎన్నో బ్రహ్మాండాలు కనిపించాయి. చివరకు మణిద్వీపం వద్దకు చేరుకున్నారు. అక్కడ వారిని పరశంభువు, అతని భార్య పరాదేవి ఆపారు. లలితాదేవి దర్శనం కావాలంటే, ఎంతో జపం చేయాలన్నారు. పరశంభువు అందరికీ లలితా మంత్రం ఇచ్చాడు. పరాదేవి అందరికీ జపమాల లిచ్చింది. అందరూ జపసంఖ్య పూర్తి చేసాక తనను తలచుకుంటే వచ్చి హోమం చేయిస్తానని చెప్పాడు. అందరూ తిరిగి మన బ్రహ్మాండానికి వచ్చి జపం మొదలుపెట్టారు. 

                                                               జపం పూర్తయ్యింది. పరశంభువు వచ్చాడు. ఈ బ్రహ్మాండం  లోని వస్తువులేవీ హోమానికి పనికిరావన్నాడు పరశంభువు. బ్రహ్మాండం  బయట నుంచి సప్త మారుతాలను అవగాహన చేసాడు. తన మూడో కన్ను నుంచి అగ్ని సృష్టించాడు. ఆ అగ్ని సాయంతో ఆ వాయువులు మండసాగాయి. అదే చిదగ్ని. ఆహుతులుగా తమ శరీర ఖండాలనే వెయ్యమన్నాడు. అందరూ తమ శరీర ఖండాలని కోసి మంత్రంతో అగ్నిలో వేస్తున్నారు. చివరకు పరశంభువు వారినే ఆ చిదగ్ని కుండంలో దూకమన్నాడు. అందరూ దూకేశారు. తరువాత పరశంభువు అష్టకారికలను పఠించి అమ్మవారిని ఆవాహన చేసాడు. అప్పుడు ఆ చిదగ్ని కుండం నుంచి లలితాదేవి ఆవిర్భవించింది. ఆమే "చిదగ్నికుండ సంభూత."  "దేవకార్య సముద్యత." దేవతలందరూ అప్పుడు ఆ లలితాదేవి కోసం సింహాసనం తెచ్చారు. ఆ సింహాసనం మీద ఆ "శ్రీమహారాజ్ఞి" కామేశ్వరునితో కూడి ఆ సింహాసనం అధిష్ఠించారు. ఆమే "శ్రీమత్సింహాసనేశ్వరి." 


                                                                ఆ "శ్రీమాత" తన నుంచి శక్తి సేన ను సృష్టించింది. మొట్టమొదటి స్త్రీ సేన అది. లలితాదేవి తన శక్తితో హృదయం నుంచి బాల ను సృష్టించింది. మంత్రిణిగా శ్యామలాదేవిని, సేనాపతిగా వారాహిని నియమించింది. ఇలా ఎంతోమంది శక్తిస్వరూపాలని తన నుంచి ఆవిష్కరించింది. మహా యుద్ధం ఆరంభమయ్యింది. అమ్మవారి సేన భండాసురుని సేనను సంహరించసాగాయి. బాల భండపుత్రుల నందరినీ వధించింది. "భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా". ఆ తరువాత యుద్ధం భీకర రూపం దాల్చింది. భండాసురుడు సృష్టించిన విఘ్నయంత్రం గూఢంగా దాగి, స్త్రీ సేనను నాయకులకు ఎదురుతిరిగేలా చేసింది. దాంతో వారు నాయకుల మాట వినడం మానేశారు. అప్పుడు అమ్మవారు, కామేశ్వరుణ్ని  చిరునవ్వుతో  చూసింది. గణేశ్వరుడు ఉదయించాడు. "కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా". ఆ గణేశ్వరుడు విఘ్న యంత్రాన్ని భేదించాడు. దానితో స్త్రీ సేన మళ్ళీ గాడిన పడింది. "మహా గణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షితా". 

                                                          తరువాత భండాసురుడు విశుక్రుణ్ణి పంపించాడు. అప్పుడు మంత్రిణి అయిన శ్యామలాదేవి భీకర యుద్ధంలో విశుక్రుణ్ణి సంహరించింది. "మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వధ తోషితా". ఈసారి విషంగుడు వచ్చాడు. సేనాపతి, వారాహి విషంగుణ్ణి వధించింది. "విషంగ ప్రాణహరణా వారాహీ వీర్యనందితా". చివరకు భండాసురుడే స్వయంగా యుద్ధంలోకి దిగాడు. అప్పుడు లలితాదేవే తానూ యుద్ధానికి వచ్చింది. ఇద్దరి మధ్యా ఎన్నో శస్త్రాలతో, ప్రత్యస్త్రాలతో యుద్ధం జరిగింది. "భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ". అమ్మవారు మహా పాశుపతాస్త్రం ప్రయోగించింది. దానితో భండాసురుని సైన్యం అంతా నశించింది. "మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా". చివరగా అమ్మవారు కామేశ్వరాస్త్రం వదిలింది. దానితో భండాసురుడు తన శూన్యకనగరం తో సహా దగ్ధమయ్యాడు. "మహాకామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా". తరువాత కథ బ్రహ్మాండపురాణంలో చదువుకోవచ్చు. 

                                                            బ్రహ్మాండపురాణం ప్రకారం ముందుగా విశుక్రుడు వచ్చాడు, మంత్రిణి చేతిలో చచ్చాడు. తరువాత విషంగుడు వచ్చాడు, వారాహి చేతిలో చచ్చాడు. కనుక స్తోత్రంలో నామాలు ఈ విధంగా ఉండాలి.

మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వధ తోషితా
విషంగ ప్రాణహరణా వారాహీ వీర్యనందితా

కానీ మనం ఎప్పుడూ చదివే లలితా రహస్య సహస్ర నామ స్తోత్రం లో మనం ఈ కింది విధంగా చదువుతున్నాం.    
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా
విశుక్ర ప్రాణహరణా వారాహీ వీర్య నందితా 

దీని ప్రకారం, మంత్రిణి విషంగుణ్ణి చంపితే, విశుక్రుణ్ణి వారాహి చంపింది. అంటే, పురాణంలో ఒకలాగా, స్తోత్రంలో మరొకలాగా ఉండటం కనపడుతోంది. కనుక స్తోత్రాన్ని సవరించుకోవాలి. ఈ తప్పు ఎక్కడ ఎప్పుడు ప్రారంభం అయిందో తెలియదు. ఈ లలితా రహస్య సహస్ర నామ స్తోత్రం బ్రహ్మాండపురాణాంతర్గతమైనది కనుక అక్కడ తేడా వచ్చే అవకాశం లేదు. విడిగా స్తోత్రాన్ని ప్రింట్ చేసేటప్పుడు దోషం దొర్లి ఉండచ్చు. కనుక సరి చేసి స్తోత్రం ఈ విధంగా చదువుకోవాలి. 

మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వధ తోషితా
విషంగ ప్రాణహరణా వారాహీ వీర్యనందితా

                                                        నేను బ్రహ్మాండపురాణం పుస్తకం కోసం వేట మొదలుపెట్టాను. అప్పుడు నాకు "సౌభాగ్య భాస్కర భాష్యం" దొరికింది. కానీ లలితా రహస్య సహస్ర నామ స్తోత్రం బ్రహ్మాండపురాణం లో వుంది. మనం అందరం స్తోత్రం చివరిలో "ఇతి బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీహయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీ లలిత రహస్య సహస్ర నామ స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః"  అని పూర్తి చేస్తాం కదా. 


                                                                  కానీ ఏ బ్రహ్మాండపురాణం కాపీ లోనూ నాకు ఈ స్తోత్రం దొరకలేదు. ఉత్తరఖండమూ వుంది, దానిలో హయగ్రీవ అగస్త్య సంవాదమూ వుంది. కానీ ఈ స్తోత్రం ప్రసక్తి ఎక్కడా ఏ ప్రచురణలో కూడా నాకు దొరకలేదు. చాలా వెతికాను. ఎవరి దగ్గరైనా, పాత పుస్తకం అయినా సరే, పురాణంలో స్తోత్రం కూడా ఉంటే, ప్లీజ్ నాకు కొద్ది  రోజులకు ఇవ్వరా. అప్పుడు మనం నిర్ద్వందంగా ఈ స్తోత్రాన్ని సవరించుకోవచ్చు. ప్రస్తుతానికి విశుక్రుణ్ణి మంత్రిణి, విషంగుణ్ణి వారాహి సంహరించారనే చదువుకోవడం కరెక్ట్. సామవేదం వారు కూడా ఈ మార్పుని ప్రతిపాదించారు. ప్రస్తుతానికి స్వస్తి. 








3 కామెంట్‌లు: