18, ఆగస్టు 2015, మంగళవారం

సంబల్ పూర్ ప్రస్థానం

సంబల్ పూర్ ప్రస్థానం


భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                               నాన్న సంబల్ పూర్ సెంట్రల్ స్కూల్లో ప్రిన్సిపల్ గా ఆరేళ్ళు పని చేశాడు. ఆ ఆరేళ్ళు అందరికీ అన్నీ లెర్నింగే. రోజువారీ భాషగా హిందీ మాట్లాడటం, ఒరియా కూడా మాట్లాడగలగటం, ఎండలే తప్ప చలి అంతగా తెలియని మేము అక్కడ వచ్చే విపరీతమైన చలిని తట్టుకోటం ఎలాగో, ఎండాకాలంలో వచ్చే మంటలు పుట్టే వేడినుంచి కాపాడుకోవటం, వానాకాలంలో వచ్చే అప్పటివరకూ మేమేరుగని పిచ్చిపిచ్చి గాలులు, వాటిని టైఫూన్లు అంటారట, వాటిల్నుంచి జాగ్రత్తగా వుండటం, అన్నీ నేర్చుకున్నాం. ఎండాకాలంలో పొద్దున్నే ఆరింటికల్లా బాగా ఎండ వచ్చేసేది. వానాకాలంలో మబ్బులు తమాషాగా ఉండేవి. మా ఇంటి వెనకాలే బూఢారాజా కొండ వుండేది, అది చాలా పెద్ద కొండ. మబ్బులు ఆ కొండకి మధ్యలో కనపడేవి. ఆ సీన్ భలే వుండేది. పైన కొండ, కింద కొండ, మధ్యలో మబ్బు. వివరంగా చెప్పాలంటే  పైన ఆకాశం, ఆ కింద కొండ, ఇంకా కింద మబ్బులు, వాటి కింద జోరున వాన. అలా ఆకాశం, పొడిగా వుండే కొండ, మబ్బు, వాన, తడిసిన కొండ ఒకేసారి చూడ్డం తమాషాగా, వింతగా వుండేది.  అక్కడ పాములు చాలా స్వేచ్చగా తిరిగేవి. ఉడుములు కూడా తిరిగేవి. ఒకసారి కొండచిలువ కూడా వచ్చింది. ఎదురుగుండా వున్న పొలం పక్కనే స్మశానం వుండేది. అప్పుడప్పుడు శవాలు కూడా కాల్చేవాళ్ళు. అన్నీ చూసేవాళ్ళం. ఇంటి ముందు ఒక చిన్నకొండ, వెనక ఒక పెద్దకొండ ఉండేవి. ప్రపంచంలోనే నదిమీద కట్టిన పొడవైన మట్టిడ్యాంగా పేరొందిన హీరాకుడ్ డ్యాం మా ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరం. నీళ్ళు రిజర్వాయర్ లో సమృద్ధిగా వున్నప్పుడు, నీళ్ళు వదిలితే ఆనీటి తుంపర ఒక నీటి పొగమబ్బు లాగా మాక్వార్టర్ల నుంచే కనిపించేది. ఆడ్యాం, దాని పక్కనే వున్న పవర్ హౌస్, లోపల వుండే టన్నెల్ చాలాసార్లే చూశాం. అప్పుడప్పుడు వానాకాలంలో, బాగా వానలు పడినప్పుడు, ఆ పొలాల్లో పడ్డ వాననీళ్ళల్లో అక్కడి స్థానికులైన  ముండా జాతివాళ్ళు ఉసుళ్ళు అనే పురుగుల్ని పట్టుకునే వాళ్ళు. అవి తింటారట, 'యాక్' అనుకునేవాళ్ళం. 

                                                  మొదట్లో ఈ ముండా వాళ్ళేమిటి, ఇదేం పేరు అని నవ్వుకునేవాళ్ళం. మనకేమో 'ముండా' అంటే తిట్టు పదం. ఈ ముండా జాతిలోని బిర్సా ముండా అనే వీరుడు, మన అల్లూరి సీతారామరాజు లాగా ఇంగ్లీషు వాళ్ళతో స్వాతంత్య్రం కోసం చాలా పోరాటం చేసి చనిపోయాడని తెలిసాక, వాళ్ళంటే గౌరవం పెరిగింది. ఈ ముండాజాతి వాళ్ళు ఆడా, మగా తేడా లేకుండా రాత్రుళ్ళు అంతా తాగేవాళ్లు. తమాషా ఏంటంటే, వాళ్ళ తాగే మత్తు ద్రవం వాళ్ళే తయారు చేసుకునేవాళ్ళు. యేరోజూ మిగిలిన అన్నం, వగైరా అన్నీ ఒక కుండలో పెట్టి నిండా నీళ్ళు పోసి, దానికి మూత పెట్టి, మూతి కట్టేసి వాళ్ళ దొడ్లో ఒక చోట గుర్తుగా పాతిపెట్టేవాళ్ళు. అది బాగా పులిసినాక ఆనీళ్ళు తీసుకుని తాగేవాళ్లు. ఇలా రోజూ కుండలు పాతిపెట్టటం, అన్నింట్లో ఏది పాతదో చూసుకుని తీసి తాగటం. ఇదీ వాళ్ళ నిత్య కృత్యం రాత్రిపూట. ఈరోజుల్లో చౌక సారా, నకిలీ సారా, ఇల్లాంటి గొడవలు వాళ్లకి లేవు. పైగా తాగటానికి, వాళ్ళ సంపాదన నాశనం చేసుకోనవసరం లేదు. వాళ్ళ మద్యం వాళ్ళే తయారు చేసుకోవటం వల్ల నిషాకి నిషా, ఖుషీకి ఖుషీ.  ఒక్కోసారి కొండ జాతి వాళ్ళే నాగరికుల కంటే మేలేమో. ఆడుతూ పాడుతూ సరదాగా వాళ్ళ జాతరలు చేసుకునేవాళ్ళు. 

                                                       సంబల్ పూర్ వెళ్ళాక నాన్నకి ఒక మేలు జరిగింది. విజయవాడ, తెనాలిలో ఉండేటప్పుడు ప్రతి చలికాలంలో కాలికి మేహవాతం వచ్చి చాలా బాధపడేవాడు. అప్పుడప్పుడు ఒంటికణత నొప్పి వచ్చి బాధపడేవాడు. దీన్నే మైగ్రేన్ అంటారని తరవాత తెలిసింది. ఈ బాధలన్నీ చాలావరకు సంబల్ పూర్ వెళ్ళాక తగ్గిపోయాయి. అంటే, పూర్తిగా పోలేదు కానీ వచ్చినా చాలా రోజుల తరవాత రావటం, లేదా వచ్చినా తీవ్రత తక్కువగా వుండటం, ఇలా వుండేది. నాన్న మొదటిసారి స్కూటర్ కొనుక్కుంది కూడా అక్కడే. నీలం రంగు డార్క్, లైట్, కలర్ల కాంబినేషన్ తో  వున్న లాంబ్రేట్టా అది. చివరిదాకా అదే నడిపాడు. నాన్న తరవాత బాబు దాన్ని హరి పెద్దనాన్న కొడుకు కృష్ణకి ఇచ్చాడు, నాన్న గుర్తుగా వాడుకోమని. 

                                               సంబల్ పూర్ లో నాన్న చలికాలం రాంగానే మా క్వార్టర్ల పక్కనే, అదే కాంపౌండ్ లో బాడ్మింటన్ కోర్ట్ వేయించి ఆడటానికి అందర్నీ పిలిచేవాడు. సెంట్రల్ స్కూల్ వాళ్ళు, తెలుగువాళ్ళు చాలా మంది ఆ సీజన్లో అక్కడ చేరేవాళ్ళు. చలికాలంలో వంట్లో వేడి పుట్టాలంటే అలా చెమట పట్టేలా ఆడాల్సిందే. అక్కడే వాచ్ మాన్ బహదూర్ మాకోసం అల్లం వేసి వేడివేడిగా టీ చేసి అందరికీ ఇచ్చేవాడు. భారతి అందరికన్నా బాగా ఆడేది. అమ్మకూడా బాగా ఆడేది. సింగిల్స్, డబుల్స్ అన్నీ ఆడేవాళ్ళం. టోర్నమెంట్లు కూడా పెట్టుకునే వాళ్ల్లం. బాపూజీ అంకుల్ వాళ్ళ క్లబ్, మా అయింఠపూర్  క్లబ్  పోటీలు పెడితే, నేనూ, భారతి ఒకసారి గెల్చాం. మా అందరిలో భారతే బాగా ఒరియా మాట్లాడేది. మిగిలిన అందరికీ ఏదో వర్కింగ్ నాలెడ్జే.   

                                               అప్పుడే మాకు బాపూజీగారు, నెహ్రూగారు, పంతులుగారు, కుటుంబాలతో బాగా స్నేహం అయ్యింది. బాపూజీగారు ఆ రోజుల్లోనే ఎంబీయే చేసి కాకినాడ నుంచి సంబల్ పూర్ కి వలస వచ్చారు. సంబల్ పూర్ దగ్గర మానేశ్వర్ అనే పల్లెలో చాలా పొలం కొని, వ్యవసాయం మొదలుపెట్టారు. అది హీరాకుడ్ డ్యాం కింద భూమి, బాగా పండేది. కాకినాడ నుంచి కొన్ని కుటుంబాలని కూడా తనతో తీసుకువచ్చి, వాళ్ళకి పొలంలో ఇల్లు కట్టి ఇచ్చి వాళ్ళతో వ్యవసాయం చేయించేవారు. బాపూజీగారి భార్య శారదా ఆంటీ చక్కగా పాటలు పాడేది. వాళ్ళ  పిల్లలు మదన్, రామకృష్ణ, మురళి.  నెహ్రూ అంకుల్ గారు ఏజీ ఆఫీస్ లో పని చేసేవారు. మీనాక్షీ ఆంటీ కూడా శాస్త్రీయ సంగీతం బాగా పాడేది. వాళ్ళ పిల్లలు గరి, ఉబ్బి, బేబీ.  గరి అసలు పేరు గరిమెళ్ళ కోదండరావు, ఉబ్బి పేరు కామేశ్వరరావు, బేబీ పేరు అనురాధ. గరి, మదన్, మా వివేక్ ఒక వయసు వాళ్ళు. అంతా కలిసి కొంపల్లేచిపోయేలా అల్లరి చేసేవాళ్ళు. సందడో  సందడి, వీళ్ళంతా ఒకచోట చేరితే. పంతులుగారు ఒరిస్సా స్టేట్ గవర్నమెంట్ లో ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేసేవారు. విద్యావతి ఆంటీ కూడా చాలా స్నేహంగా వుండేవారు. వాళ్లకి నలుగురు పిల్లలు. కానీ అందరూ మాకన్నా చాలా చిన్నవాళ్ళు.  



                                                      మా క్వార్టర్లలోనే రాంబాబు అని నాన్న స్కూల్లోనే యూడీసీ, సరోజినీ మేడం అని ఒక ప్రైమరీటీచర్ కూడా వుండేవారు. అందరం ఎంతో కలిసిమెలిసి వుండేవాళ్ళం. అన్నట్టు ఈ మధ్యనే మూడురోజుల క్రితం నేను, భారతి, పద్మ ముగ్గురం సరోజినీమేడంని కలుసుకున్నాం. పద్మ ఆవిడని ఫేస్ బుక్ ద్వారా వెతికి పట్టుకుంది. ఫేస్ బుక్ చేసిన సహాయం ఇది. పద్మ చాలా సెర్చ్ చేసి మేడం నంబర్ సంపాయించి ఆవిడకి కాల్ చేసి తిరిగి కాంటాక్ట్ ప్రారంభించింది. మేడం వాళ్ళ బంధువులింటికి కొంపల్లి వచ్చినప్పుడు కలిశాం. సుమారు 37 ఏళ్ళ తరవాత కలిశాం. దాదాపు నాలుగు గంటలు బోల్డు ఖబుర్లు చెప్పుకున్నాం. ఫోటోలు తీసుకున్నాం. చాలామందిని తలచుకున్నాం. కలుసుకోవటం ఎంత సంతోషాన్నిచ్చిందో, విడిపోతుంటే అందరికీ బాధ వేసింది. మేడం కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇక 
రాంబాబు పిల్లలు నిమ్మి, గుండు, మంజుల ఎప్పుడూ మాఇంట్లోనే వుండేవాళ్ళు. పట్నాయక్ అని ఒక ఎల్డీసీ, చాలా చిన్న వయసువాడు, కూడా ఆ క్వార్టర్లలోనే వుండేవారు. నాన్న మంచితనం, తెలివితేటలు, సహృదయం ఒకసారి పట్నాయక్ ప్రాణాలు కాపాడాయి. పట్నాయక్ కి సడెన్ గా గుండెలో చిల్లి వుందని, వెంటనే ఆపరేషన్ చెయ్యాలనీ, అదీ ఒక్క రాయవెల్లూరు ఆసుపత్రిలో మాత్రమే చేస్తారనీ తెలిసింది. అప్పుడే తెలిసింది కంచిపట్టు గుడ్డముక్కతో ఆ చిల్లికి అతుకు పెట్టి ఆ ఆపరేషన్ చేస్తారని.  అది చాలా ఖరీదైన ఓపన్ హార్ట్ సర్జెరీ. పట్నాయక్ తల్లితండ్రులు అంతగా చదువులేని పల్లెటూరివాళ్ళు. వాళ్లకి ఇవేవీ తెలియవు. వాళ్ళు అతనితో వెళ్ళినా ఏమీ ప్రయోజనం వుండదు. ఆరోజుల్లో ఏ ఒక్కరి దగ్గరా అంత డబ్బూ లేదు. పట్నాయక్ కి మెడికల్ గ్రాంట్ వస్తుంది, కానీ అంత టైం లేదు. నాన్న వెంటనే దిలేశ్వర్ అనే ఒక అటెండర్ కి సెలవు ఇచ్చి పట్నాయక్ కి తోడుగా పంపించాడు. స్కూల్లో ఆ నెల అందరూ జీతం అంతా పట్నాయక్ కి ఇచ్చేలా చేశాడు. నాన్న అందరికీ 'ఒక నెల జీతం రాలేదనుకుని పట్నాయక్కి ఇచ్చేయండి, అతను తిరిగి వచ్చాక, మెడికల్ బిల్లులు అన్నీ వచ్చాక మనందరికీ తిరిగి ఇచ్చేస్తాడు'  అని చెప్తే అందరూ నాన్న అయిడియాని ఎంతో మెచ్చుకుని ఒప్పేసుకున్నారు. దాదాపు ఓ నలభైరోజుల తరవాత పట్నాయక్ ఆరోగ్యంతో తిరిగివచ్చాడు. రాయవెల్లూరులో  వున్న అన్నిరోజులూ దిలేశ్వర్ పట్నాయక్కి చక్కగా సేవ, సాయం చేశాడు. మొత్తంమీద  స్కూల్లో అందరూ కలిసి పట్నాయక్ కి పునర్జన్మ ఇచ్చారు. పట్నాయక్ తిరిగి వచ్చి నాన్నకీ, అమ్మకీ కాళ్ళకి దణ్ణం పెట్టాడు. అందరికీ ఎవరి డబ్బు వారికి ఇచ్చేశాడు. ఆ తరవాత అందరూ నాన్నని ఒక హీరోలాగా, లీడర్లాగా చూసేవారు. ఆస్కూల్లో నాన్న ఏంచెప్పినా అందరూ చక్కగా వినేవారు. ఎదురు ప్రశ్నించే వాళ్ళు కాదు.  

                                                             అక్కడ వున్నప్పుడు మా పద్మ హోమ్ సైన్స్ లో చేరి వాళ్ళ స్కూల్లో రకరకాల వంటలు చేసి టీచర్లందరికీ మొహమాటపెట్టి  మరీ అమ్మేది. అది వాళ్ళ గ్రూప్ లో సేల్స్ స్పెషలిస్ట్. యెంత స్పెషలిస్టంటే నాన్నక్కూడా అమ్మి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళ సంచయికా బాంకులో వేసేది. భారతేమో క్రాఫ్ట్ తీసుకుని అందరికీ స్వెట్టర్లు అల్లేది. పెరట్లో అమ్మ బోల్డు కూరలు, పళ్ళు, పండించేది, పూల మొక్కలు కూడా చాలా వేసింది. ఇంట్లోనే మల్లెలు, గులాబులు, మరువం, చామంతులు, బంతులు, టొమాటోలు, బెండ, దొండ, ఆలూ, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, దోసకాయ, మొక్కజొన్నలు, తోటకూర, మెంతికూర, గోంగూర, కొత్తిమీర, పాలకూర, లిటిల్స్, జామకాయలు, బొప్పాయి, అరటి,  రేగు, ఇలా ఒకటని కాదు, ఎన్నో పళ్ళు, పూలు, కాయలు, కూరలు అన్నీ పండించేది. 

                                                                  ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూ వుండేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ టీలు, స్నాక్స్, వీటితో వంటిల్లు ఎప్పుడూ, దాదాపు రాత్రి పది, పదకొండు దాకా బిజీగా వుండేది. వాళ్లకి టీలు, కాఫీలు కలపటానికి ఏరోజు ఎన్ని పాలు తీసుకోవాలో లెక్క తెలియక, ఎప్పుడూ అమూల్ పాలపొడి డబ్బాలు ఇంట్లో పెట్టుకునే వాళ్ళం. రాత్రిపూట చదువుకునే వాళ్లకి (మాకే) మధ్య రాత్రిలో ఆకలేస్తుందని అమ్మ రోజూ కొన్ని చపాతీలు ఎక్కువ చేసి టేబుల్ మీద పెట్టేది. ఏరోజూ అవి మిగిలేవి కావు. చదువుకోవటంకోసం మేలుకునేవాళ్ళమో, చపాతీలు తినటానికి మేలుకునేవాళ్ళమో తెలీదు. ఆ రోజుల్లో సెంట్రల్ స్కూల్ లైబ్రరీలో వున్న పుస్తకాలన్నీ చదివేశాం. రమణ బాబాయిగారి పుస్తకాలన్నీ ఆ రోజుల్లో ఎప్పుడూ చదువుతూ వుండేవాళ్ళం. నాన్న పోస్టులో తెలుగు డైలీ పేపర్ 'ఆంధ్రజ్యోతి' తెప్పించేవాడు. అది మోహనం మామయ్యది కదా అందుకు. అది ఒక రోజు ఆలస్యంగా ఈరోజు  పేపర్ మరుసటిరోజు వచ్చేది. 'ఆజ్ కీ తాజా ఖబర్' కి బదులుగా 'కల్ కీ బాసీ ఖబర్' చదువుతూ వుండేవాళ్ళం. ఆవిధంగా అయినా మన ప్రాంతంలోని వివరాలూ, విశేషాలూ తెలుస్తూ వుండేవి. 

                                                మేము అక్కడ వున్న  రోజుల్లోనే దివిసీమ ఉప్పెన వచ్చింది. నాన్న చాలా ఖంగారు పడ్డాడు, అందరూ ఎలా వున్నారోనని. ఫోన్ లైన్లు పనిచెయ్యలా. విజయవాడ ఉమా పెద్దనాన్నకి  టెలిగ్రాం ఇస్తే, ఆయన 'ఆల్ వెల్' అని ఇచ్చిన టెలిగ్రాం పదిరోజుల తరవాత వచ్చింది. తరువాత ఆంధ్రజ్యోతిలో ఆ వివరాలన్నీ చదివి చాలా బాధపడ్డాం. ఆ రోజుల్లోనే మన దేశంలో ఎమర్జెన్సీ విధించటం, తరవాత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి, ఇందిరా గాంధీ దిగిపోయి జనతాపార్టీ గవర్నమెంట్ రావటం జరిగింది. న్యూస్ లో మొరార్జీ దేశాయ్ మాట వినిపిస్తే, నాన్న 'ఎన్నాళ్ళకి మళ్ళీ మొరార్జీ మాట వినిపిస్తోంది' అన్నాడు. నేనేమో 'మొరార్జీ ఎవరు నాన్నా, న్యూస్ రీడరా?' అన్నా. తరవాత ఆయన మన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు, నాన్న నవ్వుతూ 'నీ న్యూస్ రీడర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యిపోయాడే' అన్నాడు. వాజపాయి అంటే నాన్నకి ఇష్టం, ఎంతైనా వాళ్ళ జనసంఘం నాయకుడు కదా. ఆయన స్పీచ్ లు చాలా శ్రద్ధగా వినేవాడు. అసలు వాజపేయి పేరు వింటుంటేనే నాకు భలే సరదాగా వుంటుంది. ఆయన పూర్తిపేరు అటల్ బిహారీ వాజపేయి. హిందీలో అటల్ అంటే స్థిరమైన, చలించని అని అర్ధం. మళ్ళీ అదే హిందీలో బిహారీ అంటే ఎల్లప్పుడూ తిరిగేవాడు, ఒకేచోట స్థిరంగా ఉండనివాడు అని. అంటే ఆయన స్థిరంగా వుంటాడూ, వుండడూ అని ఆయన పేరులోనే వుంది. ఆపేరులో ఆయన వ్యక్తిత్వం కూడా  ప్రతిఫలిస్తుంది. ఆయన ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలో అంటే పట్టు పట్టాలా, పట్టు విడవాలా అని చక్కగా తెలిసిన వ్యక్తి. అంటే



 'ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ 
నొప్పింపక తానొవ్వక 
తప్పించుకు తిరుగువాడు, ధన్యుడు సుమతీ', 

                                        ఆటైపు. అందుకే రాజకీయాల్లో బాగా రాణించాడు. ఒకవైపు మితవాదిగా కనపడుతూనే అతివాద నిర్ణయాలు కూడా చేశాడు. దటీజ్ అటల్ బిహారీ వాజపేయి. అన్నట్టు ఈయనకీ ఒక లక్ష్మణుడి లాంటి తమ్ముడున్నాడు, ఆయనే లాల్ కృష్ణ అద్వానీ. ఈ ఇద్దరూ కలిస్తే చక్కని టీం. మితవాదిలాగా కనపడే అతివాది, అతివాదిలాగా కనపడే మితవాది, ప్రతిపక్షాలని తప్పుదారి పట్టించటానికి.  

                                                  సంబల్ పూర్ లో వున్న రోజుల్లోనే నాన్న సహాయంతో ఆనందరావుగారు వాళ్ళ నువాఖైరుపల్లి అనే వూళ్ళో తెలుగు-ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ తెరిచారు. ఆ స్కూల్ కి సేతుమాధవరావు గారని, ఒక మంచి తెలుగు వ్యక్తిని దిల్లీ నుంచి తెచ్చి పెట్టారు. ఆ స్కూల్ కి ఫండ్స్ కోసం తెనాలి నుంచి ఒక డ్రామాట్రూప్ ని పిలిపించి తెలుగులో నాటకాలు కూడా వేయించాడు. అందరూ నాన్నని ఎంతో పొగిడారు. ఆ స్కూల్లో కొన్నాళ్ళు మా రాఘవ బావగారు, అనురాధక్క కూడా పని చేశారు. వీళ్ళ గురించి తరవాత నందివాడ కుటుంబం పరిచయంలో రాస్తాను. అదే రోజుల్లో నా పెళ్లి అయ్యింది. ఆవెంటనే నాన్నకి గౌహతీకి ట్రాన్స్ ఫర్ అయ్యింది. అప్పటికే నాన్నకి ఆ వూళ్ళో ఆరేళ్ళు సర్వీస్ పూర్తి అయ్యింది. సెంట్రల్ స్కూళ్ళల్లో అన్నాళ్ళు ఒకే వూళ్ళో వుంచడం కష్టం. పాపం, నాన్నని ఆవూళ్ళో ఇంకొన్నాళ్ళు ఉంచాలని ఆత్మీయులంతా ఎంతో ప్రయత్నించినా ఆ ట్రాన్స్ ఫర్  ఆగలేదు. మా కుటుంబం సంబల్ పూర్ నుంచి గౌహతీకి బయల్దేరారు. కానీ పెళ్లి అయ్యి నేను మా వారి దగ్గరికి రాజమండ్రికి, ఎమ్మెస్సీ ఇంకా ఒక సంవత్సరం ఉండటంతో భారతిని నెహ్రూ అంకుల్ ఇంట్లోను వుంచి అమ్మా, నాన్నా, పద్మా, బాబూ, గౌహతి వెళ్ళారు. 












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి