16, ఏప్రిల్ 2020, గురువారం

వంశ వృక్షం అంటే ఏమిటి

వంశ వృక్షం అంటే ఏమిటి 

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                              ఎలిక్స్ హాలీ నవల రూట్స్ చదివినప్పటినుంచీ నాకు కూడా ఎంతో కొంత మన పూర్వీకుల గురించీ, గోత్ర, ప్రవర గురించీ తెలుసుకోవాలని చాలా అనిపించింది. మా యాత్రల్లో భాగంగా, మా రూట్స్ వున్న నందివాడ, నండూరు, ఆరుగొలను, పొన్నూరు, భట్టిప్రోలు వంటి ఊళ్ళు ప్రత్యేకంగా చూసి వచ్చాం. ఆ సందర్భంగా కొన్ని వివరాలుకూడా సేకరించాను. అవి అన్నీ కలిసి ఇప్పుడు ఈ రూపంలో బయటకు వస్తున్నాయి. 




                                                                వంశ వృక్షం రాసేముందు కొంచం మన వంశం వివరాలు, అసలు ఈ కాన్సెప్ట్ ఏమిటో చెప్పుకుందాం. ఇంటిపేరు నందివాడ. ఉండేది ఆరుగొలను. ఇంటిపేరుని బట్టి ఈ కుటుంబం నందివాడ అనే గ్రామం నుంచి ఆరుగొలను వచ్చారని తెలుస్తోంది. నందివాడ లో ఆనందేశ్వరస్వామి ఆలయం వుంది. బహుశా మా తాతగారి పేరు ఆ దేవుడి పేరు మీదే పెట్టారేమో. ఏది ఏమైనా ఈ ఆనంద్ అనే పేరు మా కుటుంబంలో తరతరాలుగా వస్తూనే వుంది. లెక్కపెడితే సుమారు ఓ పది మంది ఆనంద్ లు ఉంటారేమో. తాతగారి అక్క ఆదెమ్మ గారు నండూరి వారి కోడలు. ఆరుగొలను నండూరు వారి మొఖాసా. ఈ పదం నాకు శ్రీదేవి పిన్ని రాసిన 'నెమరేసిన మెమోరీస్' పుస్తకంలో దొరికింది. మా మాతామహుల కుటుంబం వారు ఆరుగొలను మొఖాసాదారులు. ఆదెమ్మ గారి 300 ఎకరాల పొలం పనులు చూడటానికి గాను మా తాతగారు నందివాడ నుంచి ఆరుగొలను చేరారు. 

                                                    సంస్కృతంలో తాత అంటే తండ్రి. అదే మన తెలుగులో తాత అంటే పితామహుడు లేదా మాతామహుడు. ఈ ఇద్దరి తాతలకీ సంస్కృతంలో రెండు పదాలున్నా, తెలుగులో ఒకటే పదం. అంటే ఇంకా తెలుగు భాష పూర్తిగా సంస్కరింప బడలేదని తెలుస్తోంది. హిందీ మహాభారత్  సీరియల్ లో  తండ్రిని తాతాశ్రీ అని పిలవటం కనపడుతుంది. అదే మాతామహి, పితామహి శబ్దాలకు, అమ్మమ్మ,  బామ్మ, లేదా నాయనమ్మ అని వేరే వేరే పదాలు కనపడతాయి. 

                                                          ఆరుగొలనుకి ఆ పేరు ఆ వూళ్ళో ఆరు కొలనులు ఉండటం వల్ల వచ్చింది. ఆ వూరిలో మల్లిఖార్జున స్వామి ఆలయం వుంది. ఇంటి దేవుడు నందివాడ లోని ఆనందేశ్వరుడే కానీ, అందరూ పుట్టిన వూరు ఆరుగొలను లోని  దేవుడు మాత్రం మల్లిఖార్జునుడు. ఇక గోత్రం భారద్వాజస, అంటే భారద్వాజ ఋషి గోత్రం వంటి గోత్రం అని అర్ధం.  గోత్రం అంటే, వంశం అని  ఇక్కడ భాష్యం చెప్పుకోవాలి. ఈ భారద్వాజస గోత్రానికి ఋషులు ముగ్గురు. ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ ముగ్గురు. ఆంగీరస మహర్షి పుత్రుడు బృహస్పతి, బృహస్పతి పుత్రుడు భారద్వాజుడు. ఈ బృహస్పతి ఋషే కానీ నవగ్రహాలలో గురు గ్రహం కాకపోవచ్చు. పేరు మాత్రమే అది. ఈ బృహస్పతి చేసిన ఒక హేయమైన పని వల్ల పుట్టిన వాడు భారద్వాజుడు.  ఆంగీరసునకూ, శ్రద్ధకూ పుట్టినవాళ్లు ఉతధ్యుడు, బృహస్పతి.  ఉతధ్యుని  భార్య మమత. ఈమె గర్భంతో వున్నప్పుడు, ఉతధ్యుడు తీర్ధయాత్రల్లో ఉండగా, బృహస్పతి అమానుషంగా మమతని బలాత్కారం చేస్తాడు. మమత, ఆమె కడుపులో వున్న శిశువు యెంత వద్దని వారించినా వినడు. చివరికి బృహస్పతి వీర్యాన్ని, మమత గర్భస్థ శిశువు కాలితో బయటకు తన్నేసి తానూ జన్మిస్తాడు. కింద పడ్డ వీర్యం బాలుని రూపం దాలుస్తుంది. ఆ బాలుణ్ణి అటు మమతా, ఇటు బృహస్పతీ ఇద్దరూ త్యజిస్తారు. ఇద్దరి చేత  విడిచివేయబడిన (త్యజింపబడిన) వాడు కనుక ఆ బాలుడు భారద్వాజుడైనాడు. ఇదీ భారద్వాజుని జన్మ వృత్తాంతం. 'దాన వీర శూర కర్ణ' సినిమాలో ఒక బ్రహ్మాండమైన డైలాగ్ వుంది, "ఆచార్యదేవా, ఏమంటివి, ఏమంటివి"అంటూ. దానిలో భరద్వాజుడు, ఆతని పుత్రుడు ద్రోణుడు ఇద్దరి జన్మ వృత్తాంతాన్నీ ప్రశ్నిస్తాడు దుర్యోధనుడు.  అసలు ఈ దుర్యోధనాదులందరూ, నూటొక్కమందీ ఇంక్యుబేటర్ లలో కాపాడబడి  పుట్టినవారు. ఇక ద్రోణుడి జన్మ వృత్తాంతం. భారద్వాజునికి ఘృతాచి అనే అప్సర కాంత మీద కోరిక కలిగినప్పుడు జారిపడిన వీర్యాన్ని ఒక కుండ, ద్రోణి, లో భద్ర పరుస్తాడు. తరువాత ఘృతాచి వచ్చి తన అండాన్ని ఆ ద్రోణితో వదులుతుంది. తద్వారా కుండలో పుట్టినవాడు ద్రోణుడు. టెస్ట్ ట్యూబ్ బేబీ గుర్తొస్తోందా. అంటే..... ద్రోణుడు స్త్రీ పురుష శారీరక సంపర్కం లేకుండా ఒక మట్టి కుండలో పుట్టినవాడు. సరే, నందివాడ వారి గోత్రం భారద్వాజస అంటే భారద్వాజ గోత్రము వంటి గోత్రము కలవాడు అని అర్ధం. 

                                             ఇప్పుడు ప్రవర గురించి, వేదం శాఖ గురించీ చెప్తాను. పెద్దలకు ఎవరికైనా నమస్కరించేటప్పుడు, తననితాను పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు, ఈ ప్రవర చెపుతాం. మనం ఎవరి గోత్రస్థులమో, ఎవరి సంతానమో, ఏ వేద శాఖకు చెందుతామో చెప్తూ, చివరిలో స్వీయ నామం చెప్పడాన్నే ప్రవర అంటారు. ఇంతకీ మనది యజుర్వేద శాఖ. నాకు ఎలా తెలిసిందంటే, శ్రాద్ధాల్లో అగ్ని ఉంటే అది యజుర్వేద శాఖ.  ఋగ్వేదం శాఖ వారికి శ్రాద్ధాల్లో ఈ అగ్ని ఉండదు. వాళ్లకు అరచేతిలోనే అగ్నికుండాన్ని గీసి శ్రాద్ధం పెట్టిస్తారు. ఈ రోజుల్లో కేవలం ఉపనయనం చేసేటప్పుడు మాత్రం వాడుతున్నాం. ఉదాహరణకి మన కుటుంబం వాళ్ళు  ప్రవర ఎలా చెప్పాలో ఇక్కడ రాస్తాను. 

చతుస్సాగర పర్యంతం, గోబ్రాహ్మణస్య శుభం భవతి. 
భారద్వాజస గోత్రస్య, ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ త్రయా ఋషేయ,
 ప్రవరాన్విత,  ఆపస్తంభ సూత్రః, యజుశ్శాఖాధ్యాయీ,  
(ఇక్కడ ప్రపితామహః, పితామహ, పితృ నామాలు కూడా చెప్పుకోవచ్చు)
 (అహంభో ముందు తన పేరు చెప్పుకోవాలి ) 
అహంభో అభివాదయే. 

                                  
                                                   ఇక ఇప్పుడు మన ఆరువేల నియోగి శాఖ అంటే ఏమిటో చెప్పుకుందాం. నియోగి అంటే, నియోగించబడిన వాడు అని. అంటే, వీళ్ళు ప్రధానంగా ఉద్యోగాలు చేసేవారు. మంత్రులుగా అధికారులుగా, సంస్థానాధికారులుగా, గ్రామాధికారులుగా, కరణాలుగా పని చేసేవారు. విజయనగర రాజ్యంలో మహామంత్రి తిమ్మరుసు ఒక్కసారిగా ఆరువేల మందిని నియోగించటం  (నియమించటం)  వల్ల, ఆ జాబితాలోని వారందరూ ఆరువేల నియోగులైనారనే వాదన వుంది. వీళ్ళందరూ అధికారం చెయ్యటం వల్లనో ఏమో, లేదా ఎప్పుడూ రాజుల చెంత, చక్రవర్తుల చెంత పని చేసి, చేసి ఆ పౌరుషం కొంత వీళ్లకూ వచ్చింది. బ్రాహ్మణుల్లో ఇతర శాఖల వారికన్నా, ఈ నియోగి శాఖ వారికి, అందునా ఆరువేల నియోగి శాఖ వారికి కొంచం పౌరుషం ఎక్కువ అనే వాదం వుంది. అందుకే నియోగులకు నిక్కు ఎక్కువ అని అంటూ వుంటారు.  

                                          మన కుటుంబాల్లో ఎక్కువగా రావు అనే పేరు కనపడుతుంది. ఈ రావు శబ్దం, రాయ అనే శబ్దం నుంచి వచ్చింది. మేము బర్కత్ పురా లో వున్నప్పుడు ఆ అపార్ట్మెంట్ ల్యాండ్ లార్డ్ కొమరగిరి భూపాలరావు గారు మంచి పండితుడు, రచయితా. కలెక్టర్ గా చేసి రిటైర్ అయినవారు. ఆయన తాను కలెక్టర్ గా వున్నప్పుడు అభివృద్ధి చేసిన రెండు ప్రాంతాలు ఆయన మీద కృతజ్ఞతతో తమ ఊళ్లకు ఆయన పేరు పెట్టుకున్నారు. భూపాలపల్లి, భూపాలపట్నం. ఆయన మంచి పరిశోధకుడు. మాదన్న మంత్రి మీద పరిశోధన చేసి మాదన్న మంత్రి అనే పుస్తకం ప్రచురించారు. తరువాత వాల్మీకి రామాయణం పై పరిశోధన చేసి, "కౌచిప్పలో కమ్మని కాసారం" అనే పేరుతో రామాయణం ప్రచురించారు. మనకు దూరపు బంధువులు. ఇంతకీ ఇక్కడ చెప్పేదేమంటే, వారు కూడా ఆరువేల నియోగులే. ఆయన తన రామాయణంలో రచయితగా "కొమరగిరి భూపాలరాయ" అని రాసుకున్నారు. ఆ విధంగా నాకు రావు, రాయ శబ్దాలు ఒకటే అన్న విషయం తెలిసింది. కానీ ఈ రాయ, రావు పేరు క్షత్రియులకీ, వెలమ దొరలకీ, కమ్మవారికీ ఎక్కువ కనిపిస్తుంది. క్షత్రియులకూ వెలమదొరలకూ సంబంధం వుంది. ఇద్దరూ రాజ్యాలేలిన వాళ్ళే. వెలమల చరిత చదివినప్పుడు వారు రెడ్డి కులం వారి నుంచి వేరు పడ్డ వారని తెలుస్తోంది. రెడ్డివారు కూడా రాజ్యాలు చేసిన వారే. రెడ్లు, కమ్మవారు కూడా ఒకే మూలం నుంచీ వేరు పడ్డవారని తెలుస్తోంది. కమ్మవారు జమీందారులుగా, సంస్థానాధీశులుగా పేరు పడ్డవారే. అంటే ఈ శాఖలన్నింటికీ ఎక్కడో లింక్ ఉందా? తెలియదు. ఇది ఎవరైనా అధ్యయనం చేయాల్సి వుంది. 

                                              మరో విషయం.... చాలా సంవత్సరాల క్రితం విశ్వనాథ సత్యనారాయణ గారి "పునర్జన్మ" అనే నవల చదివాను. తమాషాగా ఉంటుంది కథ అంతా. అందులో ఒక నైష్ఠికుడైన బ్రాహ్మణుడు భార్యావియోగం తరువాత వేరొక పెళ్లి చేసుకుంటాడు. కానీ మొదటి భార్యని మరువలేక పోతాడు. అది మనసులు కలసిన మనువు. రెండోపెళ్లితో విసిగిపోయి 60 ఏళ్ళ వయసులో 40ఏళ్ళ మేనల్లుని దగ్గరకు హైదరాబాద్ వస్తాడు. ఒక సిటీ బస్సులో ఉన్నట్టుండి ఒక 20 ఏళ్ళ అమ్మాయిని చూసి, ఇదే నా మొదటి భార్య అంటాడు. ఆ యువతి కూడా ఈ ముసలాయనను చూసిన వెంటనే , ఈయనే నా పూర్వజన్మ భర్త అంటుంది. ఆ యువతి  20 ఏళ్ళు కూడా లేని వెలమస్త్రీ.  ఈయనేమో 60 ఏళ్ళు దాటిన నైష్ఠిక, నియోగి బ్రాహ్మణుడు. ఆ యువతి తల్లి ఏమో, మీరు నియోగులు, మేము వెలమలం. ఇద్దరం ఒకటే, మేమూ నియోగులమే అంటుంది. ఈ వాక్యం నాకు అసలు అర్ధం కాలేదు. ఇప్పుడు ఈ వాక్యం ఈ రాయ, రావు శబ్దాల దగ్గరకు వచ్చి ఆగింది. విశ్వనాథ వారు చిన్నా, చితకా రచయితా కాదు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. వందల కొద్దీ నవలలే కాకుండా అన్ని విభాగాలలో ఎన్నో పుస్తకాలు రచించిన గొప్ప పండితుడు, కవి. ఆయన అర్ధం లేని రాతలు రాస్తారని అనుకోను.  భూపాలరాయ శబ్దం చూసాక ఏనాడో చదివిన పునర్జన్మ గుర్తు వచ్చింది. ఆ నవల కొంచెం అర్ధం అయినట్టు అనిపిస్తోంది. 

                                              భగవద్గీత పంచదశోధ్యాయం, పురుషోత్తమప్రాప్తి యోగం లో మొదటి శ్లోకం ఇది. శ్రీభగవానువాచ అని ప్రారంభం అవుతుంది. అంటే, ఈ శ్లోకాన్ని స్వయంగా ఆ భగవానుడే చెప్పాడు. ఆ శ్లోకం అర్ధం ఏమంటే, "వేర్లు పైకి, కొమ్మలు కిందకు వుండి, ఆకులన్నీ వేదములై, ఎన్నటికీ నశించని ఆ అశ్వత్థ వృక్షం యొక్క అసలైన స్వరూపాన్ని అర్ధం చేసుకున్నవారే వేదవిదులు." 


 
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ॥
                      
                                                          ఈ అశ్వత్థ వృక్షమే మన వంశవృక్షం, ఆ వేర్లే మన మూలాలు, ఆ కొమ్మలే మన పెద్దలు, ఆ క్రొంగొత్త రెమ్మలే మనం, ఆ  లేలేత ఆకులే మన పిల్లలు అనీ, ఒక్కొక్క ఆకు మీదా మీ పెద్దల పేర్లు, మీ పేర్లు, మీ పిల్లల పేర్లు ఒక్కసారి ఊహించుకోండి. అదే మనం ఇప్పటివరకూ మాట్లాడుకుంటున్న వంశవృక్షం. ఆ వేర్లు భూమిలో ఉంటే, నీరు పోసి కాపాడుకోవచ్చు. కానీ అవి పైకి ఆకాశం లోకి సాగిపోతున్నాయి, మనం వాటికి నీరు అందించలేం. మన ఇళ్లల్లో గాల్లో పెరుగుతున్న మనీప్లాంట్ లాగా వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకోవాలి. వృక్షం స్థిరంగా, నశించకుండా ఉండాలంటే, వేర్లు, మూలాలు, ఆరోగ్యంగా ఉండాలి. అది దాని ఆహారాన్ని అదే తయారు చేసుకునే వాతావరణం ఉండాలి. అంటే, వాతావరణంలో, కుటుంబంలో పొల్యూషన్ వుండకూడదు. మన బాధ్యత అదే. ఇంట్లో అంతా చక్కని సుహృద్భావ వాతావరణం ఉంటే, ధర్మం తప్పక జీవనం సాగిస్తున్నప్పుడు, చెట్టు క్షేమం, వేర్లు క్షేమం, కొమ్మలూ, రెమ్మలూ, ఆకులూ అన్నీ క్షేమం. అంటే, మనం క్షేమాన్ని మనమే కాపాడుకోవాలి. ఇదే నేను వంశవృక్షం చెప్పేముందు చెప్పాలనుకున్నది. నమస్కారం.  

                    





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి