బామ్మా - బంగారం
భట్టిప్రోలు విజయలక్ష్మి
అమ్మ బంగారం షాపు నుంచి రెండు సన్నని ముత్యాల గొలుసులు తెచ్చి, నాన్నకీ, బామ్మకీ చూపించి, నాకూ భారతికీ మెడల్లో వేసింది. మా అమ్మ కళ్ళు మెరిసిపోయాయి. 'ఎంత బాగున్నాయో, గొలుసులు, నాజూగ్గా, ముత్యాలు మెరుస్తున్నాయి కూడానూ' అంది అమ్మ. మా అమ్మకి ముత్యాలంటే ఇష్టం. 'అదేమిటి బంగారం గొలుసులు చేయించలేదా,' అని బామ్మ అడిగింది. ముత్యాల్లో బంగారమేనండీ, ఇద్దరికీ కలిపి కాసులో అయిపోయింది. అదే, మొత్తం బంగారం అంటే, చెరో మూడు కాసులూ కావాల్సొచ్చేది.' అంది అమ్మ. నాన్న కూడా, "పిల్లల మెడల్లోకి గొలుసులు ఉండాలి, పెద్దమనిషైన ఆడపిల్లలు తండ్రి ఎదుట బోసిగా తిరక్కూడదు అన్నావుగా. అందుకే ఈ గొలుసులు చేయించా" అన్నాడు నాన్న. నాన్న స్తోమత అంతే మరి. యెంత ప్రిన్సిపాల్ అయినా, ఎప్పుడూ ఇల్లంతా చదువుకో, ఉద్యోగానికో వచ్చి ఏళ్ల తరబడి ఉండిపోయేవాళ్లు, వచ్చే పోయే బంధుగణం, వారాలబ్బాయిలూ, ఇవన్నీ కాక మా నాన్నకి కొత్తగా తెనాలి వచ్చాక అలవాటైన స్వామీజీల పట్ల భక్తి, స్నేహం వగైరా. ఈ విషయం ఒక్కటే ఒక్క పోస్ట్ రాయాలి. వీటన్నింటి వల్ల నాన్న దగ్గర ఎప్పుడూ అప్పే గానీ డబ్బు ఉండేది కాదు. పైగా, అప్పు ఉండటం ఏదో క్వాలిఫికేషన్ లాగా ఫీల్ అయ్యి, "పుష్పగిరి స్వాములారు కూడా చెప్పారు, 'శర్మా, నీకు చచ్చిపోయే దాకా కూడా అప్పు వుంటుందీ' అని సమర్ధించుకునేవాడు. ఈ గొలుసులు కూడా అప్పే అయుంటాయి.
బామ్మ థీరీ ప్రకారం, ఆడపిల్లలు పెద్దమనిషయ్యాక బోసి మెడతో తండ్రి ఎదట తిరక్కూడదు. అలా తిరిగితే తండ్రికి ఆయుక్షీణం. మా నాన్నేమో, 'చేయిస్తానే, బంగారం ధర కొంచెం తగ్గనీ', అనేవాడు. ఇది మా ఇంట్లో, బామ్మకి నాన్నకీ ఎప్పుడు కాస్త తీరిక దొరికినా జరిగే సంభాషణ. ఇప్పటితో పోలిస్తే, అప్పటి బంగారం ధర చాలా చాలా తక్కువ. కానీ అది కూడా ఆ రోజుల్లో నాన్నకి అందుబాటులో లేని ధర. ఇలా కొన్నేళ్లపాటు ఆ రికార్డు అరిగిపోయేదాకా తిరిగాక, అప్పటికి నా తరువాత భారతీ పెద్దమనిషయ్యింది, మొత్తానికి ఈ ముత్యాల గొలుసులు ఇంటికి చేరాయి. ఇంటికి చేరాయన్నమాటే కరెక్ట్, ఎందుకంటే, ఏదో వచ్చిన రోజు మెళ్ళో వేసినా, ఓ గంట కల్లా వాటిని తీసేసి, బీరువాలో పెట్టేసారు మరి. మళ్ళీ మేమిద్దరం యధాప్రకారం బోసిమెడతో నాన్నకీ, బామ్మకీ యెదుటపడి తిరగటం. బామ్మ చెప్పీ, చెప్పీ ఊరుకుంది. కానీ బాధపడేది. పిల్లలకి ఇంత బంగారం పెడదామంటే, కుదరటం లేదే, అని బాధపడేది. ఓ రోజు నేను, 'బామ్మా, ఏమిటి బంగారం అంత ముఖ్యమా, నీకు అసలు బంగారమే లేదు కదా,' అని అడిగితే బోల్డు కబుర్లు చెప్పింది. నిజంగానే బామ్మ ఒంటిమీద చిన్నం ఎత్తు బంగారం ఉండేది కాదు. ఈ చిన్నం ఎత్తు అంటే నాక్కాట్టే తెలియదు కానీ, బామ్మ మాత్రం ఎప్పుడూ అతి తక్కువ బంగారం కొలత చెప్పాలంటే 'చిన్నం' అనేది. అన్నట్టు నాకు కాసు, తులం కాకుండా మరో బంగారం కొలత కూడా తెలుసు. అదేమిటంటే, మాడ. మా నందివాడ వారి ఇళ్లల్లో మంగళసూత్రాన్ని మూడు మాడలెత్తు బంగారంతో చేయిస్తారు. ఈ రోజుల్లో కంసాలులని వెళ్లి అలా అడిగితే తెల్లమొహం వేస్తారేమో. మా బామ్మ వంటిమీద చిన్నం ఎత్తు బంగారం లేకపోయినా సరే, బామ్మ ఠీవీ, దర్జాలలో మాత్రం ఏ తేడా ఉండేది కాదు. విత్ ఆర్ వితౌట్ బంగారం.... బామ్మ బామ్మే. చక్కటి తెల్లటి పంచెలో మెరిసిపోయేది. ఆ ముఖంలో కాన్ఫిడెన్స్ చూసి తీరాల్సిందే. అది కదా అసలు సిసలైన వుమన్ ఎంపవర్మెంట్ అనిపిస్తుంది నాకిప్పటికీ. సరే, మన బంగారం కథకొద్దాం.
బామ్మ అడిగితే తన బంగారం వివరాలు బోల్డు చెప్పేది. అడక్కపోతే అసలు ఆ ఊసే ఎత్తేది కాదు. మంచం మీద పడుకొని 'నామస్మరణా ధన్యోపాయం, నహి పశ్యామో భవతరణే, రామ హరే, కృష్ణ హరే....' అని పాడుకుంటూ ఉండేది. నేనే తీరిగ్గా వున్నప్పుడు వెళ్లి, 'బామ్మా, నీకు బంగారం యేమేముండేది చెప్పు' అంటే, అప్పుడు చిట్టా విప్పేది. కంఠే, కాసులపేరూ, చంద్రహారం, పలకసర్లూ, కాసికాయ గుళ్ళు, వడ్డాణం, వంకీలు, నెక్లేసులు, డజన్ల గాజులు, వంకీ గాజులు, బోల్డు ఉంగరాలు, దుద్దులూ.... అంటూ ఏవో నోరు తిరగని పేర్లతో ఓ లిస్ట్ చెప్పేది. కంఠె అంటే ఏమిటి బామ్మా అంటే, అది ఒక రౌండ్ రింగ్ లాగా కంఠానికి కడియం లాగా ఉంటుంది. కంఠానికి వేసుకుంటాం కనుకే, దానిపేరు కంఠె, అని చెప్పింది. ఏమో, నేను మాత్రం పాత సినిమాల్లో తప్ప కంఠె ఎప్పుడూ ఎవరూ పెట్టుకోగా చూడలేదు. 'పెద్ద ట్రంకు పెట్టె నిండా వెండి బంగారాలు తెచ్చుకున్నా, తెలుసా', అనేది. 'మరి ఇప్పుడు అవన్నీ ఏవి బామ్మా' అంటే, ' బావుందే, డజను మంది పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ ఎలా అయ్యాయి మరి' అన్నది. పొలం ఉందిగా, 'వ్యవసాయం చేసేదానివిగా' అంటే, "దాంతో ఏదో తిండీ, బట్టా నడిచేవి అంతే, పైగా ఆడ వ్యవసాయం. మీ తాతయ్యేమో, ఆయన పూజలూ, హోమాలూ, నిత్యాగ్నిహోత్రాలూ, వేదపాఠాలూ, పఠనాలూ అంటూ కూర్చునేవారు. ఇంత సంసారం..... దాంతో నాకు తప్పేది కాదు. అక్కడికీ మా ఆడబడుచు ఇంట్లో వుండి అన్నిట్లో తోడు ఉండేది కనుక ఆ మాత్రమైనా జరిగింది. అయినా మీ తాతగారి ఆచారానికి ఆవిడ వండితే పనికొచ్చేది కాదు. విధవరాలు కదా. అందుకని నేనే పిల్లలకి స్నానాలూ అవీ చేయించాక చంటి పిల్లలని పాలిచ్చి పడుకోపెట్టి, పెద్దపిల్లలకు చద్దన్నాలు పెట్టీ, తరువాత మడి కట్టుకునేదాన్ని. వంటంతా అయ్యేవరకూ పిల్లలు లేచేవాళ్ళు కాదు. అప్పటికీ మీ తాతగారి పూజ అయితే, మహానైవేద్యం పెట్టి, భోజనాలన్నీ అయ్యాక, అప్పుడు కానీ పైపనికి కుదిరేది కాదు." అంటూ పెద్ద పాఠం చదివేది.
ఇంతకీ నీ బంగారం ఏం చేసావ్ చెప్పు అంటే, "నలుగురు ఆడ పిల్లలకి పెళ్లి చేశామా, అందుకు కొంత బంగారం ఖర్చయిపోయింది. ఆ తరవాత మగపిల్లల చదువులకి కొంత బంగారం ఖర్చయిపోయింది. అందరినీ డిగ్రీ దాకా చదివించాం కదా. నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం పొలం కూడా అమ్మేసాం. సరైన రాబడి లేక, నేను చెయ్యలేక, చేసేవాళ్ళు లేక అమ్మేసా. పిల్లలు వ్యవసాయం కన్నా చదువు మీదే ఎక్కువ శ్రద్ధ చూపించేవాళ్ళు. పోన్లే, వాళ్ళనైనా చదువుకుని బాగుపడనీ, అని పొలం చాలావరకు అమ్మేసాం. ఒక్కో చదువుకు ఒక్క బంగారువస్తువు వెళ్లిపోయేది. నా వేలి చిట్ట చివరి ఉంగరం కూడా కొత్త కాపురం పెట్టాలమ్మా అంటే, మా అబ్బాయికి ఇచ్చేసా. అదే నా చివరి వస్తువు, అంతే. తరువాత మీ నాన్న పెళ్లి అవుతూనే, ఇక లాభం లేదని, వూళ్ళో మిగిలిన పొలం కూడా అమ్మేసి అందరం బెజవాడ చేరుకున్నాం. ఆ తరువాత అంతా ఆ ఉన్న దాంతో, మీ నాన్నా, హరీ, సాంబుడూ తెచ్చిన దాంతో జరిగేది. పోన్లే, పిల్లలందరూ పైకొచ్చారు. సంతోషం" అనేది. బంగారం లేదని దిగుల్లేదా బామ్మ అంటే, దిగులెందుకే, ఏం తీసుకుపోతాం కనక, అని ఎదురు ప్రశ్న వేసేది. 'లక్షాధికారియైన లవణాన్నమే గాని బంగారు కణికలు మింగబోడు' అని వేదాంతం చెప్పేది. ఎప్పుడూ నిర్విచారంగా ఉండేది. ట్రంకు పెట్టెడు వెండి, బంగారాన్ని, పండించే పొలాన్నీ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం మరో ఆలోచన లేకుండా అమ్మేయగలిగింది బామ్మ. అప్పటికి తాతగారు లేరు.
తాతగారు సంస్కృత పండితుడు. మంచి వేద పండితుడు. తన పూజా, పాఠం తప్ప మరేవీ పట్టేవి కావని బామ్మ .అంటూండేది. వాళ్ళ అప్పగారు ఆదెమ్మగారు (ఈవిడ అక్కో, చెల్లెలో ఖచ్చితంగా తెలియదు. పెద్ద పెద్దనాన్న రెండురకాలుగానూ రాశారు. ఒకచోట అప్పగారు అని రాస్తే, వంశవృక్షం లైన్లో తాతగారి తరువాత ఆవిడ పేరు రాశారు. లక్ష్మీ నరసమ్మ గారు మాత్రం ఖచ్చితంగా చెల్లెలే) ఇచ్చిన పొలం కూడా చేసుకోలేక పోయేవారు. ఏదో కోర్ట్ లావా దేవీల్లో కోర్టులో హాజరయినప్పుడు, జడ్జిగారు, 'నువ్వు పుట్టు శాస్త్రివా, పెట్టు శాస్త్రివా' అని అడిగారట. దానికి మా తాతగారు, 'నేను పుట్టు శాస్త్రి నేనండీ' అని చెప్పారట. ఈ విషయం బామ్మా, అమ్మా, నాన్నా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆయన ఏనాడూ ఏ యాత్రలూ చెయ్యలేదు. ఇంట్లో వైశ్వదేవం, నిత్యాగ్నిహోత్రం, వేద పారాయణం వగైరా ఉండేవి. ముగ్గురు, నలుగురు వేద విద్యార్థులకి వేదం బోధించేవారుట. మా తాతగారు పోయిన తరువాత కూడా ఈ శిష్యులు ఆయన ఆరాధనకి భోక్తలుగా వారంతట వారే వచ్చేవారు. ఆయనకి తన 62 వ ఏట సన్న్యాసం తీసుకోవాలనే కోరిక కలిగింది. అలా సన్న్యాసం తీసుకుంటే తన ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం ఏర్పడింది. కానీ దానికి బామ్మ ఒప్పుకోలేదుట, మగతోడు లేకుండా ఇంత సంసారం ఎలా అని. తాతగారు మాత్రం సన్న్యాసం కోసం చాలా పంతం పట్టారుట. అలా మూడేళ్లు గడిచాయి. ఈ లోపల ఆ కోర్ట్ కేసు ఎవరిపైనైతే గెలిచారో వారు భోక్తగా పిలిచేసరికి వారింటికే భోజనానికి వెళ్లారుట. బామ్మ యెంత వద్దన్నా వినలేదుట. ఓ మూడు రోజుల తరువాత సాంబాబాయ్, శ్రీధర్ బాబాయ్ లతో కలిసి పొలం వెళ్లి తిరిగి వస్తుంటే ఓ కాలువలో పడిపోయారుట. లేచి ఎలాగో ఇంటికి చేరారు కానీ, పక్షవాతం వచ్చి, మాటా, కాలూ పడిపోయాయిట. మరి ఇక లేవలేదు. అల్లాగే మూడేళ్లు వున్నారుట. బామ్మ ఒప్పుకోగా, చివరి రోజుల్లో ఆతుర సన్న్యాసం తీసుకున్నారు. ఆ కుటుంబంలో అందరూ కూడా తరతరాలుగా ఆతుర సన్న్యాసం తీసుకున్నవాళ్ళే. మా పెద్ద పెదనాన్న కూడా ఆ పరంపరలో ఆతుర సన్న్యాసం తీసుకున్నారు. చివరి రోజుల్లో సాంబాబాయ్ కూడా ఆతుర సన్న్యాసం తీసుకున్నాడా, ఏమో....
బామ్మ పాపం, అన్నీ తట్టుకుంది. ఆడదాన్నని అలుసు చేస్తారేమో అనే భయంతో, నోరెట్టుకుని సంసారాన్ని లాక్కు వచ్చింది. ఇన్నేళ్లయినా మా కుటుంబంలో మా అందరి మధ్యా ఇంత ప్రేమా, ఆపేక్షా వున్నాయంటే, అది ఆవిడ చలవే. పెట్టెడు బంగారం వున్నా, ఆవిడకి దానిమీద లోభం, మమత లేవు. బంగారం కన్నా చదువులకే ప్రాధాన్యత నిచ్చింది. పిల్లలకు వ్యవసాయం మీద ఆసక్తి లేదని గ్రహించి, వాళ్లకు నచ్చిన చదువులు చదివించింది. పై చదువులు, వాళ్ళే చదువుకున్నారు. తనకి స్త్రీ ధనంగా వచ్చిన పొలం మీదా అది తనదే అన్న భావన లేదు. ఒంటి నిండా బంగారం వున్నా, లేకున్నా ఒకేలా ఉండేది. అదీ ఆవిడ కారెక్టర్. తనకేమీ మిగుల్చుకోకపోతే పెద్ద వయసులో పిల్లలు చూడరేమో అన్న బెంగ ఆవిడకి ఏనాడూ లేదు. తన పెంపకం మీద అంత నమ్మకం ఆవిడకి. ఏనాడూ, పిల్లలే తన దగ్గరున్నట్టు ఫీల్ అయేది కానీ, తానూ పిల్లల దగ్గర ఉన్నట్టు ఫీల్ అయ్యేది కాదు. వంట ఇల్లు వదిలాక కాస్త ఆవిడ పెత్తనం తగ్గింది. అయినా ఏనుగు ఏనుగే అన్నట్టు, బామ్మ బామ్మే. అదే బామ్మ. అదీ బామ్మ. దట్ ఈజ్ బామ్మ. అందరూ భయంగా భక్తిగా 'వియ్యమ్మగారూ' అని గౌరవించే బామ్మ, దగ్గర వాళ్ళు ప్రేమగా, ఆప్యాయంగా 'వియ్యాం' అని పిలుచుకునే బామ్మ. ఆరుగొలనులో పొలం గట్టు మీద నుంచుని పని చేయించిన మొదటి లేడీ రైతు బామ్మ. నందివాడ విజయరామమ్మ.
అమ్మ బంగారం షాపు నుంచి రెండు సన్నని ముత్యాల గొలుసులు తెచ్చి, నాన్నకీ, బామ్మకీ చూపించి, నాకూ భారతికీ మెడల్లో వేసింది. మా అమ్మ కళ్ళు మెరిసిపోయాయి. 'ఎంత బాగున్నాయో, గొలుసులు, నాజూగ్గా, ముత్యాలు మెరుస్తున్నాయి కూడానూ' అంది అమ్మ. మా అమ్మకి ముత్యాలంటే ఇష్టం. 'అదేమిటి బంగారం గొలుసులు చేయించలేదా,' అని బామ్మ అడిగింది. ముత్యాల్లో బంగారమేనండీ, ఇద్దరికీ కలిపి కాసులో అయిపోయింది. అదే, మొత్తం బంగారం అంటే, చెరో మూడు కాసులూ కావాల్సొచ్చేది.' అంది అమ్మ. నాన్న కూడా, "పిల్లల మెడల్లోకి గొలుసులు ఉండాలి, పెద్దమనిషైన ఆడపిల్లలు తండ్రి ఎదుట బోసిగా తిరక్కూడదు అన్నావుగా. అందుకే ఈ గొలుసులు చేయించా" అన్నాడు నాన్న. నాన్న స్తోమత అంతే మరి. యెంత ప్రిన్సిపాల్ అయినా, ఎప్పుడూ ఇల్లంతా చదువుకో, ఉద్యోగానికో వచ్చి ఏళ్ల తరబడి ఉండిపోయేవాళ్లు, వచ్చే పోయే బంధుగణం, వారాలబ్బాయిలూ, ఇవన్నీ కాక మా నాన్నకి కొత్తగా తెనాలి వచ్చాక అలవాటైన స్వామీజీల పట్ల భక్తి, స్నేహం వగైరా. ఈ విషయం ఒక్కటే ఒక్క పోస్ట్ రాయాలి. వీటన్నింటి వల్ల నాన్న దగ్గర ఎప్పుడూ అప్పే గానీ డబ్బు ఉండేది కాదు. పైగా, అప్పు ఉండటం ఏదో క్వాలిఫికేషన్ లాగా ఫీల్ అయ్యి, "పుష్పగిరి స్వాములారు కూడా చెప్పారు, 'శర్మా, నీకు చచ్చిపోయే దాకా కూడా అప్పు వుంటుందీ' అని సమర్ధించుకునేవాడు. ఈ గొలుసులు కూడా అప్పే అయుంటాయి.
బామ్మ థీరీ ప్రకారం, ఆడపిల్లలు పెద్దమనిషయ్యాక బోసి మెడతో తండ్రి ఎదట తిరక్కూడదు. అలా తిరిగితే తండ్రికి ఆయుక్షీణం. మా నాన్నేమో, 'చేయిస్తానే, బంగారం ధర కొంచెం తగ్గనీ', అనేవాడు. ఇది మా ఇంట్లో, బామ్మకి నాన్నకీ ఎప్పుడు కాస్త తీరిక దొరికినా జరిగే సంభాషణ. ఇప్పటితో పోలిస్తే, అప్పటి బంగారం ధర చాలా చాలా తక్కువ. కానీ అది కూడా ఆ రోజుల్లో నాన్నకి అందుబాటులో లేని ధర. ఇలా కొన్నేళ్లపాటు ఆ రికార్డు అరిగిపోయేదాకా తిరిగాక, అప్పటికి నా తరువాత భారతీ పెద్దమనిషయ్యింది, మొత్తానికి ఈ ముత్యాల గొలుసులు ఇంటికి చేరాయి. ఇంటికి చేరాయన్నమాటే కరెక్ట్, ఎందుకంటే, ఏదో వచ్చిన రోజు మెళ్ళో వేసినా, ఓ గంట కల్లా వాటిని తీసేసి, బీరువాలో పెట్టేసారు మరి. మళ్ళీ మేమిద్దరం యధాప్రకారం బోసిమెడతో నాన్నకీ, బామ్మకీ యెదుటపడి తిరగటం. బామ్మ చెప్పీ, చెప్పీ ఊరుకుంది. కానీ బాధపడేది. పిల్లలకి ఇంత బంగారం పెడదామంటే, కుదరటం లేదే, అని బాధపడేది. ఓ రోజు నేను, 'బామ్మా, ఏమిటి బంగారం అంత ముఖ్యమా, నీకు అసలు బంగారమే లేదు కదా,' అని అడిగితే బోల్డు కబుర్లు చెప్పింది. నిజంగానే బామ్మ ఒంటిమీద చిన్నం ఎత్తు బంగారం ఉండేది కాదు. ఈ చిన్నం ఎత్తు అంటే నాక్కాట్టే తెలియదు కానీ, బామ్మ మాత్రం ఎప్పుడూ అతి తక్కువ బంగారం కొలత చెప్పాలంటే 'చిన్నం' అనేది. అన్నట్టు నాకు కాసు, తులం కాకుండా మరో బంగారం కొలత కూడా తెలుసు. అదేమిటంటే, మాడ. మా నందివాడ వారి ఇళ్లల్లో మంగళసూత్రాన్ని మూడు మాడలెత్తు బంగారంతో చేయిస్తారు. ఈ రోజుల్లో కంసాలులని వెళ్లి అలా అడిగితే తెల్లమొహం వేస్తారేమో. మా బామ్మ వంటిమీద చిన్నం ఎత్తు బంగారం లేకపోయినా సరే, బామ్మ ఠీవీ, దర్జాలలో మాత్రం ఏ తేడా ఉండేది కాదు. విత్ ఆర్ వితౌట్ బంగారం.... బామ్మ బామ్మే. చక్కటి తెల్లటి పంచెలో మెరిసిపోయేది. ఆ ముఖంలో కాన్ఫిడెన్స్ చూసి తీరాల్సిందే. అది కదా అసలు సిసలైన వుమన్ ఎంపవర్మెంట్ అనిపిస్తుంది నాకిప్పటికీ. సరే, మన బంగారం కథకొద్దాం.
బామ్మ అడిగితే తన బంగారం వివరాలు బోల్డు చెప్పేది. అడక్కపోతే అసలు ఆ ఊసే ఎత్తేది కాదు. మంచం మీద పడుకొని 'నామస్మరణా ధన్యోపాయం, నహి పశ్యామో భవతరణే, రామ హరే, కృష్ణ హరే....' అని పాడుకుంటూ ఉండేది. నేనే తీరిగ్గా వున్నప్పుడు వెళ్లి, 'బామ్మా, నీకు బంగారం యేమేముండేది చెప్పు' అంటే, అప్పుడు చిట్టా విప్పేది. కంఠే, కాసులపేరూ, చంద్రహారం, పలకసర్లూ, కాసికాయ గుళ్ళు, వడ్డాణం, వంకీలు, నెక్లేసులు, డజన్ల గాజులు, వంకీ గాజులు, బోల్డు ఉంగరాలు, దుద్దులూ.... అంటూ ఏవో నోరు తిరగని పేర్లతో ఓ లిస్ట్ చెప్పేది. కంఠె అంటే ఏమిటి బామ్మా అంటే, అది ఒక రౌండ్ రింగ్ లాగా కంఠానికి కడియం లాగా ఉంటుంది. కంఠానికి వేసుకుంటాం కనుకే, దానిపేరు కంఠె, అని చెప్పింది. ఏమో, నేను మాత్రం పాత సినిమాల్లో తప్ప కంఠె ఎప్పుడూ ఎవరూ పెట్టుకోగా చూడలేదు. 'పెద్ద ట్రంకు పెట్టె నిండా వెండి బంగారాలు తెచ్చుకున్నా, తెలుసా', అనేది. 'మరి ఇప్పుడు అవన్నీ ఏవి బామ్మా' అంటే, ' బావుందే, డజను మంది పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ ఎలా అయ్యాయి మరి' అన్నది. పొలం ఉందిగా, 'వ్యవసాయం చేసేదానివిగా' అంటే, "దాంతో ఏదో తిండీ, బట్టా నడిచేవి అంతే, పైగా ఆడ వ్యవసాయం. మీ తాతయ్యేమో, ఆయన పూజలూ, హోమాలూ, నిత్యాగ్నిహోత్రాలూ, వేదపాఠాలూ, పఠనాలూ అంటూ కూర్చునేవారు. ఇంత సంసారం..... దాంతో నాకు తప్పేది కాదు. అక్కడికీ మా ఆడబడుచు ఇంట్లో వుండి అన్నిట్లో తోడు ఉండేది కనుక ఆ మాత్రమైనా జరిగింది. అయినా మీ తాతగారి ఆచారానికి ఆవిడ వండితే పనికొచ్చేది కాదు. విధవరాలు కదా. అందుకని నేనే పిల్లలకి స్నానాలూ అవీ చేయించాక చంటి పిల్లలని పాలిచ్చి పడుకోపెట్టి, పెద్దపిల్లలకు చద్దన్నాలు పెట్టీ, తరువాత మడి కట్టుకునేదాన్ని. వంటంతా అయ్యేవరకూ పిల్లలు లేచేవాళ్ళు కాదు. అప్పటికీ మీ తాతగారి పూజ అయితే, మహానైవేద్యం పెట్టి, భోజనాలన్నీ అయ్యాక, అప్పుడు కానీ పైపనికి కుదిరేది కాదు." అంటూ పెద్ద పాఠం చదివేది.
ఇంతకీ నీ బంగారం ఏం చేసావ్ చెప్పు అంటే, "నలుగురు ఆడ పిల్లలకి పెళ్లి చేశామా, అందుకు కొంత బంగారం ఖర్చయిపోయింది. ఆ తరవాత మగపిల్లల చదువులకి కొంత బంగారం ఖర్చయిపోయింది. అందరినీ డిగ్రీ దాకా చదివించాం కదా. నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం పొలం కూడా అమ్మేసాం. సరైన రాబడి లేక, నేను చెయ్యలేక, చేసేవాళ్ళు లేక అమ్మేసా. పిల్లలు వ్యవసాయం కన్నా చదువు మీదే ఎక్కువ శ్రద్ధ చూపించేవాళ్ళు. పోన్లే, వాళ్ళనైనా చదువుకుని బాగుపడనీ, అని పొలం చాలావరకు అమ్మేసాం. ఒక్కో చదువుకు ఒక్క బంగారువస్తువు వెళ్లిపోయేది. నా వేలి చిట్ట చివరి ఉంగరం కూడా కొత్త కాపురం పెట్టాలమ్మా అంటే, మా అబ్బాయికి ఇచ్చేసా. అదే నా చివరి వస్తువు, అంతే. తరువాత మీ నాన్న పెళ్లి అవుతూనే, ఇక లాభం లేదని, వూళ్ళో మిగిలిన పొలం కూడా అమ్మేసి అందరం బెజవాడ చేరుకున్నాం. ఆ తరువాత అంతా ఆ ఉన్న దాంతో, మీ నాన్నా, హరీ, సాంబుడూ తెచ్చిన దాంతో జరిగేది. పోన్లే, పిల్లలందరూ పైకొచ్చారు. సంతోషం" అనేది. బంగారం లేదని దిగుల్లేదా బామ్మ అంటే, దిగులెందుకే, ఏం తీసుకుపోతాం కనక, అని ఎదురు ప్రశ్న వేసేది. 'లక్షాధికారియైన లవణాన్నమే గాని బంగారు కణికలు మింగబోడు' అని వేదాంతం చెప్పేది. ఎప్పుడూ నిర్విచారంగా ఉండేది. ట్రంకు పెట్టెడు వెండి, బంగారాన్ని, పండించే పొలాన్నీ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం మరో ఆలోచన లేకుండా అమ్మేయగలిగింది బామ్మ. అప్పటికి తాతగారు లేరు.
తాతగారు సంస్కృత పండితుడు. మంచి వేద పండితుడు. తన పూజా, పాఠం తప్ప మరేవీ పట్టేవి కావని బామ్మ .అంటూండేది. వాళ్ళ అప్పగారు ఆదెమ్మగారు (ఈవిడ అక్కో, చెల్లెలో ఖచ్చితంగా తెలియదు. పెద్ద పెద్దనాన్న రెండురకాలుగానూ రాశారు. ఒకచోట అప్పగారు అని రాస్తే, వంశవృక్షం లైన్లో తాతగారి తరువాత ఆవిడ పేరు రాశారు. లక్ష్మీ నరసమ్మ గారు మాత్రం ఖచ్చితంగా చెల్లెలే) ఇచ్చిన పొలం కూడా చేసుకోలేక పోయేవారు. ఏదో కోర్ట్ లావా దేవీల్లో కోర్టులో హాజరయినప్పుడు, జడ్జిగారు, 'నువ్వు పుట్టు శాస్త్రివా, పెట్టు శాస్త్రివా' అని అడిగారట. దానికి మా తాతగారు, 'నేను పుట్టు శాస్త్రి నేనండీ' అని చెప్పారట. ఈ విషయం బామ్మా, అమ్మా, నాన్నా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆయన ఏనాడూ ఏ యాత్రలూ చెయ్యలేదు. ఇంట్లో వైశ్వదేవం, నిత్యాగ్నిహోత్రం, వేద పారాయణం వగైరా ఉండేవి. ముగ్గురు, నలుగురు వేద విద్యార్థులకి వేదం బోధించేవారుట. మా తాతగారు పోయిన తరువాత కూడా ఈ శిష్యులు ఆయన ఆరాధనకి భోక్తలుగా వారంతట వారే వచ్చేవారు. ఆయనకి తన 62 వ ఏట సన్న్యాసం తీసుకోవాలనే కోరిక కలిగింది. అలా సన్న్యాసం తీసుకుంటే తన ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం ఏర్పడింది. కానీ దానికి బామ్మ ఒప్పుకోలేదుట, మగతోడు లేకుండా ఇంత సంసారం ఎలా అని. తాతగారు మాత్రం సన్న్యాసం కోసం చాలా పంతం పట్టారుట. అలా మూడేళ్లు గడిచాయి. ఈ లోపల ఆ కోర్ట్ కేసు ఎవరిపైనైతే గెలిచారో వారు భోక్తగా పిలిచేసరికి వారింటికే భోజనానికి వెళ్లారుట. బామ్మ యెంత వద్దన్నా వినలేదుట. ఓ మూడు రోజుల తరువాత సాంబాబాయ్, శ్రీధర్ బాబాయ్ లతో కలిసి పొలం వెళ్లి తిరిగి వస్తుంటే ఓ కాలువలో పడిపోయారుట. లేచి ఎలాగో ఇంటికి చేరారు కానీ, పక్షవాతం వచ్చి, మాటా, కాలూ పడిపోయాయిట. మరి ఇక లేవలేదు. అల్లాగే మూడేళ్లు వున్నారుట. బామ్మ ఒప్పుకోగా, చివరి రోజుల్లో ఆతుర సన్న్యాసం తీసుకున్నారు. ఆ కుటుంబంలో అందరూ కూడా తరతరాలుగా ఆతుర సన్న్యాసం తీసుకున్నవాళ్ళే. మా పెద్ద పెదనాన్న కూడా ఆ పరంపరలో ఆతుర సన్న్యాసం తీసుకున్నారు. చివరి రోజుల్లో సాంబాబాయ్ కూడా ఆతుర సన్న్యాసం తీసుకున్నాడా, ఏమో....
బామ్మ పాపం, అన్నీ తట్టుకుంది. ఆడదాన్నని అలుసు చేస్తారేమో అనే భయంతో, నోరెట్టుకుని సంసారాన్ని లాక్కు వచ్చింది. ఇన్నేళ్లయినా మా కుటుంబంలో మా అందరి మధ్యా ఇంత ప్రేమా, ఆపేక్షా వున్నాయంటే, అది ఆవిడ చలవే. పెట్టెడు బంగారం వున్నా, ఆవిడకి దానిమీద లోభం, మమత లేవు. బంగారం కన్నా చదువులకే ప్రాధాన్యత నిచ్చింది. పిల్లలకు వ్యవసాయం మీద ఆసక్తి లేదని గ్రహించి, వాళ్లకు నచ్చిన చదువులు చదివించింది. పై చదువులు, వాళ్ళే చదువుకున్నారు. తనకి స్త్రీ ధనంగా వచ్చిన పొలం మీదా అది తనదే అన్న భావన లేదు. ఒంటి నిండా బంగారం వున్నా, లేకున్నా ఒకేలా ఉండేది. అదీ ఆవిడ కారెక్టర్. తనకేమీ మిగుల్చుకోకపోతే పెద్ద వయసులో పిల్లలు చూడరేమో అన్న బెంగ ఆవిడకి ఏనాడూ లేదు. తన పెంపకం మీద అంత నమ్మకం ఆవిడకి. ఏనాడూ, పిల్లలే తన దగ్గరున్నట్టు ఫీల్ అయేది కానీ, తానూ పిల్లల దగ్గర ఉన్నట్టు ఫీల్ అయ్యేది కాదు. వంట ఇల్లు వదిలాక కాస్త ఆవిడ పెత్తనం తగ్గింది. అయినా ఏనుగు ఏనుగే అన్నట్టు, బామ్మ బామ్మే. అదే బామ్మ. అదీ బామ్మ. దట్ ఈజ్ బామ్మ. అందరూ భయంగా భక్తిగా 'వియ్యమ్మగారూ' అని గౌరవించే బామ్మ, దగ్గర వాళ్ళు ప్రేమగా, ఆప్యాయంగా 'వియ్యాం' అని పిలుచుకునే బామ్మ. ఆరుగొలనులో పొలం గట్టు మీద నుంచుని పని చేయించిన మొదటి లేడీ రైతు బామ్మ. నందివాడ విజయరామమ్మ.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి