13, ఆగస్టు 2015, గురువారం

మా నాన్న ఉద్యోగాలూ, ఊళ్ళు తిరగటాలూ

మా నాన్న ఉద్యోగాలూ, ఊళ్ళు తిరగటాలూ 

 భట్టిప్రోలు విజయలక్ష్మి

                                           మానాన్న తన కెరీర్ లో చాలా ఉద్యోగాలు మారాడు. ప్రతిసారీ పైమెట్టుకే  ఎక్కాడు. దానితో చాలా ఊళ్ళు తిరిగాం. ఈ ఉద్యోగపర్వంలో మొదటిమజిలీ కానుమోలో, ఆరుగొలనో అయితే చివరిమజిలీ హైదరాబాదు. కానుమోలు ఉద్యోగానికి రోజూ సైకిల్ మీద వెళ్లి వచ్చేవాట్ట. టీచర్ గా పనిచేస్తూ కూడా నిక్కర్లు వేసుకుని తిరిగేవాట్ట. కొన్నాళ్ళు శ్రీదేవి పిన్నికీ, రోహిణీ పిన్నికీ కూడా స్కూళ్ళల్లో పాఠాలు చెప్పినట్టు గుర్తు. బీయే, బీయీడీ అయ్యాక, పెళ్లి అయ్యాక, బెజవాడ మునిసిపాలిటీలో గాంధీ మునిసిపల్ హైస్కూల్ లో లెక్కల టీచర్ గా వుద్యోగంలో చేరాడు. అదేస్కూల్లో నాన్నతోపాటు నాగేశ్వరరావుగారు, అవధానిగారూ కూడా పని చేసేవారు.  నాన్నకి కొన్నాళ్ళు ఆ స్కూల్లో చేసాక ఎందుకో ఆపని నచ్చలేదు. లీన్ తీసుకుని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, రాయగడ అనే వూర్లో మళ్ళీ మాథ్స్ టీచర్ గా చేరాడు. ఈ రాయగడ ప్రస్తుతం రాష్ట్రాల విభజనల్లో చత్తీస్ గధ్ రాష్ట్రంలోకి వచ్చింది. లీన్ లో వుంటే వుద్యోగం పోదు. కొత్తచోట నచ్చకపోతే తిరిగి పాత ఉద్యోగంలో చేరచ్చు. అదీ అందులో వెసులుబాటు. నాన్న ఆ వూళ్ళో ఒక సంవత్సరం వున్నాడు. మళ్ళీ తిరిగి బెజవాడ తిరిగివచ్చి గాంధీ మునిసిపల్ హైస్కూల్లో చేరాడు. తనకి ఆ మేనేజ్ మెంట్ తో వచ్చిన ప్రాబ్లం అప్పటికి తీరిపోయింది అనుకుంటాను. రాయగడ అనుభవం ఒక్కటి చెప్పేవాడు. అదేమిటంటే, తానూ అక్కడ పని చేస్తున్న రోజుల్లోనే అక్కడ ఎన్నికలు జరిగాయిట. నాన్నకి హిందీ బాగా రాదనీ నాన్నని వెయిటింగ్ లిస్టులో పెట్టి వేరే వాళ్ళందరికీ డ్యూటీలు వేశారుట. కానీ ఈ వైటింగ్ లిస్టుకే ఎక్కువ పని తాకిడి తగిలి అన్ని రోజులూ ఎలెక్షన్ డ్యూటీ పడిందట. అక్కడ ఉన్నప్పుడే నాన్న బాగా హిందీ నేర్చుకున్నాడు. 

                                             ఎందుకో గాంధీ మునిసిపల్ స్కూల్ ఉద్యోగంలో నాన్న అంత హాయిగా, ఇష్టంగా లేడు. కానీ నాన్న చివరిదాకా తన స్నేహితులు నాగేశ్వరరావుగారు, అవధానిగార్లని మరిచిపోలేదు, వదలలేదు. అదే సమయంలో మేము అద్దెకి ఉంటున్న ఇంటి ఓనర్ జంధ్యాల భగవచ్చాస్త్రి గారు తెనాల్లో ఆయనకీ తెలిసిన వాళ్ళ ఎయిడెడ్ స్కూల్లో హెచ్ యెమ్ పోస్ట్ వున్నదనీ, దానికి అప్లై చెయ్యమనీ చెప్పారు. నాన్న ఆ పోస్టుకి అప్లై చెయ్యటం, ఆ జాబ్ రావటం, వెంటనే దాంట్లో జాయిన్ అయిపోవటం జరిగిపోయాయి. అమ్మ చెప్పేది, అసలు విజయవాడ నుంచి కదులుతామని అనుకొలెదని. కానీ ఒక నెల రోజుల ముందర ఎవరో ఒక సోదెమ్మ వచ్చి అమ్మ యెంత వద్దన్నా లోపలి వచ్చి అమ్మకి సోది చెప్పిందిట, ఒక నెల రోజుల్లో వూరు మారి వేరే చోటికి వెళ్తారని. అమ్మ నమ్మలేదుట, అలాంటివన్నీ గాలి కబుర్లని. కానీ నెలరోజులకే నాన్న తెనాల్లో తాలూకా హైయ్యర్ సెకండరీ స్కూల్లో చేరటం, కుటుంబం అంటా కొత్త వూరికి వెళ్లిపోవటం జరిగాయట. ఆ స్కూల్లో ఆ రోజుల్లో వైదీకి, నియోగి రాజకీయాలు ఉండేవి. మేము నియోగులం. ఆ స్కూల్ సెక్రటరీ వైదీకులు. అయినా అన్ని వ్యవహారాలూ సవ్యంగానే జరిగేవి. ఏ విభేదాలూ, ఇబ్బందులూ రాలేదు. సుమారు మూడువేలమంది విద్యార్దులున్న స్కూలు అది. స్టాఫే వందమంది వుండేవాళ్ళు. నాన్న తన అడ్మినిస్ట్రేటివ్ కాలిబర్ సంపూర్ణంగా ప్రదర్శించిన, ప్రకటించిన రోజులవి. కొంతమంది ఉపాధ్యాయులు సమస్యలు సృష్టిస్తే, కొంతమంది విద్యార్ధులు గూండాల్లా వుండేవారు. నాన్న ఎవ్వర్నీ లెక్క చేసేవాడు కాదు. ఎవ్వరికీ భయపడే వాడు కాదు. తన కన్నా పైవాళ్ళైనా అంతే, కింద వాళ్ళైనా అంతే. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడ ఉంచేవాడు. అందరికీ నాన్నంటే, భయం, భక్తీ, గౌరవం, మర్యాదా, ప్రేమా ఏర్పడ్డాయి. చివరి దాకా అవి అన్నీ నిలిచాయి. 

                                     మా తెనాలి రోజుల గురించి చాలా రాయాలి, ఎందుకంటే, మా జీవితాల్లో, చాలా ముఖ్యమైన బాల్యం అక్కడ గడిచింది. మేమందరం ఎన్నో నేర్చుకున్న, అనుభవించిన సరదాలూ, సంతోషాలూ, విచారాలూ, దుఃఖాలూ, ఎన్నో, ఎన్నెన్నో. ఆ తెనాలి ముచ్చట్ల కోసం విడిగా కొన్ని భాగాలు రాస్తాను. తెనాలి తాలూకా హైయ్యర్ సెకండరీ స్కూల్ విద్యా విధానంలో మార్పుల వల్ల జూనియర్ కాలేజ్ గా మారింది. ఆ మార్పు నాన్న ఆధ్వర్యంలో జరిగింది. నాన్న ఆ స్కూలుని జూనియర్ కాలేజ్ గా మార్చటానికి చాలా శ్రమించాడు. మా చిన్నపాపాయి కూడా ఆరోజుల్లోనే పోయింది. జూనియర్ కాలేజ్ గా మారటానికి కొత్త బిల్డింగులు కట్టాల్సి వచ్చింది. కొత్త లేబరేటరీలు కావాల్సి వచ్చాయి. వాటన్నింటికీ చాలా ఫండ్స్ కావాల్సి వచ్చాయి. నాన్న, మరికొందరు వూర్లో తిరిగి చందాలు సేకరించారు. ప్రతి పైసా లెక్క గట్టి బ్యాంక్ లో వేసేవాడు, అదీ వుమ్మడి ఖాతాలో. నాన్న పేరు, స్కూల్ సెక్రటరీ పేరుతో ఆఖాతా వుండేది. నాన్న చాలా నిజాయితీగా ఉండటంతో ఆడబ్బులు తమ నిర్వహణలోనే  ఉండాలనుకునే వారికి ఇబ్బందయ్యింది.  నాన్న మాత్రం నన్ను నమ్మి చందాలిచ్చిన వారి డబ్బులు దుర్వినియోగం కాకూడదని పట్టు పట్టి, చాలా రోజులు ఎంతో నలిగిపోయాడు. చివరకు తన సంతకం తప్పనిసరి అయినప్పుడు, తప్పించుకోవటానికి ఓ నెల రోజులు సెలవు పెట్టేశాడు. దానితో ఆ వ్యక్తులందరికీ గొంతులో వెలక్కాయ పడింది. ఆ రోజుల్లో నాన్న చాలా దిగులుగా కనిపించేవాడు. పెద్ద కూతురుగా నేనేం చేయగలను అని ఆలోచించేదాన్ని. నేనప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో వున్నాను. ఆరోజుల్లో మాకు హిందూ న్యూస్ పేపర్ వచ్చేది. నేను పొద్దున్నే పేపర్ చదివేసేదాన్ని, ఎడ్వర్ టైజ్ మెంట్లతో సహా. అలా ఒక రోజు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వాళ్ళ ప్రకటన చదివాను. అది వెంటనే పరిగెత్తుకుని నాన్న దగ్గరకు వెళ్లి 'నాన్న, ఇది నీకు సరిగ్గా సరిపోతుంది. వెంటనే అప్లై చెయ్యి' అన్నా. నాన్న కూడా అప్పటికి అది చూడలేదు. పైగా వుద్యోగం మారటం, అందులోనూ ఇప్పుడు జిల్లా కాదు, ఏకంగా రాష్ట్రం మారిపోవాల్సి రావటం కాస్త ఆలోచనలో పడ్డాడు. అప్పటికే మా బామ్మ పోయింది. ఆవిడే వుంటే ఎలా ఉండేదో. ఇప్పుడు ఆవిడ బాధ్యత లేకపోవడంతో నాన్న కొంచం స్వతంత్రించి నిర్ణయం తీసుకోగలిగాడు. పైగా అది సెంట్రల్ గవర్నమెంట్ వుద్యోగం. పే స్కేళ్ళు బావుంటాయి, ఇంక్రిమెంట్లు ఆటోమేటిగ్గా పెరుగుతాయి. నాన్న అన్నీ ఆలోచించి ఎస్ అన్నాడు. అప్లై చేయటం, సెలెక్ట్ అవటం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. నాన్నని ఒరిస్సా లోని సంబల్ పుర్ వేశారు. తెనాలి నుంచి రిలీవ్ అయ్యేటప్పుడు నాన్నకి రావాల్సిన బకాయిలన్నీ, ఎమ్మీడీ ఇంక్రిమెంట్లతో కూడా శాంక్షన్ చేసి పంపించారు ఆ స్కూలు వాళ్ళు. అప్పటికి నా ఇంటర్ పరీక్షలు కాకపోవటంతో నన్ను మా ఇంటి ఓనర్ కృష్ణ ప్రసాదు గారింట్లో వుంచి మిగిలిన అందరూ మొదటిసారి రైలు ఎక్కి సంబల్ పుర్ వెళ్ళారు. ఇక్కడితో తెనాలి అధ్యాయం ముగిసి సంబల్ పుర్ అధ్యాయం మొదలైంది.  

2 కామెంట్‌లు: