18, ఆగస్టు 2015, మంగళవారం

కళాసరస్వతి తెనాలి

కళాసరస్వతి తెనాలి

భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                     తెనాలి రోజులు మా అందరికీ కూడా చాలా ప్రత్యేకం. బహుశా ఆరోజుల్ని మాలో ఎవ్వరూ మర్చిపోలేదు, మర్చిపోలేరు. ఎందుకంటే అవన్నీ ఒకరకంగా మాకు ఫార్మేటివ్ యియర్స్. మాకంటూ ఒక సంస్కృతీ, సంప్రదాయం, అభిరుచులు, అభిప్రాయాలూ, భావాలూ ఏర్పడటం అక్కడే జరిగింది. మొదట్లో ఒక ఇంట్లో మేడమీద చిన్నవాటాలో వుండేవాళ్ళం. ఒక నెలలోనే ఆ ఇంటికి ఎదురుగా వున్న వీధిలో ఒక పెద్ద ఇంటికి మారాం. ఆ ఇల్లు సినిమా యాక్టర్ ముదిగొండ లింగమూర్తి గారిది. ఆయన మద్రాసులోనే ఉండటంతో ఆ ఇల్లు ఖాళీగా వుండేది. పెద్ద పెరడు వున్నట్టు గుర్తు. ఆ ఇంట్లో కూడా ఎక్కువ రోజులు లేము. ఒక సంవత్సరం లోపే అది కూడా ఖాళీ చేసేసి వేదాంతం కృష్ణ ప్రసాదు గారింటికి మారాం. ఆయన పక్కనే వున్న పల్లె, కుంచవరంకి ప్రెసిడెంట్. వాళ్లకి ఈ ఇల్లు ఫార్మ్ హౌస్ లాంటిది. అప్పుడప్పుడు వాళ్ళు కుటుంబంతో సహా, ఒక్కోసారి దగ్గర బంధువులతో కూడా కుంచవరం నుంచి తెనాలి వచ్చి మూడు, నాలుగు రోజులుండి, ప్రతిరోజూ సుమారు రోజూ రెండు, మూడు సినిమాలు చూసి మళ్ళీ వాళ్ళవూరు వెళ్ళిపోయేవారు. మాకు ఇదంతా వింతగా, తమాషాగా వుండేది. కృష్ణ ప్రసాద్ గారు నాన్నకి ఒక కండిషన్ పెట్టారు. అదేమిటంటే ఆ చుట్టుపక్కల ఆ ఒక్క ఇంటి బోర్ వెల్ లోనే తియ్యని నీళ్ళు వచ్చేవి. కనుక నీళ్ళకి వచ్చేవారిని ఆపద్దని చెప్పారు. మేమెవ్వరం అక్కడున్నన్నాళ్ళు ఎప్పుడూ నీళ్ళకోసం వచ్చేవారిని ఆపలేదు. అది ఒక్కోసారి తలనొప్పి కూడా అయ్యేది. నీళ్ళ వంకతో దొంగలు కూడా వచ్చి మా కాగులు, బిందెలు నీళ్ళతో నింపుకుని సైలెంట్ గా వెళ్లిపోయేవాళ్ళు. తరవాత చూసుకొని కుయ్యో, మొర్రో అనుకునేవాళ్ళం. అలా చాలాసార్లే జరిగింది. ఆ ఇంటికి అన్నివేపులా బైటకు వెళ్ళటానికి తలుపులు ఉండేవి. మెయిన్ గేట్ కాక ఇంకా రెండు చిన్న గేట్లు అటూ, ఇటూ ఉండేవి. అందులో ఒకటి ఇంటి ఓనర్లకి, ఇంకోటి నీళ్ళకోసం వచ్చేవాళ్ళకి, మధ్యలోది మాకు. రాత్రిపూట అన్ని గేట్లు, తలుపులు గడియలు వేసి పడుకునే వాళ్ళం. ఏ రోజూ ఇదో పనిగా వుండేది. పైగా ఇల్లు పెద్దది కావటంతో అన్ని తలుపులూ చూసుకుని, అడ్డగడియలు వేసి, తాళాలు వేసుకుని, వచ్చేసరికి కనీసం పది నిముషాలు పట్టేది. ఆ ఇంట్లో స్నానాలగది పెరట్లో బైటకు విడిగా వుండేది. అది కూడా రోజూ తాళం వేసేవాళ్ళం. ఎందుకంటే దాంట్లోనే మా నీళ్ళ బాయిలర్, దాంట్లోకి వాడే బొగ్గులు, కట్టెలు, బక్కెట్లు, చెంబులు, సబ్బులు  అన్నీ ఉండేవి. అప్పటికి ఇంకా ప్లాస్టిక్ సామాను వాడకంలోకి రాలేదు. అన్నీ ఇత్తడి, ఇనుము, రాగి, అల్యూమినియం సామాన్లే ఉండేవి. వంటింట్లో కూడా ఎక్కువ ఇత్తడి, ఇనుము పాత్రలే ఉండేవి. స్టీలు పాత్రలు కూడా చాలా తక్కువ. ఇంకా పులుసులు చారులు కాచడానికి రాచ్చిప్పలు ఉండేవి. ఈ రోజుల్లో ఎవరికీ ఈ రాచ్చిప్పలు తెలియవు. చాలా కాలానికి అవి కోణార్క్ చూడ్డానికి వెళ్ళినప్పుడు కనిపిస్తే ఒకటి కొన్నా.  అన్నట్టు ఆ రోజుల్లోనే మా ఇంట్లో గాస్ స్టవ్ వుండేది. నాన్నే మొదటగా మా ఇంట్లో గాస్ స్టవ్ కొన్నది.  ఆ రోజుల్లో సిలిండర్ పేలుతుందని అందరూ భయపడేవాళ్ళు. ఆరోజుల్లో సిలిండర్ ధర పదహారు రూపాయల చిల్లర. ఇప్పుడు చెప్తే ఎవరూ నమ్మరేమో. అప్పటి బిల్లు ఒకటి వుంచుకోవాల్సింది. ఆ ఇంటికి ముందు పెద్ద వరండా వుండేది. దాంట్లోనే కుర్చీలు, టేబుళ్లు వేసేవాళ్ళం. నాన్న ఇంట్లో వుంటే ఆ వరండా నిండా ఎప్పుడూ నాన్నకోసం వచ్చేవారు వుండేవారు. నాన్న ఇంట్లో లేకపోతే ఆవరండా ఖాళీగా వుండేది. మేమే చింతగింజలాట, వామనగుంటలు, పచ్చీసు, తొక్కుడుబిళ్ళ, చెమ్మచెక్క, ఒప్పులకుప్ప లాంటి ఆటలు ఆడుకునేవాళ్ళం. 
  
నాన్నకేమో పెద్ద ఇల్లు అలవాటు. కానీ అంత అద్దె ఒక్కడే పెట్టలేక ఎప్పుడూ ఆ ఇంట్లో ఓ రెండు, మూడు గదులు సబ్ లెట్ చేసేవాడు. అందువల్ల మాకు ఎప్పుడూ పక్కన ఎవరో ఒకరు తోడు వుండేవారు. మాఇంటి ఎదురుగుండా వుండే ఇల్లు మాస్కూల్లోనే టీచర్ గా పనిచేసే స్వామిశాస్త్రి గారిది. వాళ్ళకి వల్లి ఒక్కత్తే కూతురు. వల్లి మాఇంట్లో ఇంకో పిల్లలాగానే వుండేది. అది మాకు చదువుకోడానికి బుక్స్ తెచ్చిపెడుతూ వుండేది. ఆ రోజుల్లో తెనాల్లో చాలా మూఢఆచారాలు పాటించేవారు. పెద్దమనిషి కాకముందే ఆడపిల్లలకి పెళ్లి చేయాలని దానికి ఏడో క్లాస్ చదువుతున్నపుడే పెళ్లి చేసేశారు. అదీ అయిదు రోజుల పెళ్లి. పెళ్లి తరవాత అది దాదాపు స్కూల్ మానేసినట్లే. ఇష్టం వుంటే వచ్చేది, లేకపోతే లేదు. పెళ్లి అవటంతో ఎప్పుడూ చాలా నగలు పెట్టుకుని తిరుగుతూ వుండేది. దానికి సినిమాలంటే చాలా ఇష్టం, కానీ దాన్ని, వాళ్ళ అత్తవారు తప్పు పడతారని, ఒంటరిగా సినిమాలకి వెళ్ళనిచ్చేవారు కాదు. ఒకసారి అది వాళ్ళ పిన్ని కొడుకుని తీసుకుని సినిమాకి వెళ్ళింది. దానికి పదకొండు ఏళ్ళు, ఆ తమ్ముడుకి ఆరేళ్ళు. హాల్లో ఎవరో ఆడ వేషంలో వచ్చి దీని పక్కనే కూర్చుని దేవుడి ప్రసాదం అని ఏదో తినిపించి టాయిలెట్ కి తీసుకెళ్ళి ఆ వున్న నాలుగు నగలూ దోచేసుకుని పారిపోయారు. ఆ సంఘటనతో అందరూ చాలా భయపడిపోయారు. చాలా రోజులు అది మమ్మల్నెవరినీ గుర్తు పట్టలేదు. కానీ మాకా భయాలేవీ లేవు, ఎందుకంటే మా దగ్గర అసలు బంగారమే లేదు. మా బామ్మ అంటూ వుండేది ఎప్పుడూ, ఎదిగిన ఆడపిల్లల్ని తండ్రి బోసిమెడతో చూడకూడదని. పాపం నాన్న దగ్గర ఎప్పుడూ బంగారం కొనేటంత డబ్బు వుండేదే కాదు. ఆ తరవాత చాలా కాలానికి ఒంటి వరుస ముత్యాల గొలుసులు నాకు, భారతికి ఒకేసారి చేయించారు, మొత్తం బంగారు గొలుసైతే ఎక్కువ డబ్బులవుతాయని. 

                                                          తెనాల్లో ఎప్పుడూ యేవో పూజలూ, వ్రతాలూ, నోములూ, జపాలూ ఎవరో ఒకళ్లిళ్ళల్లో జరుగుతూనే ఉండేవి. ఎప్పుడూ ఆ స్కూల్ మేనేజ్ మెంట్ వాళ్ళు స్కూల్ గ్రౌండ్ని ఎవరో ఒక స్వామీజీకి ప్రవచనాలకి, చాతుర్మాస్య దీక్షలకు, సభలు, సమావేశాలకు యిస్తూనే వుండేవారు. దానితో నాన్నకీ ఆ స్వామీజీలతో బాగా పరిచయం ఏర్పడింది. ఆ రోజుల్లోనే నాన్న కంచి పీఠాధిపతి, చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి, శృంగేరి పీఠాధిపతి, పుష్పగిరి పీఠాధిపతి, కుర్తాళం పీఠాధిపతి వీరందరికీ పాదపూజలూ, బిక్షలూ చేసేవారు. పుష్పగిరివారు, కుర్తాళంవారు వారి పీఠాన్ని మా ఇంట్లోనే పెట్టేవారు. శృంగేరి, కంచి పీఠాలు పెద్దవి కనుక అవి స్కూల్లోనే పెట్టేవారు. వీరిలో పుష్పగిరి పీఠాధిపతి అయితే ఒకసారి సంబల్ పూర్ కూడా వచ్చారు. బిక్షలు, పాదపూజలు చేసే రోజుల్లో చాలా మందిని భోజనాలకి పిలిచి వీధిలో పందిళ్ళేసి మరీ భోజనాలు పెట్టేవారు. నాన్న ఆదాయంలో చాలా భాగం ఇలాంటివాటికి ఖర్చు అయ్యేది. కొంతమంది మాత్రం నాన్నకి జాగ్రత్త చెప్పేవాళ్ళు. ఆడపిల్లలున్నవాడివి, ఇంకా సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు, ఇలాంటివాటికి ఇంతంత ఖర్చు పెట్టకూ అని. నాన్న ఒక నిజమైన బ్రాహ్మణుడు, రేపటికి దాచుకోవటం మీద ఎప్పుడూ నమ్మకం లేని మనిషి. ఒకసారి స్కూల్లో సాధుపరిషత్ వాళ్ళ జాతీయ సభలు జరిగాయి. దానికి ఎంతోమంది సాధువులు వచ్చారు. వారిలో ఒక స్వామీజీ, సచ్చిదానంద భారతి, ఒక కేరళ సన్యాసి, సభలయ్యాక కూడా మా ఇంట్లోనే చాలాకాలం వుండిపోయారు. మాకు అందరికీ చదువు బాగా రావాలని సరస్వతీ మంత్రం, నేను ప్రత్యేకంగా కోరుకున్నందున రామ మంత్రం ఉపదేశం చేశారు. మా ఇంట్లో ఒక గది ఎప్పుడూ ఇలాంటి స్వామీజీలకో, లేకపోతే మా ఇంట్లో వుండి చదువుకునే పిల్లలకో కేటాయించబడి వుండేది. ఎప్పుడూ మా ఇంట్లో ఎవరో ఒకరు వుంటూనే వుండేవారు. మేము ఆరుగురమే వుండటం నాకు ఎప్పుడూ గుర్తు లేదు.   


మా స్కూల్ వాళ్ళకే వూరి బయట ఇంకో పెద్ద ఖాళీ స్థలం వుండేది. ఆ స్థలాన్ని సర్కస్ వాళ్లకి అద్దెకిచ్చేవాళ్ళు. దాంతో ఆ సర్కస్ వాళ్ళు స్కూల్లో టీచర్లకి, ప్రిన్సిపల్ కి ఫ్రీ టికెట్లు ఇచ్చేవాళ్ళు. వచ్చిన సర్కస్ లన్నీ ముందు వరుసలో కూర్చుని చూసేవాళ్ళం. భలే సరదాగా వుండేది. తెనాలి నాటకాలకి మహా ప్రసిద్ధి. స్కూల్ వాళ్ళే, అంటే, ఆ స్కూల్లో పనిచేసే టీచర్లు, మిగిలినవాళ్ళన్నమాట, మాస్కూల్లోనే నాటకాలు వేసేవాళ్ళు. బహుశా నాన్న తప్ప అందరూ నాటకాలు వేసేవాళ్ళేమో. అన్ని నాటకాలూ బాగా చూసేవాళ్ళం. కొన్ని పౌరాణిక నాటకాలు రాత్రి అంతా వేసేవాళ్ళు. తెల్లారిపోయేది నాటకం ముగిసేసరికి. గొప్ప గొప్ప నటులు కూడా ఇక్కడ మంచి కళాహృదయులున్నారని తెనాలి వచ్చి మరీ నాటకాలు వేసేవారు. బుఱ్ఱా సుబ్రహ్మణ్యశాస్త్రిగారని, గొప్ప నటుడు, ఆయన్ని నటి అనాలేమో, ఎందుకంటే ఆయన నాటకాల్లో ఆడవేషాలేసేవారు. సక్కుబాయి, చింతామణి, ద్రౌపది, చంద్రమతి వంటి  వేషాలకి ఆయన పెట్టింది పేరు. మా ఎదురింటి స్వామిశాస్త్రి గారింట్లో అద్దెకుండేవారు. ఆయనకు అయిదుగురు పిల్లలు. వాళ్లందరితో ఆడుకునేవాళ్ళం. ఆయన గొంతు కూడా ఒకరకం జీరతో వుండి స్త్రీ పాత్రలకి సరిపోయేది. ఎబ్బెట్టుగా, అతికించుకున్నట్టుగా వుండేది కాదు. సాంఘిక నాటకాలు చాలా తక్కువ వేసేవాళ్ళు. సినిమా యాక్టర్ నాగభూషణం వచ్చి తన రక్తకన్నీరు నాటకం కూడా ఆవూళ్ళో చాలాసార్లు వేశాడు. ఒకసారి నేను జూనియర్ కాలేజ్ లో వుండగా ఒక తెలుగు సెమినార్ కి విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు. నాన్న బెజవాడలో వున్నప్పుడు ఆయన స్టూడెంట్. ఆయన మా ఇంటికే వచ్చారు. నేను ఆయన కాళ్ళకి దణ్ణం పెట్టాను, పెద్దవాడని. అప్పుడు నిజం గానే ఆయన విలువ నాకు తెలియదు. సినిమాలు చూడ్డం తక్కువే. ఎప్పుడైనా నెలకో, రెండు నెలలకో ఒక సినిమాకి వెళ్ళేవాళ్ళం. అమ్మకి సినిమాలు చూడాలని వుండేది. నన్ను పిలిచి ఎక్కేసేది. దాంతో నేను నాన్నని గట్టిగా అడిగి సినిమాకి వెళ్ళేలా చేసేదాన్ని. బామ్మ ఎప్పుడూ మాతో సినిమాలకి, నాటకాలకి  వచ్చిన గుర్తు లేదు. 


                                                                ఆ స్కూల్లో పాట కచేరీలు కూడా ఎప్పుడూ జరుగుతూ ఉండేవి. ఒకసారి ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారి కచేరీ కూడా జరిగింది. ఆ వూళ్ళో వున్నప్పుడు ఆవిడ కచేరీలు రెండు, మూడు సార్లు విన్నాం. డీకే పట్టమ్మాళ్, డీకే జయరామన్ గార్ల కచేరీ కూడా విన్నాం. ఒకసారి ఆలయ పూజారుల సమావేశాలయితే దానికి ముఖ్య అతిధిగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వచ్చారు. ఆయన పూజారి అని అప్పుడే తెలిసింది. బాలమురళి కచేరీలు విన్నట్టు గుర్తు లేదు. ఈ ఇన్ ఫ్లుయెన్స్ తో నాన్న నన్నూ, భారతినీ సంగీతం నేర్చుకోవడానికి శ్రీ ములుకుట్ల సదాశివశాస్త్రిగారి దగ్గరకు పంపించాడు. ఆయన గొప్ప కర్నాటక సంగీత విద్వాంసుడు. హరికథలు అద్భుతంగా చెప్పేవారు. ఆరోజుల్లో ఆయన మా స్కూల్లో తెలుగు పండిట్ గా పనిచేసేవారు. ఆయనకు కుదరనప్పుడు వాళ్ళ చిన్న అబ్బాయి విశ్వనాథ శాస్త్రిగారు మాకు పాఠాలు చెప్పేవారు. వీణ కూడా అదే టైం లో నేర్చుకున్నాం. గాత్రంతో పాటు ఒక వాయిద్యం కూడా వుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయం. ఒక సంవత్సరం నేర్చుకునేసరికి మాకు సరళీస్వరాలు, జంటస్వరాలు, అలంకారాలు, స్వరజతులు, పిళ్ళారిగీతాలు పూర్తి చేసి వర్ణాలు మొదలుపెట్టాం. మోహన రాగంలో 'నిన్ను కోరీ..' కూడా మొదలెట్టినట్టు గుర్తు. అప్పుడే నేను టెన్త్ క్లాస్ కి రావటం, దాంతో చదువు దెబ్బ తింటుందని సంగీతం మానేయటం జరిగాయి. 


సంక్రాంతి వస్తే బొమ్మలు పెట్టేవాళ్ళం. బొమ్మల కొలువుల పేరంటాలకి నేనే ఎంతమంది ఇళ్లకో నడిచివెళ్లి మరీ పిలిచేదాన్ని.  ధనుర్మాసం అన్ని రోజులూ గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళం. ఈ ఆవుపేడ సేకరణ బాధ్యత మెయిన్ గా నామీదే వుండేది. ఈ పిడకలన్నీ రథసప్తమి రోజున పరవాన్నం వండటానికి, ఇంకా భోగిరోజున భోగిమంటలు వేయడానికి వాడేవాళ్ళం. గంగిరెద్దులూ, హరిదాసులూ, తప్పకుండా ఇంటింటికీ తిరిగేవారు. ఆ వూళ్ళో యాయవారం బ్రాహ్మణులూ యెక్కువే.  చక్కగా ధగధగా మెరిసేట్టు తోమిన ఇత్తడి చెంబు చేత్తో పట్టుకుని ఆనాటి తిధి, నక్షత్ర, వార, వర్జ్యాలని చెప్పుతూ 'సీతారామాభ్యోంనమః' అనేవాళ్ళు. ఇంట్లోంచి తప్పకుండా ఎవరో ఒకరు పిడికిలినిండానో, దోసిలినిండానో,  ఆ చెంబులో బియ్యం ముష్టి వేసేవాళ్ళం. అన్నట్టు ముష్టి అంటే అడుక్కోవటం కాదు, పిడికిలి అని అర్ధం. ఇది కాక వినోబాభావే శిష్యులు వచ్చేవాళ్ళు. వాళ్లకి తప్పకుండా బియ్యం వేయమని నాన్న ఆర్డర్. నాన్న మా ఇంట్లో బీద పిల్లలకి వారాలు ఇచ్చేవాడు. వారాలు అంటే వారంలో ఒక పూట వాళ్లకి ఆ ఇంట్లో ఉచితంగా భోజనం పెట్టటమన్నమాట. పేద పిల్లలు ఎవరైనా చదువుకోవడానికి పల్లెల నుంచి వస్తే వాళ్లకి స్కూల్ టీచర్లందరి ఇళ్ళల్లో, ఎక్కడో అక్కడ వారాలు దొరికే ఏర్పాటు చేసేవాడు. అలా మా ఇంటికి కూడా ఎందరో వారాలకి వచ్చేవాళ్ళు. అమ్మ పోయినప్పుడు కర్మలు చేసిన బ్రాహ్మణుడు అమ్మ ఫోటో చూస్తూనే 'ఈవిడ నాకు తెలుసు, లీలమ్మ గారు, నాకు తెనాల్లో వారాలు పెట్టింది' అని చెప్పాడు. "చేసిన పుణ్యము, చెడని పదార్ధము చేరును నీ వెంటా." దీపావళికి బుట్టలతో టపాకాయలు కొని కాల్చేవాళ్ళం. మతాబులు, చిచ్చుబుడ్లు మేమే తయారు చేసుకునే వాళ్ళం. సుమారు వారం, పదిరోజులపాటు టపాకాయలు కాల్చేవాళ్ళం. నాగుల చవితికి తప్పకుండా శివాలయంలో వున్న పెద్ద పుట్టలో పాలు పోసేవాళ్ళం. మా అమ్మ ఆరోజు ఉపవాసం వుండేది. పేరంటాలు శ్రావణ మాసంలో కూడా బోల్డు జరిగేవి. మంగళవారాలూ, వరలక్ష్మీ వ్రతాలూ అంటూ. వూళ్ళో అందరూ ఎప్పుడూ ఏదో ఒక హడావుడిలోనే వుండేవారు.  హోలీ పండుగకి ఒక్క పద్మసాలీలే రంగులు జల్లుకునేవాళ్ళు. అది ఆ వూళ్ళో కేవలం వాళ్ళ పండుగ, అంతే. వినాయక చవితికి నాన్న ఎన్నోరకాల పళ్ళు తెచ్చేవాడు. కొన్నిరకాల పళ్ళు అయితే కేవలం ఆ రోజుల్లోనే వచ్చేవి. వాటిల్లో పంపరపనస ఒకటి. వినాయకచవితి, దీపావళి, సంక్రాంతి మా పిల్లలందరికి నచ్చే పండుగలు. తెనాల్లో శ్రీరామనవమి పండుగ చాలా బాగా చేసేవాళ్ళు. వూరు మధ్యలో ఒక చిట్టాంజనేయస్వామి గుడి వుండేది. మామూలు రోజుల్లో చాలా సాదా సీదాగా, నిశ్శబ్దంగా వుండే ఆ గుడి శ్రీరామ నవమి రోజుల్లో, అంటే వసంత నవరాత్రుళ్ళలో, కోలాహలంగా వుండేది. ఊరంతా చలవ పందిళ్ళు, అంటే తాటాకు పందిళ్ళు, వేసేవాళ్ళు. అక్కడ శ్రీ రామనవమి రోజున వైభోగంగా సీతారామ కల్యాణం చేసేవాళ్ళు. అప్పుడు అక్కడ రకరకాల చిన్న చిన్న దుకాణాలు వెలిసేవి. ఆ దుకాణాల్లో పిల్లలందరం తప్పకుండా ఏదో ఒకటి కొనుక్కునే వాళ్ళం. కప్పలు అని టక్ టక్ మని శబ్దం చేసే ఇనప క్లిప్పు ఒకటి అమ్మేవాళ్ళు. అది తెచ్చి టక్ టక్ మని ఇల్లంతా హోరేత్తించేవాళ్ళం. ఆరోజుల్లో, ఆ వూళ్ళో ఎన్ని సరదాలో. మా బాల్యం మా పిల్లలకి లేదు. మా అమ్మా ఇలానే  అనేది. మా బాల్యం మీకు లేదు అని. తరాలు మారిపోతున్నాయి. అభిరుచులు, ఆటలు, పాటలు, ముచ్చట్లు, సరదాలు, సంబరాలు అన్నీ మారిపోతున్నాయి. పండుగలు కూడా మారిపోతున్నాయి. కొత్తరకం పండుగలకి ఎక్కువ ప్రచారం జరుగుతోంది.  



                                            వివేక్ స్కూల్లో చేరే వయసు వచ్చేసరికి నాన్నా, కృష్ణప్రసాదుగారూ మరికొందరూ కలిసి కంచి స్వామి వారి ఆశీస్సులతో 'వివేకానంద విద్యామందిర్' అని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు. కృష్ణప్రసాదుగారి అబ్బాయి, శరత్, కూడా మా బాబు వయసు వాడే. శరత్ చదువుకోసం వాళ్ళంతా తెనాలి వచ్చేశారు. ఆ వివేకానంద విద్యామందిర్ లో మొదటి స్టూడెంట్ మా వివేకానందే. 


                                     మేము అక్కడున్న రోజుల్లోనే సెపరేట్ స్టేట్ కావాలని ఆందోళన మొదలయ్యింది. మేమంతా కూడా రాష్ట్రం రెండుగా విడిపోవాల్సిందే అంటూ చాలా రోజులు స్ట్రైక్ చేశాం. నా ఇంటర్ పరీక్షలు మార్చ్ లో జరగాల్సినవి సెప్టెంబర్ లో జరిగాయి. అసలు ఆ సంవత్సరం పోతుందని భయపడ్డాం. చాలా రోజులు ఈ స్ట్రైక్ వాళ్ళ స్కూల్ వుండేది కాదు. అప్పుడు నేను, అమ్మ, కృష్ణప్రసాదుగారి భార్య జయమ్మ గారు ప్రైవేటుగా హిందీ రాష్ట్ర భాష పరీక్షలు రాసి పాస్ అయ్యాం.  


                                              తెనాల్లో వున్న రోజుల్లో సెలవల్లో ఎవరో ఒకళ్ళు బంధువులు వచ్చేవాళ్ళు. ఒక్కసారి రెండు మూడు కుటుంబాల వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అత్తయ్యలో, పిన్నులో, పిల్లలతో వచ్చేవాళ్ళు. ఇంక ఇల్లంతా గోల గోల. టాప్ లేపేసేవాళ్ళం. ఖబుర్లు, ఆటలు, పాటలు, పిండి వంటలు, ఎన్ని సరదాలో. ఈ రోజుల్లో ఎవరైనా ఒకరు భోజనానికి వస్తారంటే కొందరు భయపడుతున్నారు, కొందరేమో ఒకరోజు చేసి సంవత్సరమంతా చెప్పుకుంటున్నారు. మరి కొంతమందేమో, మా సువర్చల అత్తయ్యలాంటి వాళ్ళు, అలవోకగా అరడజను పదార్ధాలు క్షణాల్లో చేసిపెట్టేస్తున్నారు. రోజులు మారాయ్, బాగా మారాయ్, ఎంతో మారిపోయాయ్. వచ్చిన బంధువులకి అమ్మ బట్టలు కూడా పెట్టేది. మేమేక్కడికైనా వెళ్ళడం చాలా తక్కువ. ఎవరైనా మా ఇంటికి రావడమే ఎక్కువ.  కానీ ప్రతి సంవత్సరం మా తాతగారి తద్దినం, ఆరాధన వచ్చినప్పుడు మాత్రం అందరం విజయవాడ ఉమా పెద్దనాన్నగారింటికి వెళ్ళేవాళ్ళం. మేమే కాదు, అప్పుడు అందరూ అక్కడికి వచ్చేవారు. పెద్దవాళ్ళకేమో కానీ, మాపిల్లలకు మాత్రం అది కూడా మరో పండుగ లాగానే వుండేది. యెంత ఎదిగినా ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మరిచిపోలేం. కానీ తమాషా ఏంటంటే అవి తల్చుకోవటానికి ఎవరికీ తీరికా లేదు. బహుశా ఏ అమెరికానో, ఆస్ట్రేలియానో   'చైల్డ్ హుడ్ డే'  అని ఒకరోజు ప్రకటిస్తే అప్పుడు అందరం ఆ రోజు సెలెబ్రేట్ చేసుకుంటామేమో.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి